ఏపీ కల్చరల్ అఫైర్స్ కు ‘అంబేడ్కర్ స్మృతివనం’
సాంఘిక సంక్షేమ శాఖ నుంచి ఏపీ కల్చరల్ అపైర్స్ డైరెక్టర్ పర్యవేక్షణకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ స్మృతివనం;
సాంఘిక సంక్షేమ శాఖ అధీనంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ స్మృతివనం ను ఏపీ కల్చరల్ అఫైర్స్ (AP Cultural Affairs) కు బదిలీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా నిర్వహణ జరుగుతోంది. నిత్యం అంబేద్కర్ స్మృతివనంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలంటే స్మృతివనం యువజన సర్వీసుల శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న ఏపీ కల్చరల్ అఫైర్స్ డైరెక్టర్ కు బదిలీ చేస్తే మంచిదని ప్రభుత్వం భావించింది. దీంతో మంత్రి వర్గంలో చర్చించి ఏపీ కల్చరల్ అఫైర్స్ కు బదిలీ చేస్తూ తీర్మానించారు.
విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ను 'యథాతథంగా' కళ, సంస్కృతి, వారసత్వాన్ని ప్రోత్సహించే ధృక్పదంతో ప్రాంగణంలో క్రమం తప్పకుండా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయంతో నిత్యం కల్చరల్ కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని భావిస్తున్నారు. సుమారు 2వేల మంది ప్రేక్షకులు కూర్చొనే విధంగా కన్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ అహ్లాదకరమైన వాతావరణం ఉండేలా మొక్కలు పెంచుతారు. ఇకపై స్వరాజ్ మైదానంలో సాంస్కృతిక, కళా వైభవం పునరుద్దరణ జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.