క్రియేటివిటికి కేరాఫ్ చంద్రబాబు
హరిద్వార్ నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలాన్ని సీఎంకు అందజేసిన బాబా రామ్ దేవ్.;
క్రియేటివిటి, ప్రొడక్టివిటి, ప్రోఫెషనలిజం, ఎఫీషియన్సీ లాంటి అంశాలకు కేరాఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు అంత సద్గుణ సంపన్నమైన, దార్శనికమైన నాయకుడు దేశంలో ఎవరూ లేరని పొగడ్తల వర్షం కురిపించారు. శుక్రవారం విజయవాడలో జరిగిన ఏపీ టూరిజం కాన్క్లేవ్లో యోగా గురు బాబా రామ్ దేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలకు దేవుడు పంపించిన వరదానం చంద్రబాబు నాయుడు అంటూ పేర్కొన్నారు. చంద్రబాబు చేసేంత విజన్ మరెవరూ చేయటం లేదని కచ్చితంగా చెప్పగలను అంటూ కితాబిచ్చారు.
యోగా ఆయుర్వేద, నేచురోపతి లాంటి అంశాలు పర్యాటక ప్రాంతాల్లో అవసరమన్నారు. హార్సిలీ హిల్స్, అరకు, విశాఖ, రాజమహేంద్రమరం, పిచ్చుకలంక, సూర్యలంక లాంటి మంచి పర్యాటక ప్రాంతాలు ఏపీలో ఉన్నాయన్నారు. పారిస్, స్విట్జర్లాండ్, టర్కీ లాంటి దేశాలకు పర్యాటకం కోసం వెళ్తున్నాం.. కానీ మనదేశంలోనే అంతకు మంచి మరిన్నో ప్రకృతి అందాలున్నాయన్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో అంతకంటే సుందరమైన ప్రాంతాలు ఉన్నాయన్నారు. వీటిని అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని బాబా రామ్దేవ్ అన్నారు. నదీ తీరం, సముద్ర తీరాలు, సుందరమైన ప్రకృతి వనరులు చాలా ఉన్నాయి.
దిండి లాంటి ప్రాంతాల్లో వెడ్డింగ్ క్రూయిజ్ లేదా బోట్ లాంటి ప్రాజెక్టులు చేపడతామన్నారు. వెడ్డింగ్ డెస్టినేషన్గా ఈ ప్రాంతాన్ని మార్చాలని ఆసక్తి చూపిస్తున్నామన్నారు. భారతీయ సంప్రదాయ పరంగా వివాహాలు జరిపించేలా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రాజెక్టును చేపట్టాలన్నారు. ఏపీలో పతంజలి సంస్థ వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు ఈ వయస్సులోనూ ఎంతో చలాకీగా నిర్ణయాలు, పాలన చేస్తున్నారని, చంద్రబాబు తన బయోలాజికల్ వయస్సును రివర్స్ చేసేశారని బాబా రామ్దేవ్ అన్నారు. హార్సిలీ హిల్స్ ను ప్రపంచ ఐకానిక్ వెల్ నెస్ సెంటర్ గా మారుస్తామన్నారు.
ఏపీ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ బాబా రామ్దేవ్ ప్రకటించారు. ఉత్తర భారత్ వాసులకు ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాలు చాలా తెలియవని, వాటి గురించి పరిచయం చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఏపీని ప్రపంచ పర్యాటక మ్యాప్ లో నెంబర్ వన్ గా మార్చాలన్నారు. దేశంలోని చాలా వైవిధ్యమైన ప్రాంతాలు ఉన్నాయని, అందులో హార్సిలీ హిల్స్ ఒకటని, హార్సిలీ హిల్స్ హిమాలయాల్లో ఉన్నట్టుగా చల్లని వాతావరణంతో ఉంటుందన్నారు. అన్ని రకాల వాతావరణం ఏపీలో ఉందన్నారు. ఏపీలో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక విజన్ అమలు చేస్తున్నారని బాబా రామ్దేవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరిద్వార్ నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు.