ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 1,566 స్క్రబ్ టైఫస్ జ్వరాల కేసులు (పాజిటివ్) నమోదైనట్లు రా ష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. ఈ జ్వరం వచ్చి మరణించిన వారిలో తొమ్మిది మంది ఉన్నా, ఇవి దేనివల్ల జరిగాయన్న దానిపై పరిశోధన జరగాల్సి ఉందని వెల్లడించారు. ఇందుకు కనీసం రెండు నెలల నుంచి మూడు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని సూత్రప్రాయంగా తెలిపారు. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్ స్వీకెన్సీ (గుంటూరు, తిరుపతి) ద్వారా పరీక్ష చేయించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్క్రబ్ టైఫస్ జ్వరాల నిర్ధారణ పరీక్షల నమూనాలను జ్దర పీడితుల్లో అవసరమైన వారి నుంచి పీహెచ్ సీల స్థాయిలోనూ సేకరిస్తున్నట్లు తెలిపారు. స్క్రబ్ టైఫస్ జ్వరాలు సాధారణమైన వాటిల్లో ఒకటని తెలిపారు. స్క్రబ్ టైఫస్ వల్లే మరణాలు జరిగినట్లు ఇప్పటివరకు నిర్ధారణ జరగలేదని స్పష్టంచేశారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కంటే రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయన్నారు. పరీక్షలు విస్తృతంగా చేస్తున్నందువల్లే ఇవి ఎక్కువగా బయటపడుతున్నాయని చెప్పారు. గత మూడేళ్లలో నమోదైన కేసులు పరిశీలించినప్పుడు ఈ సారి అసాధారణ పరిస్థితులు కనిపించలేదన్నారు. అధికారికంగా మరణాలు జరగలేదని తెలిపారు.
కర్ణాటక, తమిళనాడుల్లో కేసులు అత్యధికం
కర్ణాటకలో 2024లో 1,689, తమిళనాడులో 6,925, తెలంగాణాలో 195 రాగా ఏపీలో 1,613 కేసులు వచ్చాయి. 2025లో ఇప్పటివరకు కర్ణాటకలో 1,870, తమిళనాడులో 7,308, తెలంగాణాలో 309, ఏపీలో ఇప్పటివరకు 1,566 చొప్పున కేసులు వచ్చాయని కమీషనర్ వీరపాండియన్ వివరించారు.
ఆర్.ఆర్.టీంల ద్వారా లోతైన పరిశీలన
మంగళగిరిలోని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం వైద్య నిపుణులు, ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో కమిషనర్ వీరపాండియన్ మాట్లాడారు. బోధనాసుపత్రుల్లో ఉండే ర్యాపిడ్ రెస్పాన్స్ టీం (ఆర్ఆర్)లు అధిక కేసులు లేదా అసాధారణ మరణాలు సంభవించినచోట పరిశోధన (ఎపిడెమీయలాజికల్ ఇన్వెస్టిగేషన్) చేస్తాయని తెలిపారు. ఈ క్రమంలోనే స్క్రబ్ టైఫస్ బారినపడిన వారి కేసుల వివరాలు, నివాస పరిసరాల ప్రాంతాలను సైతం ఆర్ఆర్టీ టీమ్లు పరిశీలించి ప్రభుత్వానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేయనున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఆర్ ఆర్ టీంలు ఉన్నాయని తెలిపారు. అన్ని బోధనాసుత్రుల్లో స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. వీటితోపాటు హిందూపురం, టెక్కలి, పాడేరు, తెనాలి జిల్లా ఆసుపత్రుల్లోనూ ఈ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. దిగువ స్థాయి ఆసుపత్రుల నుంచి వచ్చే నమూనాలను ఈ ల్యాబ్ లో పరీక్షిస్తున్నారని తెలిపారు. అధిక కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించి వ్యవసాయ, పంచాయతీరాజ్, ఇతర శాఖలతో కలిపి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
శరీర భాగంపై నల్లటి మచ్చ కనిపించి... జ్వరం వస్తే జాగ్రత్తపడాలి
"కీటకం కుట్టిన శరీర భాగంపై నల్లటి మచ్చ దద్దురుతో వస్తుంది. ఈ మచ్చ స్క్రబ్ టైఫస్ సంకేతం. దీనికి అనుగుణంగా వైద్యులు రోగుల ఇతర అనారోగ్య వివరాలు పరిగణనలోకి తీసుకుని వైద్యం అందిస్తారు. అవసరమైన రక్త నమూనాలు సేకరించి, పరీక్షలు కూడా చేయిస్తారు. ముఖ్యంగా ఎలీశా పరీక్ష చేయించి, స్క్రబ్ టైఫస్ అవగాహనకు వస్తారు. గుంటూరు జీజీహెచ్ లో గడిచిన 38 రోజుల్లో 26 స్క్రబ్ టైఫస్ కేసులు వచ్చాయి. ఇందులో ముగ్గురు ఐసీయూలో ఉన్నారు. ఇతర దీర్ఘకాల వ్యాధులు ఉండి, చనిపోయిన వారిలో న్యూరాలజికల్ సమస్యలు కూడా కనిపించాయి. ఇక్కడికి రాకముందు. సరైన వైద్యాన్ని పొందకుండా విషమించిన పరిస్థితుల్లో రావడం, ఉన్నత చికిత్సకు శరీరం సహకరించక ప్రాణాలు విడుస్తున్నారు. దీర్ఘకాల వ్యాధులు లేనివారు వెంటనే నాలుగైదురోజుల్లో కోలుకున్నారని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వీ వెల్లడించారు.
మా వద్దకు ఎన్టీఆర్, బాపట్ల, కృష్ణా, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి కేసులు వచ్చాయి. పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఆర్ఆర్ టీంలు పంపాం. రొటీన్ గా రోగులకు ఇచ్చే డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్ మాత్రలతో స్క్రబ్ టైఫస్ బాధితులు పూర్తిగా కోలుకుంటున్నారు బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాల్లో స్క్రబ్ టైఫస్ వచ్చిందా? లేదా అన్న దాని గురించి ఎలిశా టెస్టు ద్వారా 24 గంటల్లో తెలిసిపోతుందని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి, అదనపు సంచాలకులు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, జాయింటు డైరెక్టర్ మల్లీశ్వరి వెల్లడించారు. ఇన్ఫెక్షియస్ డీసీజెస్ వైద్య నిపుణులు డాక్టర్ కల్యాణచక్రవర్తి మాట్లాడుతూ మరణాలు స్క్రబ్ టైఫస్ ద్వారానే జరిగినట్లు నిర్ధారించాలంటే సదరు వ్యక్తుల నుంచి సేకరించిన రక్త నమూనాలను జీనోమ్ స్వీకెన్సీ ద్వారానే నిర్ధారించాల్సి ఉందన్నారు. భవిష్యత్తు అవసరాలకు ఇది చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత సమాచారంతో 9 మరణాలు స్క్రబ్ టైఫస్ ద్వారా జరిగిందని చెప్పలేమన్నారు.