రైతుల నుంచి ఉల్లిని తక్షణమే కొనుగోలు చేయండి
ఏపీలో ఉల్లి రైతుల ఇబ్బందులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.;
రైతుల నుంచి ఉల్లిని తక్షణమే కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం నుంచే క్వింటాకు రూ.1200 చెల్లించి ఉల్లిని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై గురువారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, మార్కెటింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు. ఉల్లి రైతుల పరిస్థితి, ఉల్లి ధరలు ఏ మేరకు ఉన్నాయనే అంశంపై చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఉల్లి పంటకు సంబంధించిన క్రయ విక్రయాలపై అంశంపై చర్చించారు. ఉల్లి పంట దెబ్బ తిన్న కారణంగా.. మహారాష్ట్ర ఉల్లి పంట ఎక్కువగా ఉన్న కారణంగా ధరల విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు. వచ్చే పది రోజుల్లో 5 వేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వచ్చే అవకాశం ఉందని సీఎంకు అధికారులు వివరించారు.