సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు ముందడుగు!

జోన్‌ తొలి జీఎంగా సందీప్‌ మాథుర్‌ను రైల్వే బోర్డు నియమించింది. ఇప్పటికే విశాఖలో జోన్‌ కార్యాలయ పనులు ప్రారంభమయ్యాయి.;

Update: 2025-06-06 14:03 GMT
జోన్‌ తొలి జీఎంగా నియమితులైన సందీప్‌ మాథుర్‌

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ప్రకటన జరిగి ఆరేళ్లు దాటింది. అధికార, ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన ఈ రైల్వే జోన్‌పై కేంద్రం శ్రద్ధ చూపడం మానేసింది. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా కేంద్రం జోన్‌ పురోగతిని పట్టించుకోకుండా నాన్చివేత ధోరణిని ప్రదర్శించింది. దీంతో జోన్‌ ప్రకటన అయితే జరిగింది గానీ ఆపై అతీగతీ లేకుండా పోయింది. రైల్వే బోర్డు ఆలస్యంగా.. అనూహ్యంగా ఇప్పుడు సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు కొత్త జీఎంను ప్రకటించింది.


విశాఖలో సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నమూనా భవనం

2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేసింది. అనంతరం కేంద్ర కేబినెట్‌ కూడా ఆమోదం తెలిపింది. జోన్‌ ప్రధాన కార్యాలయం కోసం అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖ నగరంలోని ముడసర్లోవ వద్ద 52.2 ఎకరాలను కేటాయించింది. అయితే ఈ స్థలం అప్పగింతలో జాప్యం జరిగింది. ఈ భూములపై రైతులతో ఉన్న వివాదాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక పరిష్కరించింది. దీంతో ఆ భూములను రైల్వే శాఖకు అప్పగింత పూర్తయింది. ఈ నేపథ్యంలో జనవరి 8న ప్రధాని మోదీ జోన్‌ ప్రధాన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.149 కోట్లతో తొమ్మిది అంతస్తుల్లో రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి ఇటీవల టెండర్లు పిలిచారు. బీసీ భుయాన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి పనులు అప్పగించారు. దీంతో సదరు కంపెనీ ఈ మధ్యనే పనులు మొదలు పెట్టారు. ఈ పనులు పూర్తి కావడానికి మరో రెండేళ్లయినా పడుతుంది.

జోన్‌ తొలి జీఎం సందీప్‌ మాథుర్‌..
విశాఖలో ఏర్పాటు కానున్న సౌత్‌ కోస్ట్‌ జోన్‌ తొలి జీఎంగా సందీప్‌ మాథుర్‌ ను నియమిస్తూ తాజాగా రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంజినీర్స్‌లో ప్రిన్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఆయన ఈ జోన్‌ జీఎం బాధ్యతలను చేపట్టనున్నారు. కీలకమైన జనరల్‌ మేనేజర్‌ పోస్టు నియామకంతో ఆరేళ్లుగా నత్తనడకన నడుస్తున్న జోన్‌ కార్యకలాపాలు ఇకపై ఉపందుకోవడానికి మార్గం సుగమం కానుంది. కాగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు జీఎంతో పాటు ఒక అసిస్టెంట్‌ జీఎం, పది విభాగాలకు ప్రిన్సిపల్‌ హెచ్‌వోడీలు, వారి కింద హెచ్‌వోడీలు, ఇతర అధికారులు కలిపి 170 మందికి పైగా నియమించాల్సి ఉంది. జోన్‌ కార్యాలయం అందుబాటులోకి వచ్చే వరకు వాల్తేరు డివిజన్‌ ప్రధాన కేంద్రం పరిధిలో ఉన్న ఆఫీసులు, గెస్ట్‌ హౌస్‌లు, ఇతర భవనాల్లో జోన్‌ కార్యకలాపాలు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
కొత్త జోన్‌లోకి నాలుగు డివిజన్లు..
కాగా సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ పరిధిలోకి దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్‌లతో పాటు వాల్తేరు డివిజన్‌ స్థానంలో కొత్తగా ఏర్పాటైన విశాఖపట్నం డివిజన్‌ కూడా వస్తుంది. వీటిలో విశాఖపట్నం డివిజనే అతి చిన్నది కావడం విశేషం. ఈ నాలుగు డివిజన్లకు చెందిన వివిధ స్థాయిల అధికారులు కొత్త జోన్‌ ప్రధాన కేంద్రం విశాఖకు వస్తారు. సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్టు గెజిట్‌ ప్రచురించాక అది ఏ తేదీ నుంచి అమలులోకి వస్తుందన్న దానిపై స్పష్టత రానుంది. ఆ తేదీ నుంచి జోన్‌ కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. కొత్తగా ఏర్పాటువుతున్న సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌కు అతి కీలకమైన జనరల్‌ మేనేజర్‌ పోస్టు భర్తీ.. జోన్‌ ప్రక్రియలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.
Tags:    

Similar News