ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తాం-చంద్రబాబు త్వరలో క్వాంటం పార్క్ ఏర్పాటు

నూతన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే స్టార్టప్ కంపెనీలను అమరావతికి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు పిలుపు;

Update: 2025-06-30 10:28 GMT
క్వాంటం వ్యాలీ వర్క్ షాప్ లో చంద్రబాబు

క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో అమరావతిలో క్వాంటమ్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. 'క్వాంటమ్ వ్యాలీ' అంశంపై జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను ప్రభుత్వం విజయవాడలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా చంద్రబాబు క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వంతో చేతులు కలిపిన టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ సంస్థలకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.భవిష్యత్తులో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ హబ్‌గా ఎదుగుతుందని తాను ఆనాడే చెప్పానని అన్నారు.తాను గతంలో సీఎంగా ఉన్నప్పటి అనుభవాలను గుర్తుచేసుకున్న చంద్రబాబు "నేను తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టే సమయానికి ఐటీ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. అప్పట్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో సమావేశమై ఐటీ అభివృద్ధిపై చర్చించాను. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించాలని ఎల్ అండ్ టీ సంస్థను కోరాను. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం" అని ఆయన తెలిపారు.

రాజధాని ప్రాంతానికి ఇప్పటికే అనేక ఐటీ సంస్థలు తరలివస్తున్నాయని, ముఖ్యంగా క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామన్నారు.నూతన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే స్టార్టప్ కంపెనీలు అమరావతికి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా అని ఆయన పిలుపునిచ్చారు.ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకున్న యువత ముందుకు రావాలని కోరారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సాంకేతికతను ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగించుకుంటామని చంద్రబాబు తెలిపారు.అమరావతిని కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
Tags:    

Similar News