‘‘ఉగ్రవాద సంస్థలు నిర్మూలించి, మైనారిటీలను రక్షించండి’’
పాక్ ప్రతినిధి బృందానికి స్పష్టం చేసిన అమెరికా చట్టసభల సభ్యుడు;
By : Praveen Chepyala
Update: 2025-06-07 13:19 GMT
పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని ఓ నానుడి. ఈ సామెత పాకిస్తాన్ కు బాగా సరిపోతుంది. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్తాన్ ఎగదోస్తున్న ఉగ్రవాదాన్ని ప్రపంచానికి వివరించడానికి భారత్ ఏడు ప్రతినిధి బృందాలను నియమించిన సంగతి తెలిసిందే.
మన దేశాన్ని చూసి ఇదే తరహ ప్రయత్నం చేసిన పాకిస్తాన్ కు ఎక్కడా సరైన ఆదరణ దక్కట్లేదు. తాజాగా అమెరికాలో ఆ దేశానికి తీవ్ర అవమానం ఎదురైంది.
బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాక్ బృందం వాషింగ్టన్ లోని పర్యటిస్తోంది. ఈ సందర్భంగా అమెరికా చట్టసభల సభ్యుడు బ్రాడ్ షెర్మాన్ ‘‘ దుష్ట శక్తుల సమూహం అయిన జైష్ ఏ మహ్మద్’’ ను ముందు నిర్మూలించండని పాక్ కు తలంటాడు. అమెరికా పౌరులను చంపిన ఉగ్రవాద సంస్థలను వెనకేకు రావడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
పాక్ తన శక్తి మేరకు పనిచేయాలి..
నిన్న జరిగిన సమావేశంలో వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ డేనియల్ పెర్ల్ హత్యకు ఉగ్రవాద సంస్థ కారణమని పేర్కొంటూ షెర్మాన్ తన విషయాన్ని ముందుకు తెచ్చాడు. వీరు ఒకే జిల్లాలో నివసిస్తున్నారు.
‘‘పాకిస్తాన్ ప్రతినిధి బృందానికి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రాముఖ్యతను ఇవ్వాలని నేను గట్టిగానే చెప్తున్నాను. ముఖ్యంగా 2002 లో నా నియోజకవర్గం లో నివసించే జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ ను హత్య చేసిన జైష్ ఏ మొహమ్మద్ గ్రూప్ ను నిర్మూలించాలి.
పెర్ల్ కుటుంబం మా జిల్లాలో నివసిస్తూనే ఉంది. ఈ దుష్ట సమూహాన్ని నిర్మూలించడానికి ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి పాకిస్తాన్ తన వంతు కృషి చేయాలి’’ అని షెర్మాన్ ఎక్స్ లో పేర్కొన్నారు.
మైనారిటీలను రక్షించండి..
పాక్ లో నివసిస్తున్న మతపరమైన మైనారిటీ బృందానికి రక్షణ కల్పించాలని, వారిపై హింస జరగకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలో పాల్గొనవచ్చని చెప్పారు.
పాకిస్తాన్ లోని మతపరమైన మైనారిటీల రక్షణను ముఖ్యమైన సమస్యగా పేర్కొంటూ షెర్మాన్ ఇలా అన్నారు. ‘‘పాకిస్తాన్ లో నివసిస్తున్న క్రైస్తవులు, హిందువులు, అహ్మదీయ ముస్లింలు హింస, వివక్ష లేదా అసమాన న్యాయ వ్యవస్థకు భయపడకుండా తమ విశ్వాసాన్ని ఆచరించడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థలో పాల్గొనడానికి అనుమతించబడాలి’’ అని ట్వీట్ లో రాసుకొచ్చారు.
షకీల్ ఆఫ్రిదిని విడుదల చేయండి..
ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చడంలో అమెరికా సీల్స్ కమాండోలకు సహాయం చేసినందుకు 33 సంవత్సరాల జైలు శిక్ష పడిన డాక్టర్ షకీల్ అఫ్రిదీని విడుదల చేయాల్సిన అవసరాన్ని తమ ప్రభుత్వానికి తెలియజేయాలని అనుకుంటున్నాను.
డాక్టర్ అఫ్రిదిని విడుదల చేయడం 9/11 బాధితులకు న్యాయం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగు’’ అని షెర్మాన్ పేర్కొన్నారు.
పాకిస్తాన్ వైద్యుడు అయిన అఫ్రిది, బిన్ లాడెన్ కుటుంబ సభ్యుల డీఎన్ఏ నమూనాలను సేకరించడానికి ఖైబర్ ఫక్తూన్ ఖ్వా ప్రావిన్స్ లోని పోలియో టీకా కార్యక్రమం నిర్వహించడంలో సీఐఏకి సాయం చేశాడు.
మే 2011 లో అబోటాబాద్ లోని బిన్ లాడెన్ ఇంటిపై అమెరికా దాడి చేసిన కొద్దిసేపటికే పాకిస్తాన్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కోర్టు అతడికి 33 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
సింధు జలాల సమస్య..
పహల్గామ్ దాడి తరువాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. పాకిస్తాన్ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
‘‘ఈ ప్రాంతంలో నీటిని నిలుపదల చేయడానికి పాకిస్తాన్ పై భారత్ ఎటువంటి చర్యలు తీసుకోకూడదు. పాకిస్తాన్ లో పంజాబ్, సింధ్ గుండా ప్రవహించే నీటిపై లక్షలాది మంది ప్రజలు జీవిస్తున్నారు. వారికి నీరు అందుబాటులో ఉండాలి’’ అని షెర్మాన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
నేపథ్యం ఏంటంటే..
పాకిస్తాన్ ప్రతినిధి బృందం అమెరికా రాజధాని వాషింగ్టన్ లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని భారత పార్లమెంటేరియన్లు బృందానికి పోటీగా ఈ బృందాన్ని ఇస్లామాబాద్ ఎంపిక చేసి పంపింది.
ఈ పర్యటనలో భుట్టో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేర్రెస్ ను తన ప్రతినిధి బృందంతో కలిశారు. కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయికరణ చేసి లాభం పొందాలనే లక్ష్యంతో పాక్ పన్నాగాలు పన్నింది. భారత్ మాత్రం ఆపరేషన్ సిందూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందనే అంశంపై ప్రపంచానికి వివరిస్తోంది.