పిల్లలూ బాగున్నారా..చంద్రబాబు టీచరయ్యారు
నిత్యం అధికారులు, ప్రజా ప్రతినిధుల సమావేశాలతో బిజీ బిజీగా ఉంటే సీఎం చంద్రబాబు గురువారం టీచర్గా మారారు.;
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉపాధ్యాయుడుగా మారారు. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ కమిటీ సమావేశానికి మంత్రి నారా లోకేష్తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కొద్ది సేపు ఉపాధ్యాయుడిగా మారారు. తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు. ఏం పిల్లలు బాగున్నారా అంటూ తరగతిలోకి ఎంట్రీ ఇచ్చారు. చేతిలో పాఠ్యపుస్తకం పట్టుకుని ‘వనరులు’ అనే పాఠ్యాంశం మీద తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు. వనరులు ఎన్ని రకాలు, అవి ఎలా ఉపయోగపడుతాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి అనే పలు అంశాల మీద విద్యార్థుల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మద్య మధ్యలో విద్యార్థులను ప్రశ్నలు వేస్తూ.. వారి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే ఎప్పుడూ రాజకీయ ప్రసంగాలు చేసే అలవాటు ఉండటం వల్ల సహజంగా ఆయన నుంచి వచ్చే కొన్ని పదాలు అక్కడక్కడా దొర్లినా.. విద్యార్థులకైతే వనరుల పాఠం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. భవిష్యత్లో ఏమి కావాలనుకుంటున్నారనే వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు తరగతిలో పాఠాలు చెబుతున్న సమయంలో మంత్రి నారా లోకేష్ కూడా పిల్లలతో కూర్చుని శ్రద్ధగా విన్నారు.