హెలిపాడ్‌ సౌకర్యంతో తిరుపతిలో బస్‌ స్టేషన్‌

13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన ఈ బస్‌ స్టేషన్‌ కనీసం లక్ష మంది నిత్యం రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మాణం చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.;

Update: 2025-09-14 16:08 GMT

రోజురోజుకు పెరుగుతున్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్‌ స్టేషన్‌ నిర్మించాలని, అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్మెంట్‌ లిమిటెడ్, ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా నిర్మించే బస్‌ స్టేషన్‌లో సుమారు 150 బస్సులు ఒకేసారి నిలిపి ఉంచేలా బస్‌ బే ఉండాలని, హెలిపాడ్‌ సౌకర్యంతో పాటు, రోప్‌ వే, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, మాల్స్, మల్టీ ప్లెక్స్‌లు వంటి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్‌ స్టేషన్‌ డిజైన్లు రూపొందించాలని అధికారులకు సూచించారు.

రెండు బస్‌ ఎంట్రీలు, ఎగ్జిట్‌ వేలు 2 ఏర్పాటు చేయాలని, సోలార్‌ రూఫ్‌ టాప్‌తో సొంత విద్యుత్‌ అవసరాలు తీర్చుకునేలా బస్‌ స్టేషన్‌ ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన ఈ బస్‌ స్టేషన్‌ కనీసం లక్ష మంది నిత్యం రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మాణం చేయాలన్నారు. భవిష్యత్‌లో అన్నీ ఎలక్ట్రికల్‌ బస్సులే నడపనున్న నేపథ్యంలో ప్రతీ బస్సుకు చార్జింగ్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి సంబంధించి మొత్తం 5 మోడల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. వాటిని మరింత అభివృద్ధి చేయాలన్నారు. దీనికోసం స్టేక్‌ హోల్డర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. అలాగే రాష్ట్రంలో అన్ని బస్‌ స్టేషన్లు ఆధునీకరించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
Tags:    

Similar News