పల్లాకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్,లోకేష్‌ల ఓదార్పు

అనారోగ్యంతో కన్నుమూసిన పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం.;

Update: 2025-06-07 12:28 GMT

ఆంధ్రప్రదేశ్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన విశాఖపట్నం కేర్‌ ఆసుపత్రిలో విచికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం తుది శ్వాస విడిచారు.

పల్లా సింహాచలం గతంలో విశాఖ–2 నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. తొలుత కాంగ్రెస్‌ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన సింహాచలం తర్వాత టీడీపీలోకి మారారు. 1983లో కాంగ్రెస్‌ నుంచి, 1989లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1994లో టీడీపీ అభ్యర్థిగా విశాఖ–2 నుంచి గెలుపొందారు. 1999లో పోటీకి దిగలేదు. తిరిగి 2004లో రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సారిపల్లి రంగరాజు చేతిలో ఓడిపోయారు. నాలుగు సార్లు పోటీ చేసి ఒక సారి గెలిచారు. పల్లా శ్రీనివాసరావు పల్లా సింహాచలం మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు స్పందించారు. పల్లా శ్రీనివాసరావును ఓదార్చే ప్రయత్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం మరణంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశాఖ–2 ఎమ్మెల్యేగా సింహాచలం బాగా పని చేశారని పేర్కొన్నారు. పల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం విశాఖ నగరం, పరిసర ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పల్లా సింహాచలం మరణం బాధాకరమని, పితృవియోగంతో దుఃఖంలో ఉన్న పల్లా శ్రీనివాసరావు కుటుంబానికి ప్రగాభ సానుభూతిని తెలిపారు.

పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం మరణం పట్ల మంత్రి నారా లోకేష్‌ తీవ్ర సంతాపం తెలిపారు. పల్లా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 1989 నుంచి ఆయన టీడీపీకి సేవలు అందించారని పేర్కొన్నారు. సౌమ్యుడైన సింహాచలం అక్కడ ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు.



Tags:    

Similar News