ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్తు

ఇరాన్ నుంచి ఇండియాకు చేరుకున్న భారత్‌ విద్యార్థులు..;

Update: 2025-06-24 08:16 GMT

ఇరాన్‌-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం.. భారతీయ విద్యార్థుల(Indian Students) భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఉన్న ఫలంగా దేశం వీడాలని కోరడంతో వారంతా స్వదేశానికి తిరిగొచ్చారు. ఇండియన్ ఎంబసీ భారత విద్యార్థులను ఇరాన్ నుంచి తొలుత కోమ్‌కు తరలించి అక్కడి నుంచి మషద్ మీదుగా ఇండియాకు తీసుకొచ్చింది. ఇలా భారత్‌కు సురక్షితంగా చేరుకున్న విద్యార్థుల్లో వైద్య విద్య చదువుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. ఇరాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (IUMS)లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు తమ భయానక అనుభవాలను గుర్తుచేసుకున్నారు.

2023 లెక్కల ప్రకారం దాదాపు 1700 మంది భారతీయ విద్యార్థులు ఇరాన్‌లో చదువుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది మెడిసిన్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న వారు కూడా ఉన్నారు.

‘‘రెండు రోజుల్లో తిరిగివస్తామనుకున్నాం’’

IUMSలో లతీఫ్ MBBS ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. యుద్ధ వాతావరణాన్ని ది ఫెడరల్‌తో పంచుకున్నారు. "యుద్ధం కారణంగా పేలుళ్ల శబ్దానికి రాత్రిళ్లు సరిగా నిద్రపట్టేది కాదు. ఉన్నట్టుండి మా దగ్గర ఉన్నవన్నీ ప్యాక్ చేసుకుని మరో చోటికి వెళ్లాలని మాకు చెప్పారు. వారు చెప్పినట్లుగానే చేశాం. రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తామని అనుకున్నాం. మా వెంట పాఠ్యపుస్తకాలు కూడా తీసుకెళ్లలేదు.మేం ఫైనల్ ఇయర్‌ స్టూడెంట్లం. క్లాసులు, హాస్పిటల్‌కు హాజరుకాకుండా మమ్మల్ని తీసుకొచ్చేశారు. కోమ్ చేరుకున్న తర్వాత మాకు వైద్య పరీక్షలు చేశారు. హోటళ్లలో వసతి కల్పించారు. ఈ కోర్సు కోసం ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు చేశాం. భారత ప్రభుత్వం మా పరిస్థితిని అర్థం చేసుకుని ఏదైనా చేస్తే బాగుంటుంది, ”అని చెప్పారు.

‘‘పారిపోడానికి సిద్ధమయ్యాం..’’

లతీఫ్ లాగే బెనిష్ ఫాతిమా కూడా IUMSలో MBBS చివరి సంవత్సరం చదువుతోంది. కోర్సులో భాగంగా ఆమె రెండు వారాల క్రితం వరకు వివిధ ఆసుపత్రుల్లో రొటేషన్ పద్ధతిలో విధులు నిర్వహించారు. చివరిగా షాఫా యాహ్యాయియన్ హాస్పిటల్ డ్యూటీ చేశారు. ఆసుపత్రి పక్కనే ఉన్న ప్రభుత్వ భవనంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో బిల్లింగ్ బాగా దెబ్బతిని శిథిలావస్థకు చేరుకుందని ఆమె చెప్పారు.

"భారీ పేలుళ్ల శబ్దాలు వింటూనూ కుణుకు తీసేవాళ్లం. రాత్రిళ్లు మాత్రమే జరిగే దాడులు.. కొన్ని రోజులకు పగటిపూట కూడా జరగడం ప్రారంభించాయి. మేమంతా భయపడ్డాం. పారిపోవడానికి సిద్ధమయ్యాం. చివరికి భారత రాయబార కార్యాలయం చొరవతో కోమ్‌కు అక్కడి నుంచి మషద్ ద్వారా భారత్‌కు తిరిగివచ్చాం. వాస్తవానికి ఇరాన్ చాలా ప్రశాంత దేశం. ఇలాంటిది జరుగుతాయని మేము ఎప్పుడూ ఊహించలేదు,” అని ఫాతిమా పేర్కొన్నారు.

ఫాతిమా తన భవిష్యత్తు గురించి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ.. "వచ్చే శనివారానికల్లా ఇరాన్‌కు తిరిగివచ్చి డ్యూటీకి హాజరుకావాలని యూనివర్సిటీ మమ్మల్ని కోరింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మేం అక్కడకు వెళ్లలేం. వచ్చే రెండు వారాల పాటు నేను అస్సలు అక్కడికి వెళ్లదలుచుకోలేదు. వెళ్తే మాత్రం వారు మమ్మల్ని డబుల్ షిఫ్ట్‌లు చేయమని బలవంతం చేస్తారు, ”అని శ్రీనగర్ నివాసి ఫాతిమా పేర్కొన్నారు.

చదువు ఎలా పూర్తి చేసేది?

బారాముల్లా జిల్లాలోని పట్టన్‌కు చెందిన షకీరా మంజూర్ ఫాతిమా క్లాస్‌మేట్. ‘‘ఇరాన్ నుంచి మమ్మల్ని సురక్షితంగా తరలించారు. అయితే మా విశ్వవిద్యాలయం నుంచి మాకు ఎటువంటి సమాచారం లేదు. ఇండియాకు తీసుకొచ్చారు. ఇప్పుడు మా చదువు ఎలా పూర్తి చేయాలో ఆందోళనగా ఉంది’’ అని చెప్పారు.

‘‘సర్వీసు రద్దు కావడంతో ఉండిపోయా..’’

టెహ్రాన్‌లోని ఉర్మియా యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో నాల్గో సంవత్సరం చదువుతున్న MBBS విద్యార్థి ఉమర్ బషీర్ మీర్.. జూన్ 13న టెహ్రాన్ నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణించాల్సి ఉంది. కానీ యుద్ధం కారణంగా ఆ విమాన సర్వీసు రద్దు కావడంతో అక్కడే ఉండిపోయారు. ‘‘అన్ని పరీక్షలకు హాజరయ్యాను. కానీ నా క్లాస్‌మేట్స్, సీనియర్లు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. వాటిని భారత ప్రభుత్వం ఏదైనా చేస్తే బాగుంటుంది" అని చెప్పారు ఉమర్ బషీర్.

Tags:    

Similar News