ఏపీ ప్రభుత్వం రెండు కీలక ఒప్పందాలు
మంత్రి నారా లోకేష్ సమక్షంలో సంస్థ ప్రతినిధులు ఎంఓయు కుదుర్చుకున్నారు.;
By : The Federal
Update: 2025-05-05 14:56 GMT
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రెండు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలోనే ఈ రెండు ఒప్పందాలు జరిగాయి. ప్రభుత్వ, సంస్థల ప్రతినిధులు సంతకాలు పెట్టి ఎంఓయు కుదుర్చుకున్నారు. అందులో ష్నైడర్ సంస్థ ఒకటి కాగా, ఒరాకిల్ సంస్థ రెండోది.
ఆంధ్రప్రదేశ్లో అభృవృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అడ్వాన్డ్స్ టెక్నాలజీలో యువతకు శిక్షణ ఇచ్చే విధంగా ఒరాకిల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. యువతకు శిక్షణ ఇచ్చి, వర్క్ ఫోర్స్ను సిద్ధం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒరాకిల్ సంస్థ ప్రతినిదులు, ఏపీఎస్ఎస్డీసీ ప్రతినిధులు ఎంఓయులపై సంతకాలు చేశారు. దీని ద్వారా ఎంపిక చేసిన యవతకు ఒరాకిల్ యూనివర్శిటీ లెర్నింగ సబ్స్క్రిప్షన్ కెంటెంట్ను ఉచితంగా ఇవ్వనున్నారు.
ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రధాన లక్ష్యంగా, వారికి శిక్షణ ఇచ్చేందుకు మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. ష్నైడర్ అనే సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ష్నైడర్ ఎలక్ట్రానిక్ ఇండియా ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు, ఏపీఎస్ఎస్డీసీ ప్రతినిధులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ఐటీఐలు, పాలిటెక్నిక్ కళశాలలు, నాక్(ఎన్ఏసీ) శిక్షణా కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తారు.
శిక్షణ కోసం నాలుగు న్యాక్ సెంటర్లు, అరకు, రాజమండ్రి, నర్సీపట్నం, నూజివీడు, ఒంగోలు, ఏఎస్పేట, కార్వేటినగరం, కడప, శ్రీశైలంలోని 9 ప్రభుత్వ ఐటీఐలు, శ్రీకాకుళం, గుంటూరు, అనంతపురం, చంద్రగిరి, నంద్యాల, గన్నవరం, ఒంగోలులోని 7 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఎంపిక చేశారు.
మంగళగిరిలో ఒక ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు, అనంతపురంలో ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యుత్ వినియోగాన్ని ఆధునీకరించే మోడ్రన్ పవర్ ఆప్టిమైజేషన్ పైలెట్ ప్రాజెక్టును కూడా ఈ ష్నైడర్ సంస్థ చేపట్టనుంది.