పాక్ కు ఏడీబీ రుణంపై భారత్ అభ్యంతరం
నిధులు ఇవ్వడం వలన బ్యాంకు నష్టమే తప్ప లాభం లేదన్న న్యూఢిల్లీ;
By : Praveen Chepyala
Update: 2025-06-04 14:06 GMT
పాకిస్తాన్ కు 800 మిలియన్ డాలర్ల రుణం అందించాలన్న ఆసియా అభివృద్ది బ్యాంకు(ఏడీబీ) నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇస్లామాబాద్ పెరిగిన సైనిక వ్యయాన్ని దేశీయ వనరుల నుంచి సేకరించడం కష్టంగా మారిందని న్యూఢిల్లీ వాదించినట్లు సమాచారం. ఇప్పుడు ఏడీబీ అందించే రుణం కూడా దుర్వినియోగం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
పాకిస్తాన్ చాలాకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. ఐఎంఎఫ్ దగ్గరకు అనేకసార్లు బెయిల్ అవుట్ ప్యాకేజ్ కోసం చేతులు చాచి సాయం తీసుకుంది.
తాజాగా ఏడీబీ కూడా ఇదే తరహాలో దాని ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి, ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను మెరుగుపరచడానికి 800 మిలియన్ డాలర్ల కార్యక్రమాన్ని మంగళవారం ఆమోదించింది.
నిధుల దుర్వినియోగం..
పాకిస్తాన్ కు అందించే నిధులు దుర్వినియోగం కాకుండా బ్యాంకు యాజమాన్యం చూసుకోవాలని భారత్, ఏడీబీకి సూచించిందని మీడియా సంస్థలు నివేదించాయి.
‘‘పాకిస్తాన్ రక్షణ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో, పన్ను- జీడీపీ నిష్పత్తి తగ్గుతుండటం, కీలకమైన స్థూల ఆర్థిక సంస్కరణలపై స్పష్టమైన పురోగతి లేకపోవడంతో ఏడీబీ ఇచ్చే నిధులు దుర్వినియోగం అవుతుందని భారత్ తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసింది’’ అని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా సంస్థలు వార్తా కథనాలు ప్రసారం చేశాయి.
సరైన ట్రాక్ రికార్డు లేదు..
పాకిస్తాన్ కు ఆర్థిక వ్యవహరాల్లో మంచి ట్రాక్ రికార్డు లేదు. ఆర్థిక విషయాల్లో ప్రభుత్వ జోక్యం కంటే పాక్ సైన్యం ఎక్కువగా కలుగజేసుకోవడమే దీనికి ప్రధాన కారణం.
గతంలో లాగా విధానపరమైన జాప్యాలు, సంస్కరణలను తిప్పికొట్టే ప్రమాదం ఉందని భారత్ చెబుతోంది. పాకిస్తాన్ లో పేరుకు పౌర ప్రభుత్వాలు ఉన్న, సైన్యమే అన్నింటిలో పెత్తనం చేస్తుంది. రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషిస్తూనే ఉంది. ఆర్థిక వ్యవస్థలో చాలాలోతుగా దాని వేర్లు పాతుకుపోయాయి.
ఏడీబీకి క్రెడిట్ రిస్క్..
పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాద విధానం ఈ ప్రాంతంలో తీవ్ర భద్రతాపరమైన సమస్యలను లేవనెత్తుతోంది. అలాగే ఆ దేశపు స్థూల ఆర్థిక నష్టాలను గణనీయంగా పెంచిందని, ఇది ఏడీబీకి వ్యాపార నష్టాలను కూడా పెంచుతుందని భారత్ దానికి తెలియజేసింది.
రుణాలు తీసుకుంటున్న దేశం(పాకిస్తాన్) ఆర్థికంగా దివాలా తీసింది. ఇప్పుడు ఇచ్చే రుణం కూడా ఏడీబీకి నష్టమే తప్ప లాభం లేదని వాదించినట్లు సమాచారం.
నేపథ్యం..
పాకిస్తాన్ ఆర్థిక మంత్రి సలహదారు ఖుర్రం షెహజాద్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ. ఈ ప్యాకేజీలో 300 మిలియన్ డాలర్లు పాలసీ ఆధారిత రుణంగా, 500 మిలియన్ డాలర్లు ప్రోగ్రామ్ ఆధారిత హమీ గా ఇస్తున్నారని చెప్పారు.
‘‘వనరుల సమీకరణ సంస్కరణ కార్యక్రమం కింద పాకిస్తాన్ కు ఏడీబీ 800 మిలియన్ల ఫైనాన్సింగ్ ప్యాకేజీని ఆమోదించింది’’ అని ఆయన అన్నారు.
అంతకుముందు పాకిస్తాన్ కు అంతర్జాతీయ ద్రవ్యనిధి తన తాజా బెయిల్ అవుట్ ను ఆమోదించాలనే నిర్ణయాన్ని కూడా భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. పాకిస్తాన్ కు అదనపు నిధులు అందించడం ఆపాలని భారత్ ఐఎంఎఫ్ ను కోరినట్లు, ఉగ్రవాద దేశాన్ని గ్రే లిస్ట్ లో చేర్చాలని కూడా ఏఫ్ఏటీఎఫ్ కు విన్నపం చేయాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం.