’మీర్జాపూర్‌ సీజన్ 3′ ఓటిటి రివ్యూ

వెబ్ సీరిస్ లు అనగానే ఎంతసేపు మనీ హీస్ట్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ , బ్రేకింగ్ బ్యాడ్, వాకింగ్ డెడ్, స్క్విడ్ గేమ్ ఇలాంటి ఇంటర్నేషనల్ స్దాయివే గుర్తు వస్తాయి.

Update: 2024-07-08 12:24 GMT

వెబ్ సీరిస్ లు అనగానే ఎంతసేపు మనీ హీస్ట్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ , బ్రేకింగ్ బ్యాడ్, వాకింగ్ డెడ్, స్క్విడ్ గేమ్ ఇలాంటి ఇంటర్నేషనల్ స్దాయివే గుర్తు వస్తాయి. అయితే మనదేశం ప్రేక్షకులుకు మాత్రం ‘మీర్జాపూర్‌’ (Mirzapur) గుర్తు వస్తుంది. ఈ సీరిస్ ఆ స్దాయిలో జనాల్లోకి వెళ్లిపోయింది. మన తెలుగు వాళ్ల కూడా డబ్బింగ్ వెర్షన్ తెగ చూసేసి సోషల్ మీడియాలో డిస్కషన్స్ పెట్టేవారు. ఈ సీరిస్ లో విపరీతమైన హింస, బూతులు డైరక్ట్ గానే ఉన్నాయి. అయినా వాటిని జనం క్యాజువల్ గా తీసుకున్నారు. ఆ కల్చర్ లో అంతే అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ సీరిస్ లో మూడో సీజన్ స్ట్రీమింగ్ మొదలైంది. ఎంతో ఎక్సపెక్టేషన్స్ తో వచ్చింది. వాటిని రీచ్ అయ్యిందా... ఎలా ఉంది ఈ సీజన్ 3, రెండు పార్ట్ లను దాటేలా ఉందా ,ఈ కొత్త సీజన్ లో ఏం కథ నడిచింది వంటి విషయాలు చూద్దాం.

మొదటి రెండు సీజన్స్ కథను ఓ సారి గుర్తు చేసుకుంటే...

అన్నదమ్ములు గుడ్డూ భయ్యా (అలీ ఫజల్),బబ్లూ పండిత్‌ (విక్రాంత్ మాస్సే) ఇద్దరూ కాలీన్ భయ్యా(పంకజ్ త్రిపాఠి) దగ్గర పనిచేస్తూంటారు. సీజన్‌ చివర్లో తాను ప్రేమించిన యువతిని బబ్లూ పండిట్(విక్రాంత్ మాస్సే) ప్రేమించాడని కోపంతో మున్నా(దివ్యేందు).. కోపంతో మండిపడతాడు. అంతేకాకుండా గుడ్డూ భయ్యా తమ్ముడుతో పాటు సన్నిహితులను చంపేస్తాడు.

రెండో సీజన్లో తన తమ్ముడుని, తన వాళ్ళను చంపిన మున్నాపై గుడ్డూ భయ్యా ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో చూపించారు. సీజన్ 2 ఆఖర్లో తండ్రీకొడుకులు ఇద్దరికి మరణ ముహూర్తం పెడతాడు. కానీ, కాలిన్ భయ్యా తప్పించుకుంటాడు. కానీ, మున్నా మాత్రం ప్రాణాలు కోల్పోతాడు. దీంతో మూడో దానిపై ఇప్పుడు ఈ మూడో సీజన్ ఏం జరగబోతోందనే ఆసక్తి మొదలైంది.

ఇక ఈ కొత్త మీర్జాపూర్ సీజన్ 3 లో మున్నా అంత్యక్రియలతో స్టార్ట్ చేశారు. కాలీన్‌ భయ్యా (పంకజ్‌ త్రిపాఠి) తీవ్రంగా గాయపడి కనిపించకుండా పోతాడు. దీంతో మీర్జాపూర్‌ ని ఎవరు ఏలుతారు. మీర్జాపూర్ కుర్చిని ఎవరు దక్కించుకుంటారు అనే పాయింట్ చుట్టూ కథ మొదలవుతుంది. ఇప్పుడు గుడ్డు భయ్యా తనేంటో చూపించాలనుకుంటాడు. పూర్వాంచల్‌లో ప్రతి దాన్ని శాసించే శక్తిగా ఎదగాలనుకుంటాడు. కాలీన్‌ భాయ్‌ అనే వ్యక్తి ఉనికే లేకుండా చేయాలనుకుంటాడు. అందుకు బీనా ఆంటీ(రషిక దుగల్) గుడ్డుకు సపోర్ట్ ఇస్తుంది. గుడ్డు పండిట్ మీర్జాపూర్ సింహాసనం పై కూర్చుంటాడు.

మరో ప్రక్క మున్నాభాయ్‌ మరణంతో మాధురీ యాదవ్‌ (ఇషా తల్వార్‌) రాజకీయాల్లోకి వస్తుంది. సానుభూతితో ముఖ్యమంత్రి కూడా అవుతుంది. కనిపించకుండా పోయిన కాలీన్‌ భయ్యాపై సానుభూతి ప్లే చేస్తుంది. ఇంతకీ కాలీన్ భయ్యా ఏమయ్యాడు అనే సస్పెన్స్ తో మూడు ఎపిసోడ్స్ నడుస్తాయి. నాలుగో ఎపిసోడ్ లోనే అతను కనిపిస్తాడు. మరో ప్రక్క గుడ్డూ ఎదగటం సింహాసనం అధిష్టించటం ఎవరికీ ఇష్టం ఉండదు. అతనికి వ్యతిరేకంగా అనేక శక్తులు ఒకటవుతాయి. ఈ క్రమంలో మీర్జాపూర్ సింహాసనాన్ని గుడ్డు పండిట్ కాపాడుకోగలిగాడా? చివరకు ఏమైంది అనేదే సీజన్‌-3 కథ.

విశ్లేషణ

ఈ సీరిస్ మొదటి రెండు సీజన్స్ అంత గొప్పగా లేకపోవచ్చు కానీ నిరాశ అయితే పరచలేదు. రాజకీయాలు, కుట్రలు వీటి చుట్టూ నడిచే సీన్స్ ఎప్పుడూ ఇంట్రస్టింగే. ఇదే ఇక్కడ మరో సారి ప్లే చేసారు. అయితే రెండు సీజన్స్ లో పగ, ప్రతీకారం పాయింట్ తో నడిచింది. ఈ మూడో సీజన్ కేవలం మీర్జాపూర్ సింహాసనం ఎవరు ఎక్కుతారనే పోటీ చుట్టూ తిరిగింది. దానికి తోడు ఈ సీజన్ లో మొదటి రెండింటితో పోలిస్తే వెలెన్స్, ఎలివేషన్స్ మొదటి రెండు సీజన్స్ తో పోలిస్తే బాగా తక్కువ. కేవలం పొలిటికల్ గ్రౌండ్ లో జరిగే గేమ్ గా ఈ సీజన్ ని డీల్ చేసారు.

ఈ సీజన్ లో ప్లస్ ఏమిటంటే ఎత్తుకు పైఎత్తులు, మలుపులు బాగుండటంతో ఇంట్రస్టింగ్ గా సాగింది. దానికి తగినట్లు స్త్రీ పాత్రలకు బాగా ప్రయారిటీ ఇచ్చారు. ఇక ఈ సీరిస్ ని మొదటి నుంచీ వాస్తవానికి దగ్గరగా అనిపించేలా డిజైన్ చేసారు. అందుకే యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అదే మూడో సీజన్ కు కూడా ప్లస్ అయ్యింది. మీర్జాపూర్ లో పాత్రలు మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా మరియు బబ్లూల పేర్లు బాగా వైరలయ్యాయి. అవే సీజన్ 3 కు కూడా శ్రీరామ రక్ష.

టెక్నికల్ గా ...

ప్రతి ఎపిసోడ్‌ సుమారు 45 నుంచి 50 నిమిషాల పాటు ఉంటుంది. ఈ క్రమంలో అందుకు సరపడ డ్రామా పడక సీన్లు సాగదీసినట్లు అనిపిస్తాయి. కథలో నెక్స్ట్ ఏంటి..? అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్ కాస్త తక్కువగానే ఉంది. ఇక అది ప్రక్కన పెడితే... ఈ సీరిస్ కు టేకింగ్, మేకింగ్ ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి తీస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.., కెమెరా వర్క్ ది బెస్ట్ అన్నట్లు ఇచ్చారు.

నటీనటుల ఫెరఫార్మెన్స్

ఈ సీజన్ లో గుడ్డు భయ్యా పాత్రలో అలీ ఫజల్ అదరకొట్టాడు. ఈ సీజన్‌ మొత్తం తన విశ్వరూపం చూపించాడు. శ్వేతా త్రిపాఠి(గోలు), రషిక దుగల్(బీనా ఆంటీ) కూడా నచ్చుతాయి. ఎప్పటిలాగే పంకజ్ త్రిపాఠి అదరకొట్టారు. మిగతా పాత్రలు కూడా ఎవరికి వంక పెట్టలేని విధంగా ఉన్నాయి

చూడచ్చా

మొదటి రెండు పార్ట్ లు చూసేసిన వారికి ఈ సీరిస్ ని ఇబ్బంది పడకుండా చూసేయచ్చు. అయితే ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అయితే ఈ సిరీస్ లో ఎక్కువగా హింస, రొమాన్స్‌ తో కూడిన సన్నివేశాలు ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండటమే మేలు.

ఎక్కడ చూడచ్చు

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో తెలుగులోనూ అందుబాటులో ఉంది.

నటీనటులు: పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, శ్వేత త్రిపాఠి, మాధురీ యాదవ్‌, విజయ్‌ వర్మ తదితరులు; దర్శకత్వం: గుర్మీత్‌ సింగ్‌, ఆనంద్‌ అయ్యర్‌

Tags:    

Similar News