నిధుల జల్లు’ గోరుకల్లు రిజర్వాయర్ ను నిలబెడుతుందా?
అసంపూర్తిగా నిర్మాణమైన రిజర్వాయర్ ఆచూకీ కూడా లేకుండా పోయే పరిస్థితి దాపరించింది.;
శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ రాయలసీమలో చేపట్టిన ఏకైక ప్రాజెక్టు ఎస్ ఆర్ బి సి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఎస్ ఆర్ బి సి ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేశారు. వెనకబడిన రాయలసీమలోని 1,90,000 ఎకరాలలో సిరులు కురిపించే అవకాశం కల్పించింది ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణానికి జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ బొజ్జా వెంకట రెడ్డి గారి కృషితో, ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారి సహకారంతో కేంద్ర జలవనుల శాఖ అనుమతులు లభించాయి.
గొప్పలే తిప్పలు తెచ్చాయి : -
గోరుకల్లు రిజర్వాయర్ కు అనుమతులు లభించి 30 సంవత్సరాలైనా పూర్తి కావడం అటుంచి, అసంపూర్తిగా నిర్మాణమైన రిజర్వాయర్ ఆచూకీ కూడా లేకుండా పోయే పరిస్థితి దాపరించింది. అసంపూర్తిగా ఉన్న రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కృషి చేయవలసిన నాయకులు, ఆ పని చేయకపోగా రిజర్వాయర్ లో అధిక స్థాయిలో మేమే నీరు నిలబెట్టాం అని గొప్పలు చెప్పు కొనడానికి పడిన ఆత్రం గోరుకల్లు రిజర్వాయర్ మరియు ఎస్ ఆర్ బి సి ఆయకట్టుకు శాపంగా మారింది.
శ్రీశైలం రిజర్వాయర్ లో నీరు ఉన్నప్పుడు బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుండి గోరుకల్లు వరకు ఉన్న కాలువ ద్వారా రోజుకు 2 టిఎంసీ ల నీటిని ఈ రిజర్వాయర్లో నింపడానికి అవకాశం ఉంది. అయితే అసంపూర్తిగా ఉన్న రిజర్వాయర్ లో అధిక స్థాయిలో నీరు నిలవచేయడం వలన రిజర్వాయర్ రివిట్మెంటు జారిపోవడంతో బలహీనమైన రిజర్వాయర్ కట్టలు తెగిపోతాయేమోనన్న భయంతో కేవలం 1/2 టి ఎం సీ నీటిని మాత్రమే రిజర్వాయర్ లోనికి తీసుకొనివస్తున్నారు. దీని వలన శ్రీశైలంలో వరద ఉన్నప్పటికీ గోరుకల్లు రిజర్వాయర్ లో నీటిని నింపుకొనలేని దుస్తితి ఏర్పడింది. శ్రీశైలంలో వరద ఉన్న సందర్భంలో సకాలంలో గోరుకల్లు నింపలేకపోతే 1,90,000 ఎకరాల ఎస్ ఆర్ బి సి ఆయకట్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. గాలేరు నగరి ప్రాజెక్టుకు కీలకమైన గండికోటకు, మైలవరం, ఔక్ రిజర్వాయర్ల కు గోరుకల్లు రిజర్వాయర్ నుండి కృష్ణా జలాలను పంపాల్సి ఉంటుంది. ఈ రిజర్వాయర్ల ఆధారంగా 1,50,000 ఎకరాలకు పైగా ఆయికట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. అత్యంత కీలకమైన గోరుకల్లు రిజర్వాయర్ భవిష్యత్తు మీద ఆధారపడిన సుమారు మూడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ద్వారా ప్రతి సంవత్సరం 3000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన జరుగుతుంది. లక్షలాది ప్రజలకు త్రాగునీరు లభిస్తున్నది.
గోరుకల్లు రిజర్వాయర్ అసంపూర్తి నిర్మాణం, నిర్వహణ లోపాల వల్ల దిగజారిన రివిట్మెంట్ వల్ల గోరుకల్లు రిజర్వాయర్ భద్రతపై భయాందోళనలు సాగునీటి రంగ నిపుణులు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. దిగజారిన రిజర్వాయర్ పరిస్థితి పునరుద్ధరణ చేపట్టకపోతే గోరుకల్లు నుండి నంద్యాల వరకు ప్రజల ప్రాణ, ఆస్తుల నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఈ విషయాలను రాయలసీమ సాగునీటి సాధన సమితి నిరంతరం ప్రభుత్వ ముందుకు తీసుకుని పోతూనే ఉంది. ప్రచారం కోసం పాలకులు పడిన తాపత్రయం కాస్త తగ్గించుకొని రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి ఉంటే గోరుకల్లు రిజర్వాయర్ కు ప్రస్తుత దుస్థితి దాపరించేది కాదు అని సమితి అభిప్రాయపడుతున్నది.
హామీల తుఫానుల, ప్రతిపాదనల వరదలలో రిజర్వాయర్ భవిష్యత్తు :
తాము అధికారంలో ఉన్నప్పుడే అంతా చేసాం... కొంతే కొదవ పెట్టాం…. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ కొంత కూడా పూర్తి చేయలేదు అంటూ పరనిందా, ఆత్మస్తుతితో పాలకులు తలమునకులై ఉన్నారు. హామీల తుఫానుల, ప్రతిపాధనల వరదలో గోరుకల్లు రిజర్వాయర్ భవిష్యత్తు ఊగిసలాడుతోంది. పాలకులు అవసరమైన కార్యాచరణను, నిధుల కేటాయింపును చేపట్టక హామీలతో, ప్రతిపాదనలతో రాయలసీమ సమాజాన్ని బుజ్జగిస్తున్నారు. పాలకులకు ప్రజా సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే, వర్తమానంలో జరగాల్సిన అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం సంపూర్తిగా చేయడానికి ఇంకా 200 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం రిజర్వాయర్ నిర్వహణ కోసం సుమారు 70 లక్షల రూపాయల నిధులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అయితే పాలకుల ఆలోచన విధానం ప్రకారం నడుచుకునే ప్రభుత్వ అధికారులు, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి కేవలం 93 కోట్ల నిధులకై ప్రతిపాదనలు చేశారు. ఇదే ప్రతిపాదనను అధికారులు గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ముందు ఉంచుతూనే ఉన్నారు. అదేవిధంగా రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయకుండా నీరు నిలువ ఉంచడం వలన దిగిపోయిన రివిట్మెంటు మరమ్మత్తులకు కావలసిన నిధుల కోసం, నిర్వహణ నిధుల కోసం ప్రతిపాదనలు గత మూడు సంవత్సరాలుగా అధికారులు ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నారు.
గోరుకల్లు రిజర్వాయర్ దుస్థితి, ఈ పరిస్థితి వల్ల రాయలసీమకు జరిగే పైన వివరించిన నష్టాలను పాణ్యం శాసనసభ్యురాలు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆ అంశాలపై జలవనరుల శాఖ మంత్రి ఏకీభవిస్తూ నిధుల కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతామని అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు. రిజర్వాయర్ పూర్తి నిర్మాణానికి 200 కోట్ల రూపాయల నిధులు కావాల్సి ఉంటే, పాలకుల ఆలోచన విధానానికి అనుగుణంగా 93 కోట్ల నిధులకు అధికారులు ప్రతిపాదనలు పంపితే, జలవనుల శాఖ మంత్రి గారు దాన్ని 55 కోట్లకు తగ్గించి ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపారు. మరి ఏ మాత్రం నిధులు కేటాయింపుల అవుతాయో తెలియదు… కాని వర్షాకాలం మాత్రం ఆరంభమైంది. రిజర్వాయర్ నిర్వహణ కోసం మాత్రం వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం కోటి 50 లక్షలు విడుదల చేసినట్టుగా “నిధుల జల్లు” పేరుతో ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తతో “సమాజం జాగృతమైందా ? ప్రజా ప్రతినిధులకు చురక తగిలిందా ? కాలమే నిర్ణయించాలి !
కొసమెరుపుగా గోరుకల్లు రిజర్వాయర్ భవిష్యత్తు అయోమయంగా ఉంటే దానికి నిధులు కేటాయించడం గురించి స్పందించని ముఖ్యమంత్రి గారు ఈ రిజర్వాయర్ నుండి పైపుల ద్వారా పాణ్యం నియోజకవర్గంలో త్రాగునీరు అందిస్తామని 2025 మే నెలలో కర్నూలుకు వచ్చిన సందర్భంగా ప్రకటించారు.
ఈ రిజర్వాయర్ నిర్మాణం, మరమ్మతులు పూర్తిగా చేయకపోతే వ్యవసాయ ఉత్పాదన నష్టం, లక్షలాది ప్రజలకు త్రాగునీరు ఇబ్బందితోపాటు గోరుకల్లు నుండి నంద్యాల పట్టణం వరకు ఉన్న ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోతున్న విషయాన్ని కూడా పాలకులు గమనంలోకి తీసుకోవాలి.
గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం మరియు మరమ్మతులకు “వరద వెల్లువలాగా నిధులు” రావలసి ఉంటే …
“నిధుల జల్లు” అంటూ వెక్కిరిస్తూ!
ఎన్నేళ్లు రాయలసీమ సమాజాన్ని చులకనగా చూస్తారు పాలకులు?