మబ్బుల్లో నీళ్ళు జూసి ముంత వలకపోసుకోవడం
చంద్రబాబు గోదావరి-బనకచర్లను నమ్ముకోవడమంటే ఇంతే...;
-అరుణ్
రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకై అభివృద్ధి ప్రధాత, దార్శనికులు శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు పడుతున్న పాట్లు, చేస్తున్న ఫీట్లు చూస్తే, మన సీమవాసుల గుండె తల్లడిల్లిపోతున్నది.ఎంత పాషాణ హృదయాన్నైనా న కరిగించక మానదు. ఎన్ని ఆలోచనలు, ఎన్ని పథకాలు. పాపం ఆయనకు ఏ ఒక్కటి సంతృప్తినీయడం లేదు. రాయలసీమ అంటే పాపం ఆయనకు అంత ప్రాణం. ఒకటి కాదు పంచ ప్రాణాలు.
కొత్త,క్రొంగొత్త పథకాల రూపకల్పనలో చంద్రన్నను మించిన వారెవరు? ఈ కొత్త పథకాల అన్వేషణలో గతంలో తానిచ్చిన హామీలు మరిచి ఉండవచ్చు. అది సహజమే. గుండ్రేవుల, ఆర్డీఎస్, వేదవతి పథకాల మాటేమిటి? అంటూ కొందరు ఆయన ప్రశ్నిస్తుంటారు. ఆయనది ఎప్పుడూ వెనక చూపు కాదు. ఎప్పుడూ ముందు చూపే. గతం గతః.
సీమను సస్యశ్యామలం చేసేందుకు ఆయన దశాబ్దాల కాలంగా పడిన పాట్లు, రచించిన ప్రణాళికలు, వేసిన పథకాలు అన్నా?ఇన్నా? ఆయన మన ముందుoచిన కొన్ని పథకాలను ” సంస్మరించుకుందాం”(సరైన పదమేనా?) తొలుత పోలవరం నిర్మాణంవల్ల ఆదా అయే 80 టీఎంసీల నీటితో సీమను సస్యశ్యామలం చేస్తానని ఎన్నో హామీలు చేశారు. కానీ, పోలవరం నిర్మాణం ఆలస్యం కావడంతో, రాయలసీమ కు నీరివ్వడం ఆలస్యం అవుతుందని,పాపం ఆగమేఘాలతో పట్టిసీమను ఏడాదిలోపలే పూర్తి చేశాడు. అదీ రాయలసీమపై చంద్రన్నకున్న ప్రేమ. ఆదా అయినా 80 టీఎంసీలు సీమకు కేటాయించలేదని మీరు అనవచ్చు. మీఅంత అల్పసంతోషి కారు మన నాయకుడు. కేవలం 80 టీఎంసీలతో సీమ సస్యశ్యామలం కాదని ఆయన ఆలోచన. ఎంతైనా దార్శినికుడు కదా మన చంద్రన్న. 80 టీఎంసీలలో తెలంగాణ వాటా పొతే, రాయలసీమకు మిగిలిన నీళ్లు చాలవు కదా! అందుకే, ఆయన విశాల హృదయం స్పందించి, గోదావరి పెన్నా అనుసంధానంతో రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు పూనుకుంది.
పొతే, మనం,సీమవాసులం కృతఘ్నులమయి ఆయన్ను ఓడించాం.
అయినా కరుణామయుడయిన చంద్రన్న ఇప్పుడు సీమకోసం బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసారు. అదే పోలవరం-బనక చెర్ల అనుసంధానం.ఇది ఆషామాషీ పథకం కాదండోయ్.చంద్రన్న బుర్రలో చిన్నా,చితకా పథకాలుoడవు కదా! దాదాపు 82 వేల కోట్ల రూపాయల అంచనాతో,(పూర్తయ్యేసరికి 1 లక్షా 20 వేల కోట్లదాకా) 200 టిఎంసిల గోదావరి జలాలను ఏడూ ఎత్తిపోతల పథకాలు,రెండు సొరంగాల ద్వారా 9.14 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టు, 3 లక్షల హెక్టార్ల స్థిరీకరణ,80 లక్షల జనాభాకు తాగునీరు అందిస్తూ,200 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాత్తి జేసే మహత్తర పథకమడది –mind boggling .దిమ్మదిరగాడంలేదూ.అంటారే అలాంటి అత్యత్భుత నిర్మాణo కాబోతున్నదది.హైదరాబాదును సైదరాబాద్ గా మార్చిన ఘనత తనదేనని పదే,పదే చెప్పుకునే చంద్రన్న సాదా,సీదా పథకాలను చేపట్టుతాదనుకోవడం మన అమాయకత్వమే కాదు,అజ్ఞానo కూడా. అంతెందుకు,బొంబాయి,బెంగళూర్,హైదరాబాదు నేటి స్థితికి చేరుకోవడానికి వంద సంవత్సరాలకు పైగా పట్టి ఉండొచ్చు.కానీ,చంద్రబాబు అమరావతిని,అదీ చినుకుపడితే చెరువును తలపించే ప్రదేశంలో, ముక్కారు పంటలు పండే భూముల్లో రియల్ ఎస్టేట్ ద్వారా వేల కోట్లురూపాయలు ఆదాయం పొందే ప్రయత్నంలో ఉన్నాడుగా! వ్యవస్వాయo దండగా,రియల్ ఎస్టేటే పండగా అన్న నాయకుడు మరి, అక్కడ 52 వేల కోట్ల రూపాయలతో తన మాటను నిరూపించుకుంటున్న విషయం మరువరాదు.అనితర సాధ్యమయ్యింది చేపట్టడమే దార్శనికతనేమో.
నాడు “ఆకాశoబునుండి---- పవనాంధోలోకంబు చేరే గంగా కూలంకుష/ పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్” అంటూ ఏనుగు లక్ష్మణ కవి గంగానదిని అవివేకి అన్నారు. అత్యున్నత స్థానం నుండి పాతాళలోకి చేరడం అనేది అవివేకులు చేసేదన్నమాట.
అందుకే మన చంద్రన్న,తానూ అత్యంత వివేకవంతుడనని లోకానికి చాటెందుకై కాబోలు, గంగను అతి తక్కువ ఎత్తు (పోలవరం సముద్రమట్టానికి 150 అడుగులు) నుండి సిద్దేశ్వరం చెరువు (సముద్ర మట్టానికి 708.8 అడుగుల) కు ఎత్తిపోస్తున్నాడు. ఇది అందరికీ సాధ్యమయ్యేదేనా? కొందరు నిరంతర సందేహవాదులు సముద్రంలో వృధాగా పోతున్న కృష్ణా జలాలను శ్రీశైలంలో నిలువరించి, వాలు ద్వారా రిజర్వాయర్లు నింపి అతి తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సీమకు నీళ్లు ఇవ్వచ్చు కదా అంటున్నారు. అంతేకాదు, సముద్రం పాలయ్యే కృష్ణా జలాలు సగటున సంవత్సరానికి 500 టీఎంసీలకు పైనే ఉన్నాయని, 2024- 25 సంవత్సరంలో సముద్రం పాలైన కృష్ణాజలాలు 865 టీఎంసీలని ప్రభుత్వ గణాంకాలనే ఉటంకిస్తున్నారు. అలాంటి పని ఎవరైనా చేయొచ్చు.వీరికెవ్వరికీ చంద్రన్న దార్శనికత అర్థం కాదు.సముద్రం పాలవుతున్న కృష్ణాజలాలకన్నా సముద్రం పాలవుతున్న గోదావరి నీళ్ళు ,దాదాపు 3 వేల టిఎంసిలు,ఎక్కువ కదా! అందుకే,వాటిపై దృష్టి సారించారు.మన చంద్రన్న.అంతేగాక, శ్రీశైలంలో కృష్ణా జలాలను నిల్వజేసి దక్షిణ తెలంగాణా,రాయలసీమకు వినియోగిస్తే, వర్షాబావ సంవత్సరాలలో ( వంద ఏండ్లలో పాతిక సంవత్సరాలు) కృష్ణా డెల్టా మాటేమిటి?అందుకే చంద్రబాబు గోదావరి జలాలపై దృష్టి సారించారు.!
అంతకన్నా ఎక్కువ పరిమాణంలో వృధా అవుతున్న గోదావరి జలాల వినియోగం గురించి గతంలో ఏ నాయకుడూ ఎందుకు ఆలోచించ లేదు? అలా చేయగలిగే మేధావి చంద్రన్న మాత్రమే. దాదాపు 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని, వాటిని రాయలసీమకు మళ్లించడం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించావచ్చనే మహత్తర ఆలోచన చంద్రబాబు వంటి మేధావికి తప్ప మారెవరకి కలుగుతుంది చెప్పండి. అందుకే, కృష్ణా డెల్టాకు ఏమాత్రం, ఏ కాలంలో కూడా ఇబ్బంది రాకుండా శ్రీశైలం నుండి నిరంతరాయంగా నీరు సరఫరా చేయడం కోసం, కృష్ణా జలాలు సముద్రం పాలైన సరే, వాటిని రాయలసీమకు వినియోగించరాదు అని ఆయన దూరాలోచన. కొంతమంది దాన్ని దురాలోచన అంటారనుకోండి. వాళ్ల పాపాన వాళ్లు పడిపోతారు.
చాలా ముoదు చూపుతో, రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారానికై చేపట్టిన గొప్ప ప్రాజెక్టు ఇది. ఖర్చు కేవలం 82 వేల కోట్లే. పూర్తయ్యేసరికి ఒక లక్ష 20వేల కోట్లు కావచ్చు అనుకోండి. కానీ, ఇందువల్ల లాభాలెన్నో. ఎన్ని ఎత్తిపోతల పథకాలు. వాటికై యంత్రాలు. తద్వారా ఆ కర్మాగారాలకు డిమాండ్. దానివల్ల, అక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువ కావడం. వారి ద్వారా దేశ మార్కెట్ లో డిమాండ్ పెరగడం.దాంతో మరింత ఉత్పత్తి.మరిన్ని ఉపాధి అవకాశాలు. అందులోనూ ఎత్తిపోసే యంత్రాలు ప్రతి పది సంవత్సరాలకు మార్చాల్సిందేనట. కొత్త యంత్రాలు, ఆ యజమానులకు లాభాలు, పరిశ్రమల అభివృద్ధి ఎంత ముందుచూపో మన చంద్రబాబు గారిది.
అంతే కాదండోయ్! ఈ ప్రాజెక్టు మరొక విశిష్టతను కలిగి ఉంది. ఇది స్వీయఆదాయార్జన ప్రాజెక్టట(అమరావతిలాగా). పూర్తయ్యాక, దీని నుండి వచ్చే ఆదాయం ఏటా 2,785 కోట్లు రూపాయలు. ఇక మన నిత్య శంకితులు ప్రాజెక్టు పూర్తీ కావడానికి అయ్యే ఖర్చు ఎంత? దాన్ని ప్రజలే కదా భరించాలి అనే కుశంకలు. అంతే కదా,దేన్నైనా ప్రజలే భరించాల్సిందే. ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా ఖర్చులో, విదేశీ రుణాలు రూ. 40 వేల 9 50 కోట్లు, కేంద్రం-రూ, 16, 380 కోట్లు, రాష్ట్రం-రూ. 8,190 కోట్లు. ఇక ప్రైవేట్ రుణాలు-రూ. 16,380 కోట్లు. రాష్ట్ర పెట్టుబడి ప్రజల నుండి వసూలు చేయాల్సిందేగా. అందులో చంద్రన్న ముందాలోచన ఉంది. కేంద్రం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను, అందులో రాయలసీమ వాటాను, ఈ ప్రాజెక్టుకై వినియోగించుకోవాలని ఆలోచన. చాలా గొప్పది కదా! రాయలసీమకు కొన్ని నీళ్లు ఇస్తున్నప్పుడు దానికి ఖర్చు సీమ ప్రజలే భరించాలిగా? అమరావతి విషయంలో మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. రాష్ట్రప్రజలందరూ ఆ నిర్మాణ ఖర్చులు భరించాలి.కానీ,అక్కడి ఉద్యోగాలు మాత్రం కృష్ణా,గుంటూరు జిల్లాల వారికే. ఇక కేంద్ర, రాష్ట్ర వాటాలు పోను, రుణాలు రూ. 57 వేల 3 30 కోట్లు. దీనికి వడ్డీ ఎంత అని మాత్రం అడగొద్దు. అయినా, స్వీయ ఆదాయార్జన ప్రాజెక్టు అన్నారుగా!
ఇక సీమ ఉద్యమకారుల అభ్యంతరాలు అంటారా? అభివృద్ధి, ప్రగతి నిరోధకుల మాటలను పట్టించుకోనవసరం లేదు.వాళ్లు సదా తమ పెండింగ్ ప్రాజెక్టుల హంద్రీ-నీవా, గాలేరు- నగరి, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని, కనీసం పంట కాలువలు తవ్వలేదని ఆరోపణలు (నిజమైనవే కావచ్చు) చేస్తూనే ఉన్నారు. పూర్తిగా విధ్వంసమైన అలగనూరు, అన్నమయ్య రిజర్వాయర్లను పునర్నిర్మించమని, వెలుగోడు, గోరుకల్లు రిజర్వాయర్ల రిపేర్లు చేపట్టాలని,ఔకు సొరంగాల పూర్తీ చేయాలని, పందికోన రిజర్వాయర్ పంట కాలువలు నిర్మించాలని,వీటికన్నింటికీ రూ.1500 కోట్లు సరిపోతాయని, వీటిని పూర్తి చేస్తే, తమకు గోదావరి నీళ్లు అవసరం లేదని వాదిస్తున్నారు. వృధాగా పోతున్న కృష్ణా జలాలను సద్వినియోగం చేసేందుకై చెరువుల రిపేర్ల చేపట్టి, అనుసంధానం చేయాలని గొంతెమ్మ కోర్కెలు కోరుతూనే ఉంటారు. సంకుచిత మనష్కులు.గతంలో శ్రీబాగ్ ఒడంబడికను తుంగలో తొక్కినా,రాజదానీని కర్నూల్ నుండి తరలించినా,నాగార్జున సాగర్ కు హెడ్ ట్యాంక్ కు గా శ్రీశైలం రిజర్వాయర్ నిర్మించినా కిక్కురుమనకుండా పాటలు కట్టి ఆనందించిన సీమ ప్రజలు ఎంత త్యాగధనులు.వారి వారసులా,నేటి ఉద్యమ కారులు.సిగ్గు,సిగ్గు. పాపం చంద్రబాబు కొన్ని దశాబ్దాలుగా మనతో,” బాబు వేచి ఉండండి. పంచభక్ష పరమాన్నాలతో భోజనాలు వడ్డిస్తాం” అని అంటుంటే, సీమవాసులు మాత్రం ,” బాబూ,మాగొంతెండి పోతుంది,కడుపు ఖాళీగా వుంది.మాకు దోసెడు నీళ్ళు,పిడికెడు అన్నం పెట్టండి ” అంటూ అర్థిస్తున్నారు. పాపం ఆ దానకర్ణున్ని చిన్న బుచ్చుతున్నారు.
ఇక రెండు రాష్ట్రాల రాజకీయ పార్టీలంటారా? సీమకు చంద్రన్నజలాల దోచి పెడుతున్నారని తెలంగాణ ఛాంపియన్లు అంటే, సీమ అభివృద్ధికి తెలంగాణ అడ్డుపడుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నాయకులు నిందిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు సరే, జాతీయ పార్టీలు గోడమీద పిల్లి వాటం. ఏ ఎండకు కాగొడుగు పట్టేరకం. అయితే, చంద్రన్నది పెద్దమనసు. అమరావతి, పోలవరం- ఎలాగైతే ఆయనకు రెండు కన్నులో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా అంతేనని పదేపదే చెబుతున్నారు. అందులోనూ, నవ్య హైదరాబాద్ నిర్మాణం కర్త,కర్మ,క్రియా ఆయనే కదా! ఏమైనా, రాజకీయ పార్టీలకు, తమ ప్రాంత ప్రజలను మౌలిక సమస్యల నుండి దృష్టి మరల్చి, ప్రాంతాల మధ్య విభేదాల సృష్టించి, వారిని ఓటు బ్యాంకులుగా మార్చుకునేందుకు, చంద్రన్న ప్రణాళిక పోలవరం బనకచర్ల- ఒక మంచి పదునైన సాధనమైంది. ఈ ప్రాజెక్టుపై దినపత్రికలలో నిందలు, ఆరోపణలు, టీవీ, యూట్యూబులలో వేడి, వేడి చర్చలు, వాటిని చదివి, విని, వాస్తవ పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేని పాఠకులు, వీక్షకులు, ప్రాంతాలవారీగా, పార్టీల వారీగా విమర్శించుకుంటున్నారు.
ఇన్ని గొడవల మధ్య, అటు దక్షిణ తెలంగాణ, ఇటు రాయలసీమ సామాన్య ప్రజలు, తమ ప్రభుత్వాలు తమ ముందు ఉంచుతున్న మృగతృష్ణలో దాహం తీర్చుకునేందుకు ఆరాటపడడం ఒక విషాదం. నాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా వున్న కాలం నుండి తమ ప్రాంత రాజకీయనాయకుల పదవీ వ్యామోహాలకు బలిపశువులు కావడం రాయలసీమ వాసులకు అలవాటుగా మారింది. నాడు ఆంద్ర విశ్వవిద్యాలం ఏర్పాటులో,తర్వాత సంగమేశ్వరం వద్ద ఆనకట్ట,రాజధాని తరలింపు,శ్రీబాగ్ ఒప్పందపు ఉల్లంఘనలు , ఇప్పుడు ఇప్పటికే నెలకొని వున్న సంస్థలను కోస్తాకు తరలించడం లాంటి వెన్నుపోట్లు ఎన్నో. మోసాలకు అలవడిన జీవితాలు ఈ ప్రాంత ప్రజలవి.స్వామి భక్తిలో తన్మయం చెందుతూ, ఏదో ఒక నాయకునికి సేవ జేస్తూ, భూస్వామ్య బావజాలం నుండి బయటపడలేని పరిస్థితి మాది. ఇందుకు ప్రజలను నిందించాల్సిన అవసరం లేదు అది తప్పు కూడా. వారు దైనందిక జీవితాల కష్టాల సుడిగుండాల్లో గిలగిల లాడుతున్నది చేదు వాస్తవం. మేధావులుగా చెప్పుకునే వారు కూడా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ నష్టపోతుందని, రాయలసీమ లబ్ధి చెందుతుందని వాదించేవారు, ఈ ప్రాజెక్టుతో తమ ప్రాంత స్వర్ణ రాయలసీమగా మారుతుందనే వారూ ఉండటం ఒక విషాదం. “. ఉన్న నీళ్ళను సముద్రం పాలు జేస్తూ,, ఒక లక్ష కోట్ల రూపాయల ఖర్చు చేస్తూ, దాదాపు 500 అడుగుల ఎత్తుకు నీల్లెత్తిపోయడo- “మబ్బుల్లో నీళ్ళు జూసి ముంత వలకపోసుకోవడం” అంటే ఇదేనేమో
అయ్యా, మాకు కేటాయించిన నీళ్లు, వృధాగా సముద్రంలో పాలవుతున్న నీళ్ళు మా ప్రాంతానికి వినియోగించేలా ప్రణాళికలు, పథకాలు అమలు చేయండి. మాకు గోదావరి నీళ్లు అవసరం లేదు అంటూ రాయలసీమ ఉద్యమకారులు ఎప్పటినుండో నెత్తి, నోరు కొట్టుకొని చెబుతున్నారు. అయినా ఉద్యమకారుల మాట వినేది ఎవరు? సామాన్య ప్రజలు పాలకవర్గాల మాయాజాలం నుండి బయటపడడం లేదు. వారిని బయటికి లాగడం అంత సులభ సాధ్యం కాదని మా అనుభవం కూడా. ఇక రాజకీయ పార్టీలoటారా? మరల ఏనుగు లక్ష్మణ కవి సుభాషితాన్ని” తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు/ చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు(లేము)/” గుర్తుకు చేసుకోక తప్పదు.అయితే, ఆ మూర్ఖత్వాన్ని ధ్వంసం చేసే రోజు దగ్గరలో లేకపోయినా, ప్రజలకు అది అసాధ్యం మాత్రం కాదని పార్టీలు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
(అరుణ్,కన్వీనర్,రాయలసీమ విద్యావంతుల వేదిక. కర్నూలు, ఆంధ్రప్రదేశ్)