కాళేశ్వరంలాగే పోలవరం-బనకచర్ల కమీషన్ల కోసమే
ఇలాంటి పోలవరం - బనక చర్ల ప్రాజెక్టు పై తెలంగాణా అనవసర రాద్ధాంతం;
పోలవరం బనకచర్ల ప్రతిపాదిత ప్రాజెక్టు పైన తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు ,తెలంగాణ ప్రభుత్వం రాద్ధాంతం చేయడం, రచ్చ చేయడం అనవసరం . గోదావరి నదిలో 75% విశ్వసనీయత ఆధారంగా 3000 టీఎంసీలు నికర జలాలు వుంటాయని బచావత్ ట్రిబ్యూనల్ నిర్ధారించింది.
ఆ 3000 టీఎంసీలను వివిధ రాష్ట్రాలకు కేటాయించడం జరిగింది. 889 టీఎంసీలు మహారాష్ట్రకు, 20 టీఎంసీలు కర్ణాటక కు ,625 టీఎంసీలు చత్తీస్గఢ్ కు ,293 టీఎంసీలు ఒరిస్సా కు, 1173 టిఎంసిలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నికర జలాలు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించడం జరిగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1173 టీఎంసీలు నికర జలాలతో పాటు పునరుత్పత్తి జలాలు కలిపి 1480 టిఎంసిల నికర జలాలు కేటాయించడం జరిగింది.
ఈ 1480 టిఎంసిల్లో ప్రాజెక్టు వారీగా తెలంగాణ రాష్ట్రానికి 710 టీఎంసీలు ,ఆంధ్రప్రదేశ్కు 770 టీఎంసీలు నికర జలాలు కేటాయించడం జరిగింది .ప్రాజెక్టు లవారీగా తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి సింగూరు ,నిజాంసాగర్, శ్రీరామ్ సాగర్, కడెం , మిడ్ మానేరు ,ఎల్లంపల్లి ,సుందెల్ల ,అన్నారం, కాలేశ్వరం, తుపాకులగూడెం ,సీతారామ ,ఇచ్చంపల్లి . ఈ ప్రాజెక్టులన్ని తెలంగాణ రాష్ట్రంలో నికర జలాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 770 టీఎంసీల్లో 385 టీఎంసీలు పోలవరానికి ,264 టీఎంసీలు గోదావరి డెల్టాకు కేటాయించింది. కాబట్టి ఇక నికర జలాలు లేవు.వుండేది మిగులు లేక వరద జలాలే .మిగులు జలాలు ఉండొచ్చు ,ఉండకపోవచ్చు. మిగులు జిల్లాలు వాడుకునే స్వేచ్ఛ దిగువ రాష్ట్రానికి ఉంటుంది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం కాబట్టి దిగువ రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ వాడుకోవచ్చు .వాడుకోకపోతే దిగువన బంగాళాఖాతంలో సముద్రంలో కలిసిపోతాయి. సముద్రంలో బంగాళాఖాతంలో కలిసిపోయే మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే ఎగువ రాష్ట్రమైన తెలంగాణకు వచ్చిన ఇబ్బంది ఏమిటి ?ఇంకా పైనున్న రాష్ట్రాలకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? కాబట్టి పోలవరం బనకచర్ల ప్రతిపాదిత ప్రాజెక్టు మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలు ,తెలంగాణ ప్రభుత్వము రాద్ధాంతం చేయడం ,రచ్చ చేయడం ఏమాత్రం సమంజసం కాదు.
ఇక రెండవది పోలవరం బనకచర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కోణంలో ఆలోచిస్తే ఇది ఆంధ్రప్రదేశ్ కు ఒక గుదిబండ అవుతుంది. తెలంగాణకు ఏ విధంగా కాలేశ్వరం గుదిబండ అయిందో రాబోవు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు ఈ పోలవరం బనకచర్ల ఒక గుది బండ అవుతుంది. ఇప్పటికే రాష్ట్రము అప్పుల కుప్పయింది .ఈ ప్రాజెక్టు రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్లు చేస్తుంది .ఈ ప్రాజెక్టు అంచనా విలువ ప్రస్తుతం 81900 కోట్ల రూపాయలు.
ఇది ఏ రెండు లక్షలు, మూడు లక్షల కోట్ల రూపాయలకు పోయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు .ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రకారంగా 50% విదేశాల నుంచి అప్పు తీసుకుంటుందట ,20 శాతం కాంట్రాక్టర్ పెట్టుకుంటాడు అట,కాంట్రాక్టర్ రైతుల నుండి రాబడతాడంట నీటి పన్ను ద్వారా, 20% కేంద్రము ,10% రాష్ట్రం భరించే విధంగా తయారు చేయడం జరిగింది. 38 కిలోమీటర్ల మేర మూడు టన్నుల్స్ ఉంటాయి .400 మెగావాట్ల విద్యుత్ అవసరం. 47,99 9ఎకరాల భూసేకరణ అవసరం ,అందులో 17 వేల ఎకరాలుఅటవీ భూమి .10 లిఫ్టులు వుంటాయి.
ఈ పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును నిర్మించడం సాధ్యమా ?అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పినమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లుంది.ఉన్న ప్రాజెక్టులకు డబ్బు ఇవ్వని కారణంగా ఎక్కడి వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా ఉండి పోయినాయి .మరికొన్ని ప్రాజెక్టులు నత్తకు నడక నేర్పుతున్నాయి. కాబట్టి పోలవరం బనకచర్ల సాగునీటి ప్రాజెక్టు అసాధ్యమైన ప్రాజెక్ట్ .ఇది ఆచరణ సాధ్యం కానటువంటి ప్రాజెక్ట్ .ఇది కచ్చితంగా రాష్ట్రానికి గుదిబండ అవుతుంది .తెలంగాణకు కాలేశ్వరం ఏవిధంగా గుదిబండ అయిందో ఆ విధంగా మరొక కాళేశ్వరంగా తయారవుతుంది . ఇది కమిషన్ల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. రాయలసీమ ప్రజల ప్రజల కోసం కాదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రతిపాదనను విరమించుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఎగువ రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్నటువంటి అక్రమ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడం. ప్రధానంగా కృష్ణా నది మీద తెలంగాణ ప్రభుత్వం రెండు ప్రధాన ప్రాజెక్టులు నిర్మిస్తోంది.ఒకటి పాలమూరు రంగారెడ్డి ,రెండు డిండి ఎత్తిపోతల పథకం .ఈ రెండు ప్రాజెక్టులకు బచావత్
నీటి కేటాయింపులు లేవు. సి డబ్ల్యూ సి అనుమతి లేదు. కృష్ణ రివర్ మేనేజ్మెంట్ అనుమతి లేదు .అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. నీటి కేటాయింపులు లేకుండా ,అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ,30 టీఎంసీలతో దిండి ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తోంది.ఈ పథకాలు పూర్తి అయితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది మీద వున్న ప్రాజెక్టులన్ని నిరుపయోగం అవుతాయి .నాగార్జునసాగర్ ,తెలుగు గంగ ప్రాజెక్టు, గాలేరు నగరి స్రవంతి ,హంద్రీనీవా ,ఎస్ ఆర్ బి సి, వెలుగొండ ఈ ప్రాజెక్టులన్ని నిరుపయోగం అవుతాయి .
ఈ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి 48 లక్షల ఎకరాలు బీడు భూములవుతాయి. త్రాగునీరు లభించదు .పరిశ్రమలకు నీళ్లు లభించవు .ఒక్కమాటలో చెప్పాలంటే పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి అయితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ థార్ ఎడారి అవుతుంది. కాబట్టి ఇంత ప్రమాదం ఉంచుకోరాబోతుంది. వాటి గురించి ఆలోచించుకోకుండా పోలవరము బనకచర్ల గురించి చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించడం అవివేకం.కాబట్టి ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం చేయాల్సిన పనులు మూడు .ఒకటి పోలవరం బనకచర్ల ప్రతిపాదిత ప్రాజెక్టును విరమించుకోవాలి. రెండవది తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలి. మూడు రాష్ట్రంలో నిర్మాణం లో వున్న ప్రాజెకులు తెలుగుగంగా, గాలేరు నగరి ,హంద్రీనీవా ,వెలుగొండ ,అన్నమయ్య ,జరికోన ,పింఛ, ఉత్తరాంద్ర సుజల స్రవంతి ,పోలవరం ఈ పథకాలకు నిధులు కేటాయించి సత్వరం పూర్తి చేయాలి.
(డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి, రాజ్య సభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి.)