నేడు విజయవాడలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్
అంతర్జాతీయ ఐటీ సంస్థల ప్రతినిధులు ఈ వర్క్ షాపులో పాల్గొంటున్నారు.;
By : The Federal
Update: 2025-06-30 03:57 GMT
ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ఏర్పాటులో తలమునకలయ్యారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం విజయవాడ నోవాటెల్ హోటల్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాపును నిర్వహిస్తున్నారు. దీనికి అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు.
సీఎం చంద్రబాదు నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వర్క్ షాపులో పాల్గొనేందుకు అంతర్జాతీయ ఐటీ సంస్థల ప్రతినిధుతు ఆదివారం రాత్రే విజయవాడకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి వీరికి విందు కూడా ఏర్పాటు చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలోనే ముఖ్యమంత్రి వారికి డిన్నర్ ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో ఈ పార్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని సీఎం వారికి వివరించారు.
టీసీఎస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ వి. రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్ కుమార్, ఏటీ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ మనీష్ వర్మ, భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్రా కె. ఎల్లా, హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జె.బి.వి. రెడ్డి, రెడ్డీ ల్యాబ్స్ ఫణి మిత్ర, అస్ట్రా జెన్గా ఎండీ ప్రవీణ్ రావు, ఐబీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్, కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్, కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటు అమెజాన్, హెచ్సీఎల్, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాస్, తిరుపతి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.