భారత వైజ్ఞానిక రంగంలో కాంతి పుంజం సర్ సి.వి. రామన్
విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ అందుకున్న ఏకైక ఆసియా వాసి సర్ సి.వి. రామన్ గురించి ప్రజాసైన్స్ వేదిక అధ్యక్షుడు డా.ముచ్చుకోట సురేశ్ బాబు విశ్లేషణ;
వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ అందుకున్న కాంతి పుంజం. ప్రతిష్టాత్మక దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారిన వైజ్ఞానిక యోధుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసిన వ్యక్తుల్లో సర్ సీవీ రామన్ అగ్రగణ్యుడు. వైజ్ఞానిక ఆవిష్కరణల్లో భారతీయులకు నోబెల్ రావడం గగనం. అలాంటిది సర్ సీవీ రామన్ ఆ ఘనత సాధించి చరిత్ర పుటల్లో నిలిచారు. అంతేకాదు, విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ అందుకున్న ఏకైక ఆసియా వాసిగా చరిత్ర సృష్టించారు.
సీవీ రామన్గా పేరుగాంచిన ప్రముఖ భౌతికశాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్. ఆయన 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. భౌతికశాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్దం ఈ రోజును జాతీయ సైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. రామన్ ఎఫెక్ట్ అనే అంశం పై నేచర్ పత్రికలో సి.వి.రామన్ ప్రచురించిన వ్యాసాలు చూసి ప్రపంచం ఆశ్చర్యపడింది. 1930 డిసెంబర్లో సి.వి.రామన్ కు నోబెల్ బహుమతి ప్రకటింపబడింది. వీరికి 1954లో భారతరత్న బహుకరింపబడింది. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్.
ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికీ సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్. ఏటా ఒక్కో థీమ్తో జాతీయ సైన్స దినోత్సవం జరుపుతుంటారు. "ఈ ఏడాది ఎంపవరింగ్ ఇండియన్ యూత్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత భారత్" , భారతీయ యువతకు సాధికారత దిశగా జాతీయ సైన్స్ దినోత్సవం 2025 ను భారతీయ యువతను సైన్స్ ఆవిష్కరణల టార్చ్ బేరర్ గా మార్చే అవకాశాన్ని అందిస్తుంది. సైన్స్ టెక్నాలజీ ఆవిష్కరణల రంగాన్ని కనుగొనడానికి యువ మనస్సులను ప్రేరేపించడం యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది.
భారతీయ యువతను శక్తివంతం చేయడం ప్రాముఖ్యతను కూడా గుర్తించింది. ఈ విధంగా, మనం భారతదేశాన్ని ప్రపంచంలో మెరుగైన ప్రదేశంగా మార్చగలము. ప్రస్తుత శాస్త్రీయ సమస్యలు, వృత్తి, అభ్యసనం, సామర్థ్యంలో చిక్కుముడులను విప్పడానికి జ్ఞానాన్ని మరింత ప్రోత్సహించడం కోసం ఈ అంశం ఎంపిక చేశారు. కొత్త రాతియుగం సమాజంలో అభివృద్ధి చెందిన సామాజిక స్థిరీకరణ కు శాస్త్రీయ ఆధారాలు తక్కువగా ఉన్నాయి. సాంఘిక స్థిరీకరణ తరువాతి కాంస్య యుగం తో ముడిపడి ఉంది. పాఠశాల స్థాయిలో యువ మేధస్సులను ఉత్తేజపరిచి వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి తద్వారా ప్రతి పాఠశాల నూతన ఆవిష్కరణల వేదికగా రూపొందించాల్సిన ఆవశ్యకత నేటి సాంకేతిక యుగంలో ఎంతైనా ఉంది.
ప్రస్తుతం పాఠశాలలో ఉన్న ప్రయోగశాలలు సంప్రదాయ పాఠ్యాంశాలకు అనుగుణంగా రూపొందించినవే కానీ ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మాత్రం లేవు, చాలా పాఠశాలల్లో ప్రయోగశాలలే లేవు . ఇంటర్మీడియేట్ కళాశాలల్లో సైతం ప్రయోగ శాలలు లేకుండానే ప్రయోగ పరీక్షల్లో మార్కులు వేసి విద్యార్థుల్ని ఏమరుస్తున్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు ఎంతైనా కష్టపడాలి, పిల్లలకు లేని పోని భ్రమలు కల్పించకూడదు. పిల్లలు స్వంత వ్యక్తిత్వ వికాసం కోసం కృషి చేయాలి, అన్నింటికీ ఇతరులపై భారం వేస్తే పిల్లలు బలహీనం అయిపోతారు.
పిల్లల్లో మేధావితనం పెరగాలి, విద్యార్థులకు శాస్త్రీయ దక్పథం అలవరుచుకోవాలి. కుల, మత భావనలు వ్యతిరేకించి, చదువ్ఞ కేవలం జీవితంలో విజయం సాధించడానికి కాదు. జీవితంలో పరిపూర్ణత సాధించడానికి ఏ స్థాయిలోనైనా పాఠ్యాంశాలు విద్యార్థి కేంద్రంగా సాగి అతనికి సంపూర్ణ సంతృప్తిని కలిగించాలి. విద్యార్థుల మానసిక, భౌతిక, ఆరోగ్యం సామాజిక అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని వారి భావోద్వేగాలు, సకారాత్మక నడవడికకు అవసరమైన పాఠ్యాంశాలను రూపొందించాల్సిన అవసరం ఉంది.విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారిపై ఎటువంటి ఒత్తిడి లేని, సున్నితమైన సంరక్షణతో కూడిన విద్యను రూపొందించాలి. ప్రశ్నించే తత్వం, ప్రతి అంశాన్ని హేతుబద్ధంగా విశ్లేషించడం,సృజనాత్మక, ఊహాత్మక భావ స్వేచ్ఛ వంటి వాటికి పెద్దపీట వేయాలి.విద్యార్థులు తమ లక్ష్యం చేరుకోవడానికి, సరైన మార్గంలో ప్రయాణించడానికి మేధోపరమైన సంభావితంగా అభివృద్ధికి విద్యాసంస్థలు చోదకశక్తిగా ఉపయోగపడాలి.
ఉపాధ్యాయులు కూడా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటేనే బోధనలో నాణ్యత పెరుగుతుంది. విద్యార్థులు రకరకాలుగా విద్యను నేర్చుకుంటారు. ఎవరికి కావలసిన రీతిలో వారికి బోధించడం ఉపాధ్యాయుల విధి. అందుకే ఆ భాసకులకు అభ్యసన ఎంతో ముఖ్యమైనది. మన శాస్త్ర సాంకేతిక పాఠాలన్నీ పాత చింతకాయ పచ్చడి లాంటివే. సాంకేతిక అభివృద్ధిని ఏమాత్రం పాఠ్యాంశాలలో జోడించలేదు. కొత్త పాఠాలు చేరిస్తే వాటిని ముందుగా ఉపాధ్యాయులు నేర్చుకోవాలి. అందుకని వాటిని సిలబస్లో చేర్చడానికి వీరు ముందుకురారు. కాని విద్యార్థులు మాత్రం వారి ఆలోచనా పరిధి దాటి పోతున్నారన్న సంగతి గ్రహించడం లేదు.
అధ్యాపకులకు బోధన సామర్థ్యాలు పెరిగేట్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. ఆధునిక, శాస్త్ర సాంకేతిక విద్య విద్యార్థులకు అందించినప్పుడే దేశంలో ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతుంది.చిన్న వయసు నుంచే పిల్లలకు శాస్త్రీయ దృక్పథం, సాంకేతిక నైపుణ్యం అలవడడానికి కావలసిన ప్రాథమిక అంశాలు పాఠ్యాంశాలలో చేర్చాలి. దీంతో మూఢ నమ్మకాలు, మూర్ఖ విశ్వాసాలకు దూరంగా హేతుబద్ధంగా ఆలోచించడం నేర్చుకుంటారు. అంతేకాకుండా కళాశాల స్థాయి వచ్చే సరికి విద్యార్థులు సొంత సాంకేతిక అంశాలు రూపొందించే సామర్థ్యాన్ని పుణికి పుచ్చుకుంటారు. పాఠశాలలో ప్రప్రథమంగా పరిసరాల విజ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పాలి. తమ చుట్టూ జరుగుతున్న భౌతిక రసాయన,వృక్ష విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలి. దీనివల్ల విద్యార్థులకు సమాజంపై అవగాహన, బాధ్యత పెరుగుతుంది. పిల్లలకు నైతిక విలువలు, మానవ సంబంధాలు, సానుకూల దృక్పథం, లక్ష్య సాధన గురించి వారంలో ఒక రోజు పాటు విధిగా బోధించాలి.