సీఎం చంద్రబాబు మోసాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశానిర్థేశం చేశారు. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను.. వాటిని అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’, ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’, ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తు చేస్లూ’ వంటి పేర్లతో కూటమి ప్రభుత్వ పాలనను ఎండగట్టే కార్యక్రమాలను ఐదు వారాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని ఆదేశించారు. తాడేపల్లి వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు ఈ సమావేశానికి హజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది.. ఈ ఏడాది కాలంలో చేసిందేమీ లేదు.. కానీ చాలా చేశామని చెప్పుకుంటున్నారు.. ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని, మోసం, అబద్దాలతో కూడిన కూటమి పాలన తీరును ప్రజల్లో ఎంగట్టాలని అన్నారు. దీని కోసం చేపట్టే ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో’, ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ’ పేరుతో ఐదు వారాలపాటు నిర్వహించే కార్యక్రమాల క్యూఆర్ కోడ్ను జగన్ ఆవిష్కరించారు. ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాలను చేర్చే విధంగా నిర్వహించాలని నాయకులకు జగన్ దిశా నిర్థేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి ఏడాది పూర్తి అయ్యింది. ఇంత తక్కువ వ్యవధిలో కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఇలా ఏడాది కాలంలో ఏ ప్రభుత్వంపైన కూడా ఇంత పెద్ద స్థాయిలో వ్యతిరేకత రాలేదని జగన్ అన్నారు. కూటమి ప్రభుత్వం కానీ సీఎం చంద్రబాబు కానీ ఈ వ్యతిరేకత మ«ధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి, ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. దీని కోసం ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల గొంతును అణిచివేసేందుకు చూస్తున్నారంటూ జగన్ మండిపడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తోంది. మన 5 ఏళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందించాం. పార్టీ చూడకుండా మంచి చేశాం. కానీ ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, విచ్చలవిడిగా అన్యాయాలు కనిపిస్తున్నాయి అంటూ మండిపడ్డారు.
తమ ప్రభుత్వంలో విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతో పాటు, పాలనలో పూర్తి పారదర్శకత చూపామన్నారు. కానీ చంద్రబాబు ఈ ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదన్నారు. ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి, ఇంకా ఎంత నష్టం జరుగుతోంది, మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే, ఎన్ని ప్రయోజనాలు జరిగి ఉండేవి అనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. చంద్రబాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు.
ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు? జగన్ చేస్తున్నవే కాకుండా అంతకు మించి ఇస్తానన్నారు. జగన్కన్నా ఎక్కువ చేస్తానన్నారు. ఆ మాటలు చెప్పడమే కానీ చేతల్లో ఏమీ లేదన్నారు. తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాల గురించి ప్రజలకు చెప్పాలన్నారు. బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి, పచ్చి మోసం చేశారని జగన్ మండిపడ్డారు. వీటిని ప్రజలకు వివరించాలన్నారు. ఇలా పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారని, దీని వల్ల నిరుపేదలకు వైద్య సేవలు అందడం లేదన్నారు. ఆరోగ్య ఆసరా లేనే లేదన్నారు. చేయూత, ఆసరా.. ఇలా ఏ పథకం కూడా లేదన్నారు. రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమం మొదలు పెట్టి 5 వారాలు చేద్దామన్నారు. తొలుత పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు. పార్టీ జిల్లా అధ్యక్షులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు.
రెండో దశలో నియోజకవర్గ స్థాయిలో, మూడో దశలో మండల స్థాయిలో క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ చేపట్టాలని దిశా నిర్థేశం చేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడే గ్రామస్థాయిలో కూడా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలన్నారు. చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడమే మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఇవి కాకుండా, చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పాడు? పథకాల వారీగా వివరిస్తూ.. వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అనే విషయాలను కూడా ప్రజలకు తెలియజేయాలన్నారు. తల్లికి వందనం మొదలు ఉచిత బస్సు వరకు అన్నీ నేను మాట్లాడిన మాటలు.. పక్కనే చంద్రబాబునాయుడివి నాటి మాటలు చూపుతూ.. సూటిగా ప్రశ్నించేలా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వంపైన ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే, కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈనెల 4న ‘వెన్నుపోటు దినం’ బాగా చేశారని, మొన్నటి యువత పోరు కార్యక్రమం కూడా బాగా చేశారని ఈ సందర్భంగా నాయకులకు జగన్ అభినందనలు తెలిపారు.