‘బంగారు కుటుంబాలు’ లక్షల్లో..‘మార్గదర్శకులు’ వేలల్లో

ఆంధ్ర బంగారు కుటుంబాల దత్తత పట్ల ఉత్సాహం చూపని ధనవంతులు.;

Update: 2025-06-13 06:22 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పీ–4 అనే సరికొత్త కర్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పబ్లిక్, ప్రై వేటు, ప్రభుత్వ పార్టనర్‌షిప్‌తో జీరో పావర్టీ సాధించడమే లక్ష్యంగా దీనిని తెరపైకి తెచ్చింది. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న 10 శాతం మంది ధనవంతులు, సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను దత్తత తీసుకొని వారి అభ్యన్నతికి కృషి చేసే విధంగా ప్రభుత్వం పీ–4ను రూపొందించింది. సాయం చేయడానికి వచ్చే వారిని మార్గదర్శకులుగాను, సాయం పొందేవారిని బంగారు కుటుంబాలుగాను కూటమి ప్రభుత్వం పేర్కొంది. 

ఉగాది నాడు శ్రీకారం
‘మార్గదర్శి–బంగారు కుటుంబం’ పేరుతో పీ–4 కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ఉగాది పర్వదినం రోజున ప్రారంభించింది. ఉగాది రోజు తలపెట్టే ఏ కార్యక్రమమైన విజయవంతం అవుతందనే సెంటిమెంట్‌తో ఈ కార్యక్రమాన్ని కూడా ఉగాది రోజున తలపెట్టారు. మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగాను, అమరావతి ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయేల్‌ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ప్రభుత్వం ఎంపిక చేసింది.
బంగారు కుటుంబాన్ని ఇలా ఎంపిక చేస్తారు
ఆంధ్రప్రదేశ్‌లో అట్టడుగున ఉన్న పేద కుటుంబాలను గుర్తించేందుకు రెండు దశల్లో సర్వే చేపట్టారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి మొదటి వారం వరకు 10 జిల్లాల్లో తొలి విడత సర్వే చేపట్టారు. తక్కిన జిల్లాల్లో మార్చి 8 నుంచి మార్చి 21 వరకు రెండో విడత కింద వివరాల సేకరణ పూర్తి చేశారు. వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో ఈ వివరాలను సేకరించారు. అనంతరం గ్రామ సభల ద్వారా బంగారు కుటుంబాలను ఎంపిక చేశారు. కరెంటు సౌకర్యం లేని వాళ్లు, వంట గ్యాస్‌ ఉపయోగించుకునే శక్తి లేని వారు, సంపాదనాపరులు లేని కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించారు.
జిల్లాల వారీగా బంగారుకుటుంబాలు
రాష్ట్ర వ్యాప్తంగా 19,15,771 బంగారు కుటుంబాలను గుర్తించారు. ఈ కుటుంబాల్లో 53,62,751 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 92683 బంగారుకుటుంబాలు ఉండగా, అనకాపల్లి జిల్లాలో 64518, అనంతపురం జిల్లాలో 68,381, అన్నమయ్య జిల్లాలో 62621, బాపట్లలో 62388, చిత్తూరులో 65451, కోనసీమ జిల్లాలో 64549, తూర్పుగోదావరి జిల్లాలో 66,475, ఏలూరు జిల్లాలో 99905, గుంటూరు జిల్లాలో 10,3863 బంగారుకుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు.
కాకినాడ జిల్లాలో 102450, కష్ణా జిల్లాలో 67580, కర్నూలులో 64166, నంద్యాలలో 43021, ఎన్టీఆర్‌ జిల్లాలో 86398, పల్నాడులో 81686, పార్వతీపురం మన్యంలో 42815, ప్రకాశంలో 74911, నెల్లూరులో 106878, శ్రీసత్యసాయి జిల్లాలో 54601 బంగారు కుటుంబాలు ఉన్నాయని సర్వేలు, గ్రామ సభల ద్వారా తేల్చారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 75566, తిరుపతిలో 80477, విశాఖపట్నంలో 73,939, విజయనగరంలో 67066, పశ్చిమ గోదావరిలో 64940, కడప జిల్లాలో 78443 బంగారు కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు.
దత్తత తీసుకున్న బంగారు కుటుంబాలు
కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ వినూత్న ‘మార్గదర్శి–బంగారుకుటుంబం’కు స్పందన వచ్చినట్టే లభిస్తోంది. పేద కుటుంబాలను అన్ని విధాల అభివద్ది చేసేందుకు ధనవంతుల కుటుంబాలు మార్గదర్శులుగా సాయం చేసేందుకు కొంత మంది ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారుకుటుంబంగా పేదకుటుంబాలు వారి నుంచి సాయం పొందేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. జీరో పావర్టీ, పీ–4, మార్గదర్శి–బంగారు కుటుంబం అంశాల మీద ఇటీవల గత గురువారం సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు 70,272 బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో 26,340 బీసీ కుటుంబాలు, 14,024 ఎస్సీ కుటుంబాలు, 13,115 ఎస్టీ కుటుంబాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే నాటికి నేటికీ ఈ సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 83,898 బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. జిల్లాల వారీగా ఒక సారి దత్తత పరిశీలిస్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9,238 బంగారు కుటుంబాలను, అనకాపల్లి జిల్లాలో 17,735, అనంతపురం జిల్లాలో 801, అన్నమయ్య జిల్లాలో 1864, బాపట్లలో 43588, చిత్తూరులో 5038, కోనసీమ జిల్లాలో 5, తూర్పు గోదావరి జిల్లాలో 211, ఏలూరులో 208, గుంటూరు జిల్లాలో 107 బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారు.
కాకినాడ జిల్లాలో 5, కష్ణా జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 22, నంద్యాలలో 777, ఎన్టీఆర్‌ జిల్లాలో 910, పార్వతీపురం మన్యంలో 3, ప్రకాశం జిల్లాలో 9, నెల్లూరు జిల్లాలో 699 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్న మార్గదర్శులు శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక్క కుటుంబాన్ని కూడా దత్తత తీసుకోవడానికి ముందుకు రాలేదు. వేలాది కుటుంబాలను ఇంకా దత్తత తీసుకోవలసి ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో కలిపి ఇంకా 18,31,872 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవలసి ఉంది.
10 కుటుంబాలను దత్తత తీసుకుంటానన్న కేంద్ర మంత్రి
పీ4, మార్గదర్శి–బంగారుకుటుంబం తదిత అంశాలపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విషయంలో ఉదారతతో ముందుకు రావాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఆగస్టు 15 నాటికల్లా 15లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా చూడాలని వారికి సూచించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ముందుకొచ్చారు. 10 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. నూజివీడు సీడ్స్‌ అధినేత ప్రభాకర్, కుశలవ గ్రూప్‌ సిద్ధార్థ, హ్యాపీ వ్యాపీ స్కూల్‌ అధినేత గౌతమ్, నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత నితిన్‌ కష్ణ, మోడల్‌ డైరీ అధినేత పిన్నమనేని ధనప్రకాశ్, ఎన్‌ఆర్‌ఐ కాలేజీ చైర్మన్‌ రావి వెంకటరావు, సిప్లాన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత అనంతయ్య వంటి ఎంతో మంది మార్గదర్శులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ముందుకొస్తున్నారు.
దత్తత తగ్గిన జిల్లాలు
కొన్ని జిల్లాలో దత్తత తీసుకునే మార్గదర్శుల సంఖ్య పెరుగుతున్నా.. మరి కొన్ని జిల్లాల్లో నామ మాత్రంగానే ఉంది. ఒక జిల్లాలో అయితే ఇంత వరకు ఒక కుటుంబాన్ని కూడా దత్తత తీసుకునేందుకు ముందుకు రాలేదు. కాకినాడ జిల్లాలో 102450 దత్తత కుటుంబాలు ఉంటే ఇప్పటి వరకు కేవలం 5 కుటుంబాలనే దత్తత తీసుకున్నారు. కృష్ణా జల్లాల్లో అయితే ఆ సంఖ్య ఇంకా తగ్గింది. ఈ జిల్లాలో 67580 బంగారు కుటుంబాలు ఉంటే కేవలం రెండు కుటుంబాలనే దత్తత తీసుకున్నారు. కర్నూలు జిల్లాలో 64166 బంగారు కుటుంబాలు ఉంటే 22 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. పార్వతీపురం మన్యంతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా పరిస్థితి మెరుగుపడలేదు. మన్యం జిల్లాలో 42815 బంగారు కుటుంబాలు ఉంటే ఇప్పటి వరకు 3 కుటుంబాలనే దత్తత తీసుకున్నారు. ప్రకాశంలో 74911 గోల్డెన్‌ ఫ్యామిలీస్‌ ఉంటే 9 కుటుంబాలనే అడాప్ట్‌ చేసుకున్నారు. ఇక శ్రీ సత్యసాయి జిల్లాలో అయితే దత్తత అనే మాటే వినపడ లేదు. ఈ జిల్లాలో 54601 బంగారు కుటుంబాలు ఉంటే ఒక్క కుటుంబం కూడా దత్తతకు నోచుకోలేదు. తిరుపతి, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో కూడా అంతంత మ్రాతంగానే దత్తత కనిపిస్తోంది. కడప జిల్లాలో 78443 బంగారు కుటుంబాలు ఉంటే 12, పశ్చిమ గోదావరి జిల్లాలో 64940 బంగారు కుటుంబాలుంటే 4, తిరుపతి జిల్లాలో 80477 బంగారు కుటుంబాలకు గాను 4, కోనసీమ జిల్లాలో 64549 బంగారు కుటుంబాలు ఉంటే 6 కుటుంబాలనే దత్తత తీసుకున్నారు.
బంగారు కుటుంబాలకు కలిగే మేలు
‘కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాల్లో ఇదొకటి’ అని బంగారుకుటుంబాలు–మార్గదర్శకులు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళిక సంఘం మాజీ వైస్‌ చైర్మన్‌ సి కుటుంబరావు తెలిపారు. ఇంకా దాని గురించి వివరిస్తూ.. పేదరికం నిర్మూలనకు ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందన్నారు. బంగారు కుటుంబాల్లో ఎంత మంది వ్యక్తులు ఉన్నారు.. వారు ప్రస్తుతం ఏమి చేస్తున్నారు.. వారికి ఎలాంటి సహాయం చేస్తే ఆర్థికంగా అభివద్ధి చెందుతారు.. అనే అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని ఆ ప్రకారం వారికి మేలు చేయడం జరుగుతుందని ‘ ది ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో మాట్లాడుతూ వివరించారు. వారి శ్రద్ధాశక్తులను కూడా పరిగణనలోకి తీసుకుని, ఆ ప్రకారం వారికి నైపుణ్యాభివద్ధి శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని, ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ‘మరొక ఇంపార్టెంట్‌ విషయం ఏంటంటే.. వారికి ఏదో అలా చేసేసి ఇలా వదిలేయం కాదు. వారిని చివరి వరకు విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. దాని కోసం ప్రత్యేకంగా ట్రాకింగ్‌ సిస్టమ్‌ కూడా ఉంటుంది. త్వరలో దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మోనటరింగ్‌ చేస్తూనే ఉంటాం. బంగారు కుటుంబాల్లో నమోదైన నాటి నుంచి వారిని మార్గదర్శకులు దత్తత తీసుకున్న నాటి నుంచి ఎప్పటికప్పుడూ ట్రాకింగ్‌ చేస్తూనే ఉంటాం. వారి అవసరాల మేరకు దత్తత తీసుకున్న మార్గదర్శకుల నుంచి సహాయ సహకారాలు అందించడం జరుగుతూనే ఉంటుంది’ అంటూ కుటుంబరావు వెల్లడించారు.
పెద్దగా ప్రయోజనం లేని కార్యక్రమం
‘కూటమి ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ‘బంగారు కుటుంబం– మార్గదర్శి’ కార్యక్రమం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం నిర్మూలన చేస్తామనేది ఒట్టి భ్రమ మాత్రమే’ అని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ ఈశ్వరయ్య అన్నారు. పేద ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం చంద్రబాబు తెచ్చిన ఒక కార్యక్రమం ఇది అని ఆయన అన్నారు. ఇది వరకే ‘సీఎస్‌ఆర్‌’ నిధులతో పేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలు చేశారని.. కానీ అది సక్రమంగా అమలు చేయలేదని ‘ది ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు. తెలుగుదేశం పార్టీలోనే చాలా మంది వ్యాపారవేత్తలు ఉన్నారని.. దత్తత తీసుకుని సహాయం చేయగలిగిన స్థితి మంతులు ఎంతో మంది ఉన్నారని.. కానీ వారు ఎవ్వరినీ దత్తత తీసుకునేందుకు ముందుకు రావడం లేదన్నారు. ‘ఏపీ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణ విద్యా సంస్థల్లో కానీ.. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు చెందిన విద్యా సంస్థల్లో కానీ.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు సంబందించిన విద్యా సంస్థల్లో కానీ.. పేదప్రజలకు అవకాశాలు కల్పించిది లేదు. ఇలా అనేక మంది వ్యాపారవేత్తలు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు.. వారెవ్వరు ముందుకు రాలేదని’ ఈశ్వరయ్య అన్నారు.
ఇది మంచి కాన్‌సెప్ట్‌
‘‘బంగారు కుటుంబం– మార్గదర్శి’ అనేది మంచి కాన్‌సెప్ట్‌ అని.. ఆర్థికంగా స్థితి మంతులు పేద ప్రజల కుటుంబాలను దత్తత తీసుకోవాలనేది చాలా మంచి ఆలోచన’ అని ఆంధ్ర యూనివర్శిటీ పొలిటికల్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ పూర్వపు శాఖాధిపతి, కైకలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పొలిటికల్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ గోవాడ వీర్రాజు అన్నారు. ప్రభుత్వం దీనిని అమలు చేస్తే తప్పకుండా సమాజంలో మార్చులు వస్తాయని, పేద ప్రజలకు చాలా వరకు మేలు జరుగుతుందన్నారు. దీని వల్ల పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు. ‘అయితే ప్రభుత్వం మార్గదర్శులను గుర్తించి.. వారిని ప్రోత్సహించాలి. దత్తత తీసుకునేందుకు వారు ముందుకు వచ్చే విధంగా వారితో సంప్రదింపులు చేయాలి. ఇలా చేయడం వల్ల మార్గదర్శులు దత్తత తీసుకునేందుకు ఆసక్తి కనబరిచే అవకాశం ఉంటుంది. దీనిని ఈ నాలుగు సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి.. సక్రమంగా అమలు చేయగలిగితే సమాజంలో అట్టడుగున ఉన్న పేద కుటుంబాలు ఆర్థికంగా ముందడుగు వేసేందుకు అవకాశాలు ఉంటాయి’ అని డాక్టర్‌ గోవాడ వీర్రాజు అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News