సంతకానికి నిరాకరించిన రాజ్‌నాథ్ సింగ్

షాంఘై సహకార సంస్థ సదస్సులో భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి..;

Update: 2025-06-26 08:54 GMT

26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్(Pahalgam) ఉగ్రవాద దాడి గురించి షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రస్తావించకపోవడం, ఉగ్రవాదంపై భారత్ బలమైన వైఖరిని ప్రతిబింబిచని కారణంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాయింట్‌ డాక్యుమెంట్‌పై సంతకం చేయడానికి నిరాకరించారు. చైనాలోని క్వింగ్డావోలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వస్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో భారత్‌, చైనా, పాకిస్థాన్‌తో పాటు 10 సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. సదస్సులో పహల్గాం ఉగ్రదాడి, సీమాంతర ఉగ్రవాదం గురించి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రసంగం చేశారు.

కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా వాడుకుంటున్నాయని పరోక్షంగా పాకిస్థాన్‌ను దుయ్యబట్టారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. సదస్సు అనంతరం తయారైన జాయింట్‌ డాక్యుమెంట్‌లో ఉగ్రవాదంపై భారత వైఖరిని సుస్పష్టంగా కనపర్చకపోవడంతో అందులో సంతకం చేసేందుకు రాజ్‌నాథ్ విముఖత చూపారు. పహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ రక్షణమంత్రులు ఎదురుపడటం ఇదే తొలిసారి. 2020లో గల్వార్‌ ఘర్షణ తర్వాత నుంచి భారత రక్షణ మంత్రి చైనాలో పర్యటించడం ఇదే ప్రథమం. షాంఘై సహకార సంస్థలో బెలారస్‌, చైనా, భారత్‌, ఇరాన్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, పాకిస్థాన్‌, రష్యా, తజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. 

Tags:    

Similar News