కులాల వర్గీకరణ శాశ్వత పరిష్కారమా?

అగ్రవర్ణాల వారినైన నమ్ముతాం కానీ సోదర కులాల వారిని నమ్మం అనే స్థాయికి ఎస్ సి వర్గాల అనైక్యత చేరుకుంది;

By :  Admin
Update: 2025-02-04 07:13 GMT

-రమణాచారి

ఎస్ సి ల వర్గీకరణ (Categorization of Scheduled Castes) సమస్య మళ్ళీ రచ్చకెక్కింది. సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు, మోడీ లను దాటి ప్రస్తుతం రేవంత్ రెడ్డి వంతుకు వచ్చింది. నాడు ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీ కి, ఇప్పుడు తెలంగాణ నుండి ఢిల్లీ కి వెళ్ళింది. తిరిగి తెలంగాణకు చేరింది. ఉపాధి, ఉద్యోగ అవకాశల్లో తమకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం ఉద్యమం కొనసాగుతున్నది. పూర్తిగా న్యాయమైన, సమర్ధనీయమైన డిమాండ్. దీనిలో ఎలాంటి సందేహం లేదు.

కాకపోతే కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి. ఎస్.సి ల వర్గీకరణతో దళితుల సమస్య పరిష్కారం అవుతుందా? ఇది కేవలం ప్రభుత్వ రంగానికే పరిమితమైతే ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుంది? పాలకులు ప్రైవేట్ రంగానికి (కార్పొరేట్) పెద్దపీట వేస్తున్న తరుణంలో ఏ మేరకు న్యాయం జరుగుతుంది?

అనాదిగా అణచివేతకు గురవుతున్న సాధారణ దళితుల జీవితాల్లో ఏ మాత్రం వెలుగు వస్తుంది? శాశ్వత పరిష్కారం కోసం పోరాటం ప్రణాళిక ఏదైనా ఉన్నదా? దళితవాదం అంటేనే మనువాద, మతోన్మాద సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకం. అందుకే జాగ్రత్తగా దళితులలో ఐక్యత దెబ్బతినకుండా, సోదర భావం పెంచుకుంటూ, చైతన్య పరుస్తూ విజయం సాధించడం కూడా అవసరమైనదే.

ప్రస్తుత పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనపడుతున్నది. ప్రధానంగా ఇది మాల, మాదిగ కులాల మధ్య శత్రుత్వం గా మారింది. ఇదే పౌర సమాజం లో ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే అగ్రవర్ణాలకు చెందిన రెడ్లు, కమ్మలు నైనా నమ్ముతాం/ గౌరవిస్తాం కానీ సోదర కులాల వారిని నమ్మం అనే స్థాయికి వెళ్లడం విచారకరం.

అవకాశాలను అందిపుచ్చుకోవడం, నాటి సామాజిక పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది. విద్యా అవకాశాలు, ఆర్ధిక స్థితిగతులు కూడా ప్రభావితం చేసే అంశాలు. దీని వలన అసమ అభివృద్ధి జరిగే అవకాశం లేకపోలేదు. అంత మాత్రాన తోటి సోదరులపైన అంతలా ద్వేషం పెంచుకోవాల్సిన పనిలేదు. దీని వలన పూర్తిగా అణగారిన వర్గాలలో విభజన జరిగి, ఐక్యతను విడగొట్టి పాలక వర్గాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అవకాశం లభిస్తుంది.

ఈ సున్నితమైన విషయాన్ని అందరూ గ్రహించాలి. ప్రస్తుతం పాలక వర్గ పార్టీలు అమలుపరుస్తున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉన్నది. దేశం ప్రైవేటీకరణ దిశలో వేగంగా పరుగులు తీస్తున్న తరుణమిది. ఆ దిశకు పావులు కడుపుతున్న సందర్బం కూడా. ప్రభుత్వ రంగ సంస్థ లన్నింటిని ఒక్కటొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తున్నారు. దీనితో ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. భవిష్యత్తు అంతా కార్పొరేట్ రంగం చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయం. ప్రైవేట్ రంగ సంస్థలలో రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లు ఉండాలనే డిమాండ్ కూడా బలంగా వినిపించడం లేదు .

రాజకీయంగా కూడా జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు, రిజర్వేషన్లు అమలు కావడం లేదు. రాజకీయ అందలం దక్కించుకోవడం అంటుంచి , సాధారణ దళిత, గిరిజన, బహుజనుల స్థితిగతులలో ఏడు పదులు దాటిన స్వతంత్ర భారతంలో పెద్ద మార్పు ఏమీ రాలేదు. ప్రధానంగా భూమి సమస్య పరిష్కారం కాలేదు. కొత్త పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధి పథకాల పేరిట ఆదివాసీలకు, దళితులకు, బహుజనులకు కేటాయించిన/ పంచిన భూములు కూడా తిరిగి లాక్కుంటున్నారు. దశాబ్దాలు, శతాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములను సైతం కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు.

దేశ ఖనిజ సంపదను కట్టబెడుతున్నారు. దీనికి వ్యతిరేకంగా జరగాల్సిన ఉద్యమాల నిర్మాణం కూడా నామమాత్రంగానే ఉన్నది. ఆదివాసీలకు అండగా దళిత బహుజనులు కదిలి రావడం లేదు. దళితులపై దాడులకు నిరసనగా బహుజనులు ఉద్యమించడం లేదు. మైనారిటీలపై దాడులు ఎవరికీ పట్టడం లేదు. ఇవే పాలకవర్గాలకు కలిసి వస్తున్న అంశాలు. అన్నిటికంటే ప్రధానంగా కులం వలన వచ్చే లాభాలు, ఆ కులంలోని ధనవంతులు, నాయకులు మాత్రమే లబ్ది పొందుతున్నారు. కష్టాలు, నష్టాలు, అవమానాలు ఆయా కులాలలోని సామాన్యులు అనుభవిస్తున్నారు. డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సరిగా అమలు చేసినా నిమ్నవర్గాలకు ఇంత అన్యాయం జరిగేది కాదు. ఇవ్వాళ వేదనను అనుభవిస్తున్నది కేవలం దళితులు, ఆదివాసీలు, బహుజనులు, మైనారిటీలు మాత్రమే కాదు. పీడిత ప్రజలంతా. దేశ సంపద అంతా కొద్దిమంది వ్యక్తులు (కార్పొరేట్ శక్తుల) కబంధ హస్తలలో చిక్కుపడడమే ఇందుకు ప్రధాన కారణం. దేశ సంపద / హక్కులు ప్రజలందరికీ సమంగా పంపిణీ జరగకపోవడమే ప్రధాన సమస్య.

ఈ విషయాలపై సమగ్ర అవగాహనతో చైతన్య పరుస్తున్న/ పోరాడుతున్న వారిపై నిర్భంద చట్టాలను ప్రయోగిస్తున్నారు. అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బూటకపు ఎన్ కౌంటర్ లలో హతమారుస్తున్నారు. తమ కులానికి అన్యాయం జరిగిందని గొంతు ఎత్తుతున్నవారు, తమ వర్గం వారి పైన జరుగుతున్న పాశవిక దాడులపట్ల సరైన రీతిలో స్పందించడం లేదు. ఫలితంగా పాలకుల ఆటలు కొనసాగుతున్నాయి.

వర్గీకరణ మాత్రమే దళితుల సమస్యకు పరిష్కారం కాదు. మతోన్మాదం భయంకరంగా కోరలు చాస్తున్న వేళ కారంచేడు, కంచికచర్ల, చుండూరు, పాదిరికుప్పం ఘటనల సందర్భంలో మాదిరి దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలి.

మహిళలపైన, విద్యార్థుల పైన, ఆదివాసులపైన, మైనారిటీల పైన, దళితుల పైన, కార్మిలపైన, కర్షకుల పైన, బహుజనుల పైన జరుగుతున్న దాడులు ఆధిపత్య వర్గాలు చేస్తున్నవే. ఎందుకు? వారు దుర్మార్గాలను ప్రశ్నించినందుకే. దోపిడీ, పీడనలను ప్రతిఘటించినందుకే. పౌర ప్రజాస్వామిక హక్కులను కాపాడాలని అడిగినందుకే. తమ నేల తమకు దక్కాలని నినదించినందుకే. కార్పోరేట్ శక్తులకు ఈ దేశాసంపదను కట్టబెట్టడం సరికాదని నిలదీసినందుకే. ఇకనైనా పీడిత, తాడిత శక్తులన్నీ ఒక్కటిగా కదలాలి. రాజకీయ లబ్ది కోసం నాయకులు ఇచ్చే ఐక్యతా నినాదాల వెనుకవున్న కుట్రలను గ్రహించగలగాలి. ప్రజలను రెచ్చగొట్టి, బోల్తా కొట్టించి, రాజకీయ లబ్ది పొందడం కోసం ఇచ్చే నినాదాల సారాన్ని అర్ధం చేసుకోవాలి.

పాలక వర్గ పార్టీల నినాదాలు వేరుగా కనపడినా, అధికారం చేజిక్కించుకోవడం, నిలుపుకోవడం, ప్రజా ధనాన్ని / సంపదను దోచుకోవడం, దాచుకోవడమే వారి అంతిమ లక్ష్యమని గుర్తించాలి. ఈ విషయాలను సూక్ష్మ దృష్టితో పరిశీలించి, నిలదీసి ప్రశ్నించే చైతన్యం రానంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. పాలక వర్గాల ఆటలు కొనసాగుతూనే ఉంటాయి. పీడితులు మరింత బానిసత్వం లోకి నెట్టివేయబడుతూనే ఉంటారు.పాలక వర్గాలు ప్రలోభ పెట్టే మోసపూరిత వాగ్దానాలకు,కుట్రపూరిత నినాదాలకు, ఆకర్షణీయ పథకాలకు లొంగకుండా నాయకత్వం ఉద్యమాన్ని నడపగలిగితేనే పోరాటం విజయం సాధించ గలుగుతుంది

Tags:    

Similar News