కేవలం రూ.99 కే థియేటర్లలో నచ్చిన సినిమా చూసే ఛాన్స్
మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్. రూ.70 నుంచి రూ.99 లకే సినిమా చూసే అవకాశం లభించనుంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజు ఈ ప్రమోషన్ ఆఫర్ నడవనుంది.
మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్. రూ.70 నుంచి రూ.99 లకే సినిమా చూసే అవకాశం లభించనుంది. దేశవ్యాప్తంగా ఒక్కరోజు ఈ ప్రమోషన్ ఆఫర్ నడవనుంది. హైదరాబాద్ లో బెంబేలేత్తిస్తున్న మూవీ టికెట్స్ ధరలకు థియేటర్ కి వెళ్లాలంటేనే భయపడుతున్న సినిమా లవర్స్ కి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి.
ఎందుకంటే ఏపీతో పోలిస్తే తెలంగాణలో సినిమా రేట్లు డబుల్ ఉన్నాయి. మల్టీ ప్లెక్సుల్లో సినిమా బడ్జెట్ ని బట్టి ధరలు కూడా భారీగానే ఉంటున్నాయి. దీంతో థియేటర్లకు వెళ్లేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఎలక్షన్ల పుణ్యమా అని సినిమాలు కూడా పెద్దగా విడుదల కాకపోవడంతో థియేటర్లకు జనాల రాక బాగా డల్ అయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సింగిల్ స్క్రీన్స్ కూడా 15 రోజుల పాటు తాత్కాలిక బ్రేక్ తీసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో థియేటర్ల వద్ద సినిమాల సందడి తగ్గింది.
రాష్ట్రంలోనే కాదు, దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. వేసవి సెలవులు ఉన్నప్పటికీ ఇంట్లోనే ఓటీటీ ల రూపంలో సినిమాలను, వెబ్ సిరీస్ లను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్లకు తగ్గిపోతున్న ప్రేక్షకులను తిరిగి తీసుకురావడానికి దేశం అంతటా థియేటర్ లు టిక్కెట్ ధరలపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ‘సినిమా లవర్స్ డే’గా పిలువబడే మే 31న మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ సినిమాస్ రెండూ కేవలం 99 రూపాయలకే సినిమా టిక్కెట్లను అందించనున్నాయి. ఈ విషయాన్ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది.
Cinema Lovers Day returns on 31st May with movies for just Rs 99/-!🍿Join us at cinemas across India to celebrate a day at the movies. Over 4000+ screens are participating, making it an unforgettable cinematic experience!#CinemaLoversDay pic.twitter.com/b2XAOC3yxy— Multiplex Association Of India (@MAofIndia) May 28, 2024
PVR ఐనాక్స్, సినీపోలిస్ ఇండియా, మిరాజ్ సినిమాస్, మూవీమాక్స్ వంటి ప్రధాన మల్టీప్లెక్స్ లలో కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ చెయిన్ లు సుమారు 4,000 స్క్రీన్ లను కవర్ చేస్తాయి. అయితే, వీటిలో ప్రమోషన్ ఆఫర్ నుండి రిక్లైనర్స్ వంటి ప్రీమియం ఫార్మాట్ లు మినహాయించబడినప్పటికీ, 90-95% సీట్లు తగ్గింపు రేటుతో అందుబాటులో ఉంటాయి.
ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ సినిమాలు కూడా ఈ ఆఫర్ ని అమలు చేస్తున్నాయి. ఈ థియేటర్ లలో కొన్ని రూ. 70 కంటే తక్కువ ధరలకు టిక్కెట్లను కూడా అందిస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది మూవీ లవర్స్ ని థియేటర్లకు తీసుకురావాలన్నదే వారి ఆలోచన.
తెలంగాణలో మే 15 నుంచి రెండు వారాల పాటు దాదాపు 450 సింగిల్ స్క్రీన్ థియేటర్లను తాత్కాలికంగా మూసివేశారు. అయితే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'గం గం గణేశ', 'భజే వాయు వేగం' వంటి చిత్రాల విడుదలతో కొన్ని థియేటర్లు తిరిగి తెరవడం ప్రారంభించాయి. రెండు వారాల పాటు క్లోజ్ అయ్యి సింగిల్ స్క్రీన్స్ మళ్ళీ రీఓపెన్ చేస్తున్న తరుణంలో ఈ ఆఫర్ ఇవ్వడం విశేషం. అభిమానులు కూడా ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలున్నాయి.