అడవుల్లోకి ట్రెక్ వెళ్తున్నారా, అయితే, ఈ విషయాలు గుర్తుంచుకోండి...
అడవిలో ట్రెక్ బాధ్యతాయుతంగా ఉండాలి...;
ఒక శనివారం మధ్యాహ్నం, అయిదు మంది సభ్యులతో కూడిన మా స్నేహ బృందం తిరుపతినుంచి కొన్ని వేల సంవత్సారాల చరిత్ర కలిగిన భక్తి ,ప్రకృతి సౌందర్యం కలగలిసిన ప్రదేశమైనటువంటి సదాశివకోనకు ప్రయాణానికి బయలుదేరాం.
ఇది తిరుపతి పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో, మరియు పుత్తూరు పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో, దట్టమైన అడవులతో ఆవృతమై ఉండే శివక్షేత్రం.
మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి నుంచి బయలుదేరిన మేము పాపనాయుడుపేట , చెల్లూరు, గుడిమల్లం మీదుగా చెల్లూరు డ్యామ్ వద్దకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకున్నాము. అంతవరకు తారు రోడ్ పైన మా ప్రయాణం సాఫీగా సాగింది.
చెల్లూరు డాం పైన వున్న
ఫారెస్ట్ (చెల్లూరు బీట్ ) చెక్ పోస్ట్ దాటిన తరువాత మొదలైన్ది అసలైన ఆఫ్ రోడ్ ప్రయాణం .
ఎప్పుడో వేసిన సన్నని ఇరుకయిన గతుకులతో కూడిన ఎర్రమట్టి గ్రావెల్ రోడ్.. ఆ రోడ్ వేయడానికి ఉపయోగించిన మట్టి వదులు అవ్వడం తో రోడ్ వేయడానికి ఉపయోగించిన గుండ్రాళ్ళు రోడ్ పైన తేలి పడి వున్నాయి, పది కిలోమీటర్లు మేర మట్టి రోడ్ పరిస్థితి మొత్తం ఇంతే.
ఆ రాళ్లమీద మోటార్ బైక్ పైన ప్రయాణిస్తావుంటే మా శరీరం లోని ప్రతి అణువు కుదుపునకు గురి అవుతున్నాయి.
రోడ్ వేయడానికి ఉపయోగించిన మట్టి వదులు అయ్యి రోడ్ పైన ఒక పొరలా పరుచుకొనివుంది.
ఆ దుమ్ము ముందు వెళుతున్న బైక్ టైర్ ల కింద నుంచి, ఒక మేఘంలా లేస్తూ వెనుక వస్తున్న వారి చూపును మసక బారుస్తున్నాయి .
వర్షపు పారుడు నీళ్ల వలన రోడ్ మలుపులలో పేరుకుపోయిన ఇసుక మేటలు..అవి మలుపులలో ప్రయాణికులకు సవాళ్లు విసురుతూ ప్రయాణాన్ని మరింత కష్ట తరం చేస్తున్నాయి.
అయితే ఈ ప్రయాణాన్ని మరింత రసవత్తరం చేసినది మాత్రం - రోడ్ కి ఇరువైపుల ఏపుగా పెరిగిన వెదురు పొదలు , అవి పది మీటర్ల ముందు ఏం ఉన్నదో తెలియని స్థితి ని కలిగిస్తున్నాయి.
ఇలాంటి రోడ్ పైన మా గమ్యం చేరడానికి ఇంకో పది కిలోమీటర్లు వెళ్ళాలి అన్న ఊహా వెన్నులో మాకు తెలియకుండానే చలి పుట్టించింది.
కానీ అదే సమయంలో ఒక ఉత్సాహం, ఒక తాపత్రయం మాలో నిండివుంది.
ఎందుకంటే... మేము చేరనుండే స్థలం శతాబ్దాల సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం మాత్రమే కాదు. అది ఒక అనుభూతి, ఒక ప్రకృతి రహస్యపు తలుపు. ఆ తలుపును తట్టేందుకు, ఎంతటి ప్రయాణానికయినా మేము సిద్ధమే.
అంతటి కష్టతరమైన మార్గంలో పడుతూ లేస్తూ, దారి పొడవునా విస్తరించిన వనదేవత అందాన్ని ఆస్వాదిస్తూ, సెలయేటి సవ్వడలను వింటూ, స్వేదంతో నిండిన మా శరీరాలను స్మృసిస్తున్నా మలయ మారుత చల్లదనుపు హాయిని అనుభవిస్తూ ఆ రోడ్ చివరికంటా చేరుకున్నాం.
అక్కడ బైకులను పార్క్ చేసి పారుతున్న సెలయేటి పక్కన, దట్టంగా ఏపుగా పెరిగిన చెట్ల మధ్యన దారి చేసుకొంటూ అరగంట ప్రయాణాన్ని సాగించి సదాశివకోనను చేరుకొన్నాము. దారి పొడవున వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కాగితాలు , బీర్ బాటిల్స్, ఆల్కహాల్ బాటిల్స్ ప్రకృతి పట్ల మానవ నిర్లక్ష్యాన్నికి అద్దం పడుతున్నాయి.
వన భోజనం కొరకు విచ్చేసిన భక్తులు బాధ్యత రహితంగా పారవేసిన ప్లాస్టిక్ ప్లేట్స్ దుర్గంధాన్ని వెలువరిస్తున్నాయి. అవన్నీ చూస్తుంటే మా ఐదుగురికి ఒక అందమైన దేవతను కళావిహీనంగా చేసి నిలబెట్టినట్టుగా తోచి మనసులో వికారం మొదలైనది.
అలా అర కిలోమీటర్ ఆ దారి వెంటా సాగిన తరువాత అమ్మవారికోనను చేరుకొన్నాము
అక్కడ వెలసిన అమ్మవారి దర్శించి అశీర్వాదాలు తీసుకొన్న తరువాత , స్వామివారిని దర్శించుకొని ఆలయానికి ఒక పక్కగా వున్న జలపాతానికి చేరుకొని ఆ ప్రాంతపు చల్లదనాన్ని ఆస్వాదిస్తూ, ఆ జలపాతపు అందాన్ని గమనిస్తూ, ఆ జలపాతం పై నుంచే వీచే శీతల పవనాల హాయిని అనుభవిస్తూ దాని వొడ్డున సేద తీరి పరిసరాలను గమనించసాగం.
భక్తులు వస్తున్నారు, జలపాతాన్ని చూసి భక్తితో నమస్కరిస్తున్నారు, జలపాతపు కిందవున్న కొలనులో స్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి వెళుతున్నారు.
లింగ బేధాన్ని , వయో పరిమితిని మరచిన సందర్శకులు జలపాతాన్ని చూసి కేరింతలు కొడుతూ కొలనులోకి దిగి ఈతకొడుతున్నారు.
చిన్న పిల్లలు కేరింతలు కొడుతూ కొలనులో జలకాలాటలు ఆడుతున్నారు .
ఇవన్న్నీ ఆ పరిసరాలకు మరింత అందాన్ని తెచ్చి పెడుతున్నాయి.
కొందరు మాత్రం గోల గోలగా అరుస్తూ నోట్లోని బీడా వుమ్మిని అక్కడే ఊస్తూ గ్రహాంతర వాసుల్లా తోస్తున్నారు.
మరికొంతమంది యువకులు మద్యపాన మత్తులో పెద్ద పెద్దగా అరుస్తూ ఆ ప్రశాంత వాతావరణన్నీ చెడగొడుతూ చీడ పురుగులులా కనపడుతున్నారు.
ఒకవైపు భక్తి, ఆనందం; మరోవైపు నిర్లక్ష్యం, అపరిశుద్ధత. ఇలాంటి మిశ్రమ దృశ్యాలు మనసులో కలకలాన్ని రేపుతున్నాయి.
అలా ఎంతసేపు కుర్చున్నానేమో గుర్తులేదు. ఇంతలో నా పక్కన ఎవరో కుర్చున్నట్టు తోచి తలతిప్పి చూస్తే తైలసంస్కారాలు లేని పొడవాటి జుట్టు తో, ఏపుగా పెరిగిన గడ్డంతో, మేడలో రుద్రాక్షపు మాలలతో,నుదుటున విబూది పట్టీలతో షుమారు అరవై సంవత్సరాలు పైబడిన వయసుతో ఒక సాధువు. శరీరపు పైభాగాన ఎటువంటి ఆచ్చాదనా లేకుండా, కాషాయ పంచెను ధరించి చూడగానే స్వామి అని పిలవాలనిపించేలా వుంది ఆయన వేషధారణ.
మెల్లగా మాటలు కలపగా, అతను షుమారు నలభై సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నట్టు ఈ ఆలయా అభివృద్ధికి తన పాత్ర ఎంతో వుంది అని చెపుతున్నప్పుడు అతని మాటల్లో కించిత్ గర్వం, ఆత్మ సంతృప్తి కనపడింది నాకు.
ఇంతలో మా టీం లోని మురళి, గిరి ప్రసాద్ , రాధాకృష్ణ మద్యపాన మత్తులో గట్టి గట్టిగా అరుస్తున్న యువకులను
హెచ్చరిస్తున్నారు. మా వారి మాటలకు జంకినట్టున్న ఆ యువకులు మౌనాన్ని ఆశ్రయించారు.
మా చర్యలను చూసిన సాధువు మా పైన మంచి అభిప్రాయం కలిగిందేమో ఉత్సహంతో అతని అనుభవాలను పంచుకోసాగాడు., భక్తులు ఇచ్చే కానుకలతో క్షుద్భాద్ధాను ఉపశమింప చేసుకొంటున్నట్టు, ఆ నిర్మలమైన అడవిలో ఇదివరలో సంచరిస్తున్న వన్య మృగాలు ఎలా అంతరించిపోయాయో వివరించుకొంటూ పోతున్నాడు.
మా వాళ్ళు ఆసక్తిగా వింటున్నారు కానీ… నా మనసు మాత్రం చల్లబడటంలేదు.
అది ఆ పరిసరాల్లోని ప్రశాంతతను చూడలేకపోతావుంది. కలుషితమవుతున్న దృశ్యాల్ని మౌనంగా గమనిస్తోంది.
అక్కడ బీర్లు తాగి బాటిళ్లను విసిరేయడం, ప్లాస్టిక్ కవర్లను చెట్లకింద విసిరేసి వెళ్లిపోవడం, బ్లూటూత్ స్పీకర్ తో అడవిలోనూ శబ్దకోళాహలం సృష్టించడం... ఇవన్నీ ప్రకృతిని అపవిత్రం చేస్తున్న మానవ వికృత చేష్టలను గమనిస్తుంది.
శివాలయాల ముందు కూడా బుద్ధి కోల్పోయినట్టు ప్రవర్తిస్తూన్న ఈ పోకిరీలను పెంచిన వారి తల్లిదండ్రుల తీరును వారి సంస్కారాలపై సందేహం..…ఈ పోకిరీలను
వారి తల్లిదండ్రులు ఎలా పెంచారో? ఏమి నేర్పారు? అనే సందేహాలే కాక, ఒక బాధగా, ఒక నిశ్శబ్ద చప్పుళ్లలా నా మేధస్సులో రీళ్లు రీళ్లు గా కదులుతున్నాయి.
ఇది ఒక్క వ్యక్తిగత బాధ కాదు – ఇది ఒక సమాజమే విఫలమవుతోందన్న సంకేతం.
మనిషి యాంత్రికతల మధ్య నలిగిపోతూ, ఉక్కిరిబిక్కిరి జీవితం నుండి కొంత రిలీఫ్ కోసం ప్రకృతిని ఆశ్రయిస్తున్నాడు. ఆ కోణంలో చూస్తే, అతని ప్రయత్నం సానుకూలంగా అనిపించవచ్చు. కానీ… అదే మనిషి ప్రకృతిని అపవిత్రం చేస్తే, నాశనం చేస్తే, అర్థం ఏముంది ఆ విహారానికి?
ప్రకృతి మన చేతిలో ఉన్న సంపద కాదు – మనం దానిలో చిన్నచిన్న భాగాలం మాత్రమే. దానిని వినియోగించవచ్చు, ఆస్వాదించవచ్చు కానీ… దాన్ని నాశనం చేసే హక్కు మనకు లేదు.
ప్రకృతికి వచ్చిన ప్రతి మనిషి తనతో పాటు బాధ్యతను కూడా తీసుకురావాలి. ప్రతి అడుగు వేసేటప్పుడు “ఇది ప్రకృతికి హాని చేస్తుందా?” అని తలచుకోవాలి. మనం చేసే చిన్న చిన్న చర్యలు — ఒక ప్లాస్టిక్ కవర్ పడేయడం, శబ్దం చేయడం, మొక్కలను పీకడం — ఇవన్నీ పెద్ద తప్పుల దిశగా నడిపిస్తాయి.
అదే బాధ్యతను పిల్లలకు నేర్పించని తల్లిదండ్రులు, స్కూల్లో నేర్పని గురువులు, సమాజంగా తలపడని మనమంతా కలిసి ఒక బాధ్యతారాహిత్య సంస్కృతి ని పెంచుతున్నాం. ఇది సమాజాన్ని మాత్రమే కాక, భవిష్యత్ తరం భద్రతను కూడా ప్రశ్నార్థకంగా మార్చుతుంది.
ఇప్పటికైనా ఒక్కసారైనా మలుపు తిప్పుకుందాం. ప్రకృతిలోకి వెళ్ళే ముందు మన మనసు లోపల ఒక ప్రశ్న వేసుకొందాం:
"నేను అడవిలోకి వెళ్తున్నాను…నేను మళ్లీ అడవి నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రకృతిని అలాగే విడిచిపెడుతున్నానా?"
ఈ ప్రశ్నకు "అవును" అనే సమాధానం వస్తేనే మనం నిజమైన ప్రకృతి ప్రేమికులం అవుతాం.
ఇలా ఆలోచిస్తూ ఎప్పుడు కునుకు తీసానో నాకే తెలియదు. ఎక్కడో ఎవరో నన్ను సుదూర తీరంనుంచి పిలిస్తున్నట్టు తోచి కళ్ళు తెరిస్తే ఎదురుగా నవ్వుతు మురళి ...అప్పటికే చీకటి పడింది ...అక్కడే నివాసముంటున్నాను అని చెప్పిన సాధువు మాకు పడుకోవడానికి ఆలయ ప్రాంగణం లో స్థలం చూపినట్టున్నారు, పడుకోవడానికి స్థలాన్ని శుభ్రపరుస్తూ రమేష్ .. మా ఆకలి తీర్చడానికి వంట చేస్తూ గిరి, రాత్రి చలి కాచుకోవడానికి కట్టెలను ప్రోగుచేస్తున్న
రాధాకృష్ణ క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా కనపడ్డారు.