అన్నదాతల సమస్యలు పార్టీలకు పట్టవా?

లోక్‌సభ అభ్యర్థులకు రైతుల ఓట్లు అవసరం లేదా? రైతు సమస్యల గురించి ఎందుకు మాట్లాడడం లేదు. అన్నదాతల పట్ల పార్టీల వ్యూహం ఏంటి?

Update: 2024-04-22 11:06 GMT

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఎక్కడా కూడా రైతుల ఇబ్బందులను ప్రస్తావించడం లేదు. వారి కష్టనష్టాల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా రైతుల పక్షాన నోరు విప్పకోపోవడం బాధాకరం. కర్ణాటకలో మునుపెన్నడూ లేని కరువును చవిచూసింది. రాష్ట్రంలోని 236 తాలూకాల్లో 223 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించిందంటే.. జనం, మరీ ముఖ్యంగా రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

రైతు ఆత్మహత్యలు..

కరువు పరిస్థితులు, రుణభారంతో పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో 2023 ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు 456 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మొత్తం ఆత్మహత్యల్లో మూడో వంతు రైతులు హవేరి, బెళగావి, చిక్కమగళూరు జిల్లాలకు చెందిన వారే. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హవేరిలో అత్యధికంగా 62 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. బెలగావి 56 మంది, చిక్కమగళూరు 49 మంది బలవంతంగా తనువు చాలించారు.

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం, మృతుడి భార్యకు రూ.2వేల పింఛన్ పంపిణీ చేశారు. ఇప్పటివరకు నమోదైన 456 ఆత్మహత్యల్లో 354 కుటుంబాలకు ఈ పరిహారాన్ని పంపిణీ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి పరిహారం పొందాలంటే ఆత్మహత్య చేసుకున్న రైతు గతంలో బ్యాంకు రుణం తీసుకుని ఉండాలన్న నిబంధన కూడా ఉంది.

ఈ దుస్థితికి కారకులెవరు?

రైతుల రుణమాఫీకి ప్రభుత్వం చాలా సమయం తీసుకుంటోంది. జనవరి 2024 లెక్కల ప్రకారం.. 2017-2018 ఏడాదికి రుణమాఫీకి అర్హత పొందిన రైతులు 30,733 మంది. అయితే నేటికీ వీరికి రుణమాఫీ చేయలేదు. ఇటు పంటరుణాలు మాఫీ చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై రైతు సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఎన్నికల హామీల అమలు కారణంగా ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉండడం.. రుణమాఫీకి మరో అడ్డంకి.

రైతు కష్టాలు ఎవరీకి పట్టవు..

ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి..కానీ రైతుల కష్టాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇవి కర్నాటకలోని ఉత్తర, దక్షిణ ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.’’ అని కర్ణాటక చెరకు గ్రోవర్స్ అసోసియేషన్ (KSGA) అధ్యక్షుడు కురుబుర్ శాంతకుమార్ అన్నారు.

అయితే మండ్య జిల్లా ఆలకెరె గ్రామానికి చెందిన రాజశేఖర గౌడ్ది మాత్రం భిన్నమైన అభిప్రాయం వెలుబుచ్చారు. రైతుల్లో అసంతృప్తి రాజకీయ పార్టీలపై ప్రభావం చూపదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా ఆదాయం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై రైతుల కష్టాలను పూర్తిగా విస్మరిస్తున్నారని శాంతకుమార్ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం గురించి రాజకీయ పార్టీలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రైతు సంఘాల మధ్య అనైక్యత కూడా ఒక కారణంమని చెప్పారు చుక్కి నంజుండస్వామి. వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలు, విద్యావేత్తలతో కూడిన కమిటీ రైతుల మేనిఫెస్టోను రూపొందించిందని, త్వరలోనే విడుదల చేస్తామని ఆయన ఫెడరల్‌తో చెప్పారు.

రైతుల మనసు అంగీకరిస్తుందా?..

ఇటీవల సీఎం సిద్ధరామయ్య ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ‘బీజేపీకి ఓటు వేయడానికి మీ మనస్సాక్షి అంగీకరిస్తుందా?' అని రైతులను ప్రశ్నించారు. నీటి పారుదల ప్రాజెక్టులు, కరువు నివారణ, ఉపాధి పనిదినాలు పెంచకపోవడంతో రైతులు, రైతు కూలీలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

“బీజేపీ 2018లో తన మేనిఫెస్టోలో జాతీయ బ్యాంకుల్లో రైతుల రూ లక్ష వరకు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత, మాజీ సిఎం యడియూరప్ప నిధుల కోసం నోట్ ప్రింటింగ్ యంత్రాన్ని కోరారు. రైతులు ఎరువులు కోరినప్పుడు అతను పోలీసు కాల్పులకు ఆదేశించాడు. అందులో కొంతమంది రైతులు మరణించారు. ఇప్పుడు చెప్పండి..బీజేపీకి ఓటు వేయడానికి మీ మనస్సాక్షి అంగీకరిస్తుందా? అని ప్రశ్నించారు.

రాష్ట్రానికి కేంద్రం కరువు సాయం నిరాకరించిందన్న అంశాన్ని కూడా సిద్దరామయ్య ప్రస్తావనకు తెచ్చారు. బీజేపీ ఎంపీలు కేంద్రం నుంచి కరువు సాయం ఎందుకు అడగడం లేదు? కరువు సాయంగా ₹18,177 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి పలు లేఖలు రాశాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను. కానీ పైసా కూడా విడుదల చేయలేదు.’’ అని శివమొగ్గలో జరిగిన ఎన్నికల ర్యాలీలో కర్ణాటక సీఎం అన్నారు.

ఎన్నికల ప్రచారంలో రైతు సమస్యలపై ఏ నాయకుడు మాట్లాడడం లేదు. వారి భవితవ్యంపై రైతుల ప్రభావం ఏ మేర ఉంటుందో చూడాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News