కోదాడలో ప్రమాదం–కోనసీమ జిల్లా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ మృతి

గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ మరణించారు.;

Update: 2025-06-26 04:44 GMT

కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ కోనసీమ జిల్లాకు చెందిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం వద్ద నేషనల్‌ హైవే మీద గురువారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం జరిగింది.

ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతులు ఆంధ్రప్రదేశ్‌ కోనసీమ జిల్లాకు చెందిన ఎస్‌ అశోక్, కానిస్టేబుల్‌ వీరస్వామిగా గుర్తించారు. కోనసీమ జిల్లా ఆలమూరు స్టేషన్‌లో వీరు విధులు నిర్వహిస్తున్నారు. పని నిమిత్తం బుధవారం రాత్రి ఆలమూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో కోదాడ పరిధిలో ప్రయాణిస్తున్న వీరి కారును గుర్తు తెలియన వాహనం బలంగా ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఎస్‌ఐ అశోక్, కానిస్టేబుల్‌ వీరస్వామి అక్కడిక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరి వ్యక్తులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వీరిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెనుక నుంచి ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనాన్ని ట్రేస్‌ చేసేందుకు రంగంలోకి దిగారు.
Tags:    

Similar News