స్పీకర్ల సదస్సులో ఆర్ఆర్ఆర్ కీలక సూచన

ఏడాదికి కనీసం 60 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు వుండాలన్న ఏపీ ఉప సభాపతి;

Update: 2025-08-25 06:45 GMT

ప్రజా సమస్యలపై చర్చలకు వేదిక అయిన అసెంబ్లీ సమావేశాలు జరిగే సగటు కాలం తగ్గిపోతుండటం పట్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఏడాదికి కనీసం 60 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు వుండాలని ఆయన ప్రతిపాదించారు.ఢిల్లీలోని అసెంబ్లీ భవనంలో నిర్వహించిన అఖిల భారత స్పీకర్ల సదస్సులో ఆర్ఆర్ఆర్ ఈ ప్రతిపాదన తెచ్చారు.దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే చట్టసభలు ఏడాదికి కనీసం 60 రోజులైనా సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రెండు సమావేశాల మధ్య గరిష్ఠ విరామం 180 రోజులు మించకూడదు అనే రాజ్యాంగ నిబంధనను చాలా రాష్ట్రాలు, ఏపీ కూడా, కేవలం ఆ పరిమితిని చేరుకునేలా మాత్రమే పాటిస్తున్నాయని ఇది సరియైన దిశ కాదని ఆయన వ్యాఖ్యానించారు.స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో పార్లమెంటు సగటున 135 రోజులు నడిచేదని అన్నారు. కానీ తాను ఎంపీగా ఉన్న 17వ లోక్‌సభలో సగటు పని దినాలు 55 రోజులు మాత్రమేనని రఘురామ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీల సగటు దినాలు 35 నుంచి 40 మధ్యకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్డినెన్సుల పరిపాలనపై ఆధారపడకుండా, చర్చలకు, సమాలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శాసన వ్యవస్థ బలంగా నిలవాలంటే నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉపసభాపతి స్పష్టం చేశారు.చట్టసభల పని దినాలు పెంచేందుకు మనమంతా ప్రతినబూనాలని స్పీకర్లకు పిలుపునిచ్చారు.
చట్టసభల సజీవతను పరిరక్షించి చూపితేనే ,స్వాతంత్య్రానికి పూర్వం సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కి తొలి భారతీయ ప్రెసిడెంట్‌గా పనిచేసిన విఠల్‌భాయ్ పటేల్ వంటి చారిత్రక నాయకుల సేవలను నిజంగా గౌరవించినట్లవుతుందని,వారి ఆదర్శాలను అనుసరించాలని రఘురామ సూచించారు.
Tags:    

Similar News