ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ కుదిరిందన్న ట్రంప్
ఇరాన్ క్షిపణ దాడితో దిగొచ్చిన అమెరికా, కాల్పుల విరమణ ప్రకటన;
By : Amaraiah Akula
Update: 2025-06-23 23:57 GMT
ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య 12 రోజులుగా సాగుతున్న యుద్ధానికి తెర దించినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోమవారం సాయంత్రం (అమెరికా కాలమానం) సంచలనాత్మక ప్రకటన చేశారు. ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య “సంపూర్ణ” కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. అయితే ఈ కాల్పుల విరమణను ఉభయదేశాలు ఇంకా ధృవీకరించలేదు. అమెరికా బాంబింగ్కు ప్రతిగా ఇరాన్- ఖతార్లోని అమెరికా సైనిక స్థావరంపై క్షిపణి దాడి చేసిన 24 గంటల్లోనే ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.
ట్రంప్ సోమవారం రాత్రి తన సోషల్ మీడియా Truth Socialలో “ఇజ్రాయిల్ , ఇరాన్ రెండు దేశాల మధ్య సంపూర్ణంగా కాల్పుల విరమణ జరిగింది. ఇప్పటి నుంచి సుమారు 6 గంటల తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటిస్తాయి. 12 గంటల పాటు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఆ సమయంలో ఈ యుద్ధాన్ని ముగిసినట్టుగా పరిగణిస్తాం” అని పేర్కొన్నారు.
ఈ కాల్పుల విరమణ వచ్చే 24 గంటల్లో విడతల వారీగా అమలులోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. “ఇరాన్ అధికారికంగా మొదట కాల్పుల విరమణను పాటిస్తుంది. 12 గంటల తర్వాత ఇజ్రాయిల్ కాల్పుల విరమణ పాటిస్తుంది.
ట్రంప్ తన సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్ ఇదే
24 గంటల అనంతరం 12 రోజుల యుద్ధానికి అధికారిక ముగింపు పలికినట్టవుతుంది. కాల్పుల విరమణ సమయంలో ఇరు పక్షాలు శాంతియుతంగా, గౌరవ ప్రదంగా వ్యవహరిస్తాయి” అని ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.
వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఏమన్నారంటే...
ట్రంప్ ప్రకటన అనంతరం, ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ఒప్పందాన్ని ‘పరిష్కారం చూపిన’ విజయంగా అభివర్ణించారు. “ ఈ ఒప్పందానికి ముందు వైట్ హౌస్లో మేము దీనిపై ముమ్మర కసరత్తు చేశాం. అధ్యక్షుడు దీన్ని సమర్థవంతంగా ముగించారు” అని చెప్పారు.
వాన్స్ చెప్పిన దాని ప్రకారం, ట్రంప్ తన పోస్ట్ను ప్రసారం చేయడానికి రెండు నిమిషాల ముందు చదవి వినిపించారని, అయితే ఆ తర్వాత వచ్చిన దాన్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయన్నారు. “ప్రెసిడెంట్ కొద్దిసేపటి కిందట చదివిన దానికంటే కొంచెం భిన్నంగా ఉంది. కానీ ఆయనే స్వయంగా ఫోన్లు చేయడం కొనసాగిస్తున్నారు,” అన్నారు.
“ఇరాన్ వద్ద ఇప్పుడు అణ్వాయుధాలను తయారు చేసే సామర్థ్యం లేదు, ఎందుకంటే వాటిని మేము ధ్వంసం చేశాం” అని ఆయన చెప్పారు.
ఇరాన్, ఇజ్రాయిల్ స్పందన లేదు...
ట్రంప్ ప్రకటనపై ఇరాన్, ఇజ్రాయిల్ ఇంకా స్పందించలేదు. ఆయన ప్రకటనను ధృవీకరించలేదు. ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహూ కార్యాలయం నుంచి గానీ ఇరాన్ ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ట్రంప్ చెప్పిన దాని ప్రకారం - ఈ కాల్పుల విరమణ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది.
దాడుల పర్యవసానం
ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ చేసిన క్షిపణి దాడి అమెరికాకు ముందస్తు హెచ్చరికగానే ట్రంప్ భావించినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం లేదని, “ఇది బలహీన ప్రతిస్పందన మాత్రమే” అని ట్రంప్ అభివర్ణించారు.
ఖతార్లోని అల ఉదెయిద్ ఎయిర్ బేస్పై జరిగిన దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. గగనతల, అంతర్జాతీయ చట్టాలను ఇరాన్ ఉల్లంఘించిందని పేర్కొంది. 19 క్షిపణులను ఇరాన్ ప్రయోగించిందని ఖతార్ జనరల్ షాయెక్ అల్ హజ్రీ వెల్లడించగా, ట్రంప్ మాత్రం 14 క్షిపణులేనని అన్నారు. వాటిలో 13 గుర్తించామని, ఒక్కటి మాత్రం టార్గెట్ ను తాకిందని అన్నారు.
అమాయకులపై దాడి చేయలేదన్న ఇరాన్..
ఈ దాడిపై ఇరాన్ అధికార టీవీ వ్యాఖ్యానిస్తూ “అమెరికా దాడికి శక్తివంతమైన ప్రతిస్పందన”గా పేర్కొంది. “మేము యుద్ధాన్ని ప్రారంభించలేదు, కానీ మా దేశంపై దాడికి కచ్చితమైన బదులు ఇస్తాం,” అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ X (ట్విట్టర్)లో పేర్కొన్నారు.
ఇరాక్ ఘటనపై స్పష్టత..
ఇదిలాఉంటే, ఇరాక్లో అమెరికా బేస్పై క్షిపణి దాడి జరిగిందన్న వార్తలు వచ్చాయి. ఇరాన్ నుంచి ఇజ్రాయిల్ వైపు వదిలిన ఓ క్షిపణి అడ్డదిడ్డంగా వెళ్లి కుప్పకూలినట్టు భావిస్తున్నారు. ఇరాక్లోని అమెరికా బేస్పై క్షిపణి దాడి జరిగిందన్న వార్తలపై ఒక సీనియర్ అమెరికా అధికారి స్పష్టత ఇచ్చారు. ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు పంపిన ఓ క్షిపణి శకలాల వల్ల అలారమ్ మోగిందని చెప్పారు.