నెతన్యాహూ నిర్దేశించుకున్న ఆ రెండు లక్ష్యాలు ఏమిటీ?

రెండు వారాల పాటు దాడులు చేస్తామన్న ఇజ్రాయెల్ ప్రధాని;

Update: 2025-06-16 10:56 GMT
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ

ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి కనీసం రెండువారాల పాటు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఆయన మాటలు కచ్చితంగా రావడం వెనక అనేక ఏళ్ల పాటు సేకరించిన నిఘా సమాచారం ఉందని చెప్పవచ్చు.

మొదటగా ఆ దేశ రక్షణ సంస్థలు ఇరానియన్ సైనిక, అణు శాస్త్రవేత్తలను అంతమొందించడంలో దృష్టి పెట్టాయి. అలాగే ఇరాన్ కు చెందిన అన్ని వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి.
ఈ దాడుల అనంతరం ఇరాన్ కు చెందిన గగనతలాన్ని ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఐడీఎఫ్ దాడులు చేయడానికి అవకాశం లభించినట్లు అయింది.
తాము అనుకున్న అన్ని లక్ష్యాలను ఇంధనం నింపుకుని మరీ దాడులు చేసే అవకాశం దానికి చిక్కింది. ఇప్పటికే లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసింది.
నెతన్యాహూ తన ప్రసంగంలో రెండు కీలక లక్ష్యాలను హైలైట్ చేశారు. మొదటగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయడం, ఇరాన్ ప్రజలు మతాధికారుల పాలనను పడగొట్టేలా ప్రొత్సహించడం.
చర్చలకు రావాల్సిందే..
2015 లో ఒబామా పరిపాలనలో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ దీనిని తరువాత ట్రంప్ రద్దు చేశారు. ఇప్పుడు మరోసారి ఇంకా కఠిన ఆంక్షలతో కూడిన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని పట్టుబడుతున్నారు. చర్చల కోసం అమెరికా ప్రత్యేకంగా స్టీవ్ విట్ కాఫ్ ను రాయబారిగా పంపింది. ఆయనతో చర్చించడానికి ఇరాన్ రావాల్సి ఉంది.
ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందం విషయంలో నెతన్యాహూ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బాంబు దాడుల తరువాత ఇరాన్ చర్చలకు అంగీకరించిన అది ఆయన సర్కార్ కు ఇబ్బందికరమే అవుతుంది.
2023 అక్టోబర్ 7 నాటి పాశవిక దాడుల తరువాత హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తోంది. దాదాపు ఈ ఉగ్రవాద సంస్థను తుడిచిపెట్టేసినంత పనిచేసిన ఐడీఎఫ్ తాజాగా దానికి అండగా ఉన్న ఇరాన్ ను కూడా శిక్షించాలని భావిస్తున్నారు.
మరో వైపు ట్రంప్ ఇరాన్ పై ఒత్తిడి కొనసాగిస్తున్నారు. కొత్త అణు ఒప్పందం తమతో చేసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
నాశనమైన ఇరాన్ అణు కార్యక్రమం..
ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ దాదాపుగా నాశనం చేసింది. టెహ్రన్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫోర్డో యూరేనియం కేంద్రాలపై ఐడీఎఫ్ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసింది.
అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీ ప్రకారం.. ఈ కేంద్రం ఒక పర్వతం కింద అర మైలు కింద నిర్మించిన భూగర్భంలో ఉంది. ఇది యూఎస్ కు చెందిన డీప్ పెనెట్రేషన్ బాంబులకు కూడా ఛేదించలేనంత లోతులో ఉన్నాయి.
ప్రస్తుతం దీని ప్రవేశ ద్వారాల దగ్గర ఇజ్రాయెల్ దాడులు చేసింది. కానీ ఇది పూర్తి స్థాయి లో ధ్వంసం కాలేదని దాని మౌలిక సదుపాయాలు మాత్రం నాశనం అయ్యాయని వెల్లడించింది.
అయితే ఫోర్డోను పూర్తిగా నిర్మించాలని కంకణ కట్టుకున్న ఇజ్రాయెల్ దీనికి కోసం ప్రత్యేక దళాలతో ప్రణాళిక చేస్తోందని సమాచారం. ఇటువంటి దాడులు చేయడంలో ఆదేశానికి అనుభవం తెగింపు ఉంది.
అణుబాంబు తయారు చేయడంలో కీలకపాత్ర పోషించే సెంట్రీప్యూజ్ లను నాశనం చేయడం ఇందులో మొదటి అడగు అవుతుంది. వీటికి తోడు ఇరాన్ వద్ద ఉన్న 60 శాతం స్వచ్చతతో ఉన్న యూరేనియం నిల్వలను నాశనం చేయాలి లేదా అక్కడి నుంచి పూర్తిగా తరలిస్తేనే దాని లక్ష్యం నెరవేరుతుంది. ఇది పూర్తిగా ఇరాన్ దగ్గర ఉంటే దీన్ని శుద్ది చేయడం ద్వారా పది అణుబాంబులను అది పొందవచ్చు.
ఇరాన్ పాలన పతనం అవుతుందా?
ఇజ్రాయెల్ ఆ దేశ టాప్ మిలిటరీ అధికారులే లక్ష్యంగా దాడులు చేసింది. పాలనలో కీలక పాత్ర పోషించే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ నాయకులను అంతం చేసినందున్న ప్రస్తుతం ఖమేనీ పాలనలో ఉన్న ప్రభుత్వం పతనం కావచ్చు.
అక్కడ ప్రజా ప్రభుత్వాలు ఉన్నప్పటికీ పాలన మొత్తం సుప్రీం లీడర్ పేరుతో ఉన్న ఖమేనీ చేతుల్లోనే కొనసాగుతోంది. ఆయన కేవలం మతాధికారి మాత్రమే.
2022 లో ఇరానియన్ యువతి మహాసా అమిని పోలీస్ కస్టడీలో మరణించిన తరువాత అక్కడ ప్రజలు ముఖ్యంగా యువత, మహిళలు భీకర స్థాయిలో నిరసనలు చేపట్టారు. దీన్ని బట్టి ఖమేనీ చాందసవాద పాలనపై ప్రజలు ఎంత విసిగిపోయి ఉన్నారో అర్థం అవుతోంది.
1979 లో విప్లవం ద్వారా పాలన పగ్గాలు చేపట్టిన ఖమేనీ ప్రభుత్వం అనేక సవాళ్లను తట్టుకుని నిలబడింది. వాటిలో 1980 ప్రారంభంలో ఇరాక్ తో యుద్ధం మొదలయినవి ఉన్నాయి.
ఆయన పాలన అసాధారణంగా భద్రతా వ్యవస్థలను అభివృద్ది చేసింది. తరువాత వాటితో ఉక్కు చట్రం బిగించి ప్రజలను బందీలుగా చేశారు.
ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో ఇరాన్ కీలక నేతల పారిపోవడానికి సిద్దంగా ఉన్నారని ప్రధాని నెతన్యాహూ చెబుతున్న మాట. దీనికి ఆయన ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు.
అమెరికా జోక్యం ఉంటుందా?
ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా ప్రకటించింది. కానీ అది మాటల వరకే పరిమితమని అందరికి తెలుసు. ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారీ ఈ యుద్దానికి మూల కారణం అమెరికానే అని ఆరోపించారు.
పశ్చిమాసియాలో అమెరికా తన పట్టు బిగించడానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు దేశాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది.
సెనెటర్ లిండ్సే గ్రాహం వంటి సీనియర్ రిపబ్లికన్లు, ఇజ్రాయెల్ కు పూర్తి స్థాయిలో సాయం చేయడానికి అమెరికా దళాలను రంగంలోకి దింపాలని ట్రంప్ ను కోరారు. అయితే యుద్ధాలపై ఇంతకుముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయన అలాంటి ఆదేశాలు ఇవ్వడానికి ఇష్టపడకపోవచ్చు.
కానీ ఇరాన్ అనుకూల దళాలు అమెరికా బేస్ లపై దాడులు చేస్తే మాత్రం ట్రంప్ పై ఒత్తిడి పెరుగుతుంది. వైట్ హౌజ్ కూడా ఈ సైనిక ఘర్షణలు వీలైనంత తొందరగా ఆపాలని కోరుకునే అవకాశం ఉంది. ఎక్కువ కాలం యుద్ధం కొనసాగితే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో ఆ దేశానికి బాగా తెలుసు.
రష్యా జోక్యం ఉంటుందా?
ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ పై దాడులు చేస్తూ బిజీగా ఉంది. కాబట్టి అది జోక్యం చేసుకోలేదు. గత సంవత్సరం సిరియాలో రష్యా అనుకూలం అసద్ ప్రభుత్వం కుప్పకూలుతున్నప్పటికీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేకపోయింది. ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడు రష్యా విమర్శలకే పరిమితమైంది.
సౌదీ, యూఏఈ వంటి శక్తులు..
రెండు దేశాలు అమెరికాకు కీలకమిత్రులు. అమెరికా ఆయుధాలు వీటి దగ్గర ఉన్నాయి. అయితే రెండు దేశాలకు వివాదంలో చిక్కుకోవడంలో ఇష్టం లేదు. దశాబ్ధాలుగా ఇరాన్ తో వివాదాలు ఉన్నప్పటికీ ఈ మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించాయి. కాబట్టి ఇవి యుద్దంలోకి దిగే అవకాశం లేదు.
ఇరాన్ శక్తి ఏమిటీ?
ఇరాన్ క్షిపణులు, రాకెట్ల ఆయుధగారాల శక్తి ప్రపంచానికి తెలియదు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా అది ప్రయోగించిన క్షిపణులు ఐరన్ డోమ్ ను మాత్రం ఛేదించగలిగాయి. కొంతమంది యూదు పౌరులు కూడా మరణించారు.
ఇలాగే పౌరులు మరణిస్తే ఇజ్రాయెల్ పౌరులు మరోసారి వీధి పోరాటాలు చేయవచ్చు. ఇప్పటికే గాజా యుద్ధం పై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. కానీ నెతన్యాహు ఇరాన్ అణు శక్తి ని నిర్వీర్యం చేయడం పై కూడా ప్రజలు సంతోషంగానే ఉన్నారు. తమ ప్రజలు మరణిస్తే టెహ్రన్ ను బూడిద చేస్తామనే ప్రతిజ్ఞ కూడా వారికి నచ్చింది.
ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలో తనకు తలనొప్పిగా మారిన హామాస్ తో పాటు, హెజ్ బుల్లాను పూర్తిగా నాశనం చేసింది. వారు ఇప్పుడు ఇరాన్ కు మద్దతుగా దాడులు చేసే స్థితిలో లేరు.
యుద్దం తరువాత ఇరాన్ అణ్వాస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలుగుతుంది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తనిఖీలను పూర్తిగా నిషేధిస్తుంది. ఇజ్రాయెల్, ఇరాన్ అణు కేంద్రాలను నాశనం చేయగలదు కానీ తిరిగి పునరుద్దరిస్తే మరోసారి ఏం చేయగలదనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఎదురుదెబ్బ తిన్న ఇరాన్ తన అణుబాంబు కలను మరింత మొండిగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది. అదే జరిగితే ఈ ప్రాంతం మరోసారి ప్రమాదకర స్థితిలోనే ఉంటుంది.


Tags:    

Similar News