వైద్య విద్య కోసం ఇరాన్కే ఎందుకు వెళ్లాలి?
NEET ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేని వారు వైద్యవిద్య అభ్యసించేందుకు ఇరాన్ దేశానికి క్యూ కట్టడానికి కారణాలేంటి?;
ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ధం (Iran-Israel conflict) నేపథ్యంలో.. ఇరాన్లో చదువుతున్న భారతదేశ విద్యార్థులను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చారు. ఇలా వచ్చిన 2,500 మంది విద్యార్థుల్లో ఎక్కువ మంది వైద్య(Medicine) విద్యార్థులే ఉన్నారు. 2023 లెక్కల ప్రకారం.. దాదాపు 1,700 మంది భారతీయ విద్యార్థులు ఇరాన్లో చదువుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మెడిసిన్ చదువుతున్న వారుకాగా మరికొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్.
వైద్యవిద్య కోసం ఇరాన్(Iran)ను ఎంచుకోడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ‘ది ఫెడరల్’ భారత్కు తిరిగివచ్చిన మెడిసిన్ స్టూడెంట్స్తో మాట్లాడింది. ఇండియాలోని ప్రైవేటు కాలేజీలతో పోలిస్తే అక్కడ కోర్సు ఫీజు తక్కువగా ఉండడం, కాలేజీల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండడం వల్లే ఇరాన్ను ఎంచుకున్నామని చెప్పుకొచ్చారు.
తీవ్ర పోటీ..
NEET-UG 2025 పరీక్షకు విద్యార్థులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. 1.1 లక్ష MBBS సీట్లకు 22 లక్షల మంది పరీక్ష రాశారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్లు 58వేలు మాత్రమే. ఇక ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులంతా ఆశ వదులుకోలేక విదేశాల బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ఫీజు తక్కువగా ఉన్న కాలేజీలపై దృష్టిపెడుతున్నారు. ఇరాన్లో వార్షిక ట్యూషన్ ఫీజు $4000-$6000 వరకు ఉండడం, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండడంతో అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు.
యుద్ధం కారణంగా ఇటీవల భారత్కు తిరిగివచ్చిన వైద్య విద్యార్థుల్లో సోబియా సజాద్ ఒకరు. మెడిసిన్ కోసం ఇరాన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నారో చెప్పుకొచ్చారు.
‘ఇండియాతో పోలిస్తే తక్కువ ఫీజు’..
"మూడేళ్ల పాటు ఇండియాలో మెడిసిన్ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించా. చివరకు ఓ ప్రైవేట్ కాలేజీ ఆఫర్ చేసింది. అయితే ఫీజు చాలా ఎక్కువ. లెక్క వేస్తే కోర్సు పూర్తయ్యేటప్పటికి రూ. 70 లక్షల నుంచి రూ. 80 లక్షలు ఖర్చవుతుంది. అంత ఫీజు కట్టి చదివించే పరిస్థితుల్లో నా కుటుంబం లేదు. డాక్టర్ కావాలన్నది నా కల. దాన్ని నేను వదులుకోదలుచుకోలేదు. దాంతో విదేశాల్లోని ప్రైవేటు కాలేజీలపై నా దృష్టి మళ్లింది. సెఫ్టీ కూడా ముఖ్యమే. అందుకే ఇరాన్ను ఎంచుకున్నా,’’ అని వివరించారు.
టెహ్రాన్లోని షాహిద్ బెహెష్టి యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో థర్డ్ ఇయర్ చదువుతోంది ఫర్వా జైనాబ్. సోబియాలాగే ఇండియాకు తిరిగొచ్చిన ఆమె ఏమన్నారంటే..
"ఇరాన్లో ఎలాంటి ఎంట్రెన్స్ పరీక్ష లేకుండానే గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీల్లో సీటు పొందవచ్చు. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కూడా బాగున్నాయి. NEET PG, ఇతర ప్రవేశ పరీక్షలకు కూడా మమ్మల్ని ప్రిపేర్ చేస్తారు. అయితే కోర్సు పూర్తిచేయడానికి ఇండియాలో కంటే ఎక్కువ సమయం పడుతుంది. దాదాపు ఆరేళ్ల పడుతుంది." అని చెప్పారు.
"ఇప్పుడు పరీక్షల సమయం. యుద్ధం జరగకపోయి ఉంటే ఆగస్టు, సెప్టెంబర్లో ఇండియాకు తిరిగి వచ్చేవాళ్లం. యుద్ధం వల్ల కాలేజీకి సెలవులు ఇచ్చారు. ఎప్పుడు రావాలన్న దానిపై సమాచారం ఇస్తామని కాలేజీ వాళ్లు మాకు చెప్పారు,’’ అని సోబియా పేర్కొన్నారు.
ఇండియాలో నో చాన్స్..
ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలోనూ భారత విద్యార్థులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులకు స్వదేశంలో వైద్యవిద్యను పూర్తిచేసేందుకు అవకాశం ఇవ్వలేదు. అయితే నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) వన్ టైమ్ "అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్" ఆఫర్ చేసింది. దీని ద్వారా విదేశాల్లోని ఇతర విశ్వవిద్యాలయాలకు వలస వెళ్ళడానికి వీలు కల్పించింది.
అయోమయంలో విద్యార్థులు..
యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగివచ్చిన వైద్య విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అక్కడి విశ్వవిద్యాలయాలు విద్యార్థులతో టచ్లో ఉన్నాయి. కోర్సు పూర్తి చేయిస్తామని భరోసా ఇస్తున్నాయి. కాని అక్కడి విద్యా శాఖ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
ఇండియాకు తిరిగివచ్చిన మరో వైద్య విద్యార్థిని జరా అనిమ్ మాట్లాడుతూ.. ‘‘విశ్వవిద్యాలయ సిబ్బంది నాతో టచ్లో ఉన్నారు. ప్రస్తుతానికి పరీక్షలు వాయిదాపడ్డాయని చెప్పారు. పరీక్షల రీషెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాం. ఎలాగూ ఒకటి రెండు మాసాల తర్వాత మాకు సెమిస్టర్ సెలవులు వచ్చేవి," అని పేర్కొన్నారు.
ఇక్కడ పరీక్ష తప్పనిసరి..
విదేశాల్లో కోర్సు పూర్తి చేసినా..ఇండియాకు తిరిగొచ్చాక నేరుగా ప్రాక్టిస్ పెట్టుకోడానికి వీల్లేదు. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో పాసయితేనే ప్రాక్టీస్ పెట్టుకునేందుకు అనుమతిస్తారు. ఈ పరీక్షకు దాదాపు 35వేల నుంచి 40 వేల మంది పరీక్షకు హాజరవుతారు. వీరిలో 30 శాతం మంది మాత్రమే అర్హత సాధిస్తారు.
ఇరాన్కు వెళ్లడానికి మరో కారణం కూడా ఉంది. అక్కడి కోర్సు సిలబస్ దాదాపు ఇండియా సిలబస్ను పోలి ఉంటుంది. కాలవ్యవధి ఎక్కువయినా సిలబస్ మాత్రం ఒకేలా ఉంటుందని ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (జమ్మూ & కాశ్మీర్) వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మొహమ్మద్ మోమిన్ ఖాన్ చెప్పారు.