‘ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు’
ఉగ్రవాదులను అప్పగించాలంటున్న ఇజ్రాయెల్ భారత రాయబారి జె.పి. సింగ్..;
భారత్ చేపట్టిన ‘‘ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)’’కు స్వల్ప విరామం ఇచ్చామని, పూర్తిగా నిలిపేయలేదని చెప్పారు ఇజ్రాయెల్లోని భారత రాయబారి జెపి సింగ్. ఇజ్రాయెల్ టీవీ i24 కి సోమవారం (మే 19)వ తేదీన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు. పహెల్గామ్(Pahalgam) ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. మతం పేరు అడిగి 26 మంది పర్యాటకులను కాల్చిచంపడం దుర్మర్గమని పేర్కొన్నారు. ప్రతిచర్యగా పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేసిందని చెప్పారు. అందుకు బదులుగా పాక్ భారత సైనిక స్థావరాలపై దాడికి పాల్పడిందన్నారు. పాకిస్తాన్లోని నూర్ ఖాన్ స్థావరంపై మే 10న భారత్ జరిపిన దాడిని "గేమ్ ఛేంజర్"గా అభివర్ణించారు. ఈ దాడితో ఇస్లామాబాద్లో భయం కమ్మేసిందని, ఈ ఘటన తర్వాత కాల్పుల విరమణకు పాక్ దిగొచ్చిందని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.
ఉగ్రవాదులను అప్పగించండి..
26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో కీలక నిందితుడైన తహవూర్ హుస్సేన్ (Hafiz Saeed) రాణాను అమెరికా అప్పగించినట్లుగానే.. కీలక ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, సాజిద్ మీర్, జకీర్ రెహ్మాన్ లఖ్వీని అప్పగించాలని సింగ్ ఇస్లామాబాద్ను కోరారు. 2008 ముంబై దాడులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న లష్కరే తోయిబా(Lashker-e-Taiba) ఉగ్రవాద సంస్థ (LeT) చీఫ్ హఫీజ్ సయీద్, మీర్ లఖ్వీలను అప్పగించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. ముంబై దాడుల వెనుక ఉన్న నిందితులపై పాక్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోవడంతో వారంతా యథేచ్ఛగా తిరుగుతున్నారని పేర్కొన్నారు.
పహల్గామ్ దాడిపై దర్యాప్తునకు పాక్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను సింగ్ తోసిపుచ్చారు. ఇప్పుడు స్పందించినట్లుగా.. ముంబై, పఠాన్కోట్ ఫుల్వామా దాడులపై పాకిస్తాన్ గతంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
సమన్వయంతో పోరాడాలి..
ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న దేశాల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్న సింగ్.. భారత్, ఇజ్రాయెల్ దేశాలు ఉగ్రవాదం, దాని మద్దతుదారులకు వ్యతిరేకంగా పోరాడానికి సిద్ధం కావాలని కోరారు.