మళ్లీ మొదటికొచ్చిన ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం
ఇజ్రాయెల్ పైకి క్షిపణులు ప్రయోగించిన ఇరాన్, పదుల సంఖ్యలో యూదులు మృతి, ఎదురుదాడి చేయాలని ఐడీఎఫ్ కు ఆదేశాలు జారీ చేసిన టెల్ అవీవ్;
By : Praveen Chepyala
Update: 2025-06-24 12:01 GMT
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన 12 గంటలైన కాలేదు, మరోసారి ఇరాన్- ఇజ్రాయెల్ పైకి క్షిపణులు ప్రయోగించింది.
దీనితో రెండు దేశాల మధ్య మరోసారి సాయుధ ఘర్షణ ప్రారంభం అయింది. తమపైకి ఇరాన్ కాలుదువ్వడంతో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పందించారు. టెహ్రాన్ పైకి దాడి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
ఇజ్రాయెల్ పైకి తాము ఎలాంటి క్షిపణలు ప్రయోగించలేదని ఇరాన్ తెలిపింది. కానీ ఉదయం ఉత్తర ఇజ్రాయెల్ వ్యాప్తంగా పలు మిస్సైల్లు దూసుకువచ్చాయి. దీనితో దేశ వ్యాప్తంగా సైరన్లు, పేలుడు శబ్దాలతో హోరెత్తాయి.
ఇరు దేశాల మధ్య 12 రోజులుగా జరుగుతున్న యుద్ధంపై కాల్పుల విరమణ జరపడానికి అంగీకరించాయి. కానీ అంతలోనే మాట తప్పాయి.
‘‘ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. ఇజ్రాయెల్ వైపు కాల్పుల క్షిపణులు ప్రయోగించింది. ఒప్పందం ఉల్లంఘన నేపథ్యంలో ప్రభుత్వ విధానానికి అనుగుణంగా టెహ్రాన్ లోని ప్రభుత్వ ఆస్తులు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని నేను ఆదేశించాను’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ర్ రాయిటర్స్ కు తెలిపారు.
ఈ రోజు ఉదయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. 12 రోజుల యుద్దం తరువాత ఇందుకు రెండు దేశాలు అంగీకరించాయని చెప్పారు.
మొదట ఇరాన్ ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించింది. అలాంటి ఒప్పందం ఏమి కుదరలేదని తెలిపింది. ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము ఆపుతామంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి మాట్లాడుతూ.. ‘‘చివరి నిమిషం వరకూ ఇజ్రాయెల్ ను శిక్షించాం’’ అని ప్రకటించారు. అందుకు తమ సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలిపుతూ కాల్పుల విరమణ కోసం సంకేతాలు ఇచ్చారు.
కాల్పుల విరమణ ప్రణాళిక..
ఖతార్ లోని యూఎస్ సైనిక స్థావరంపై టెహ్రన్ క్షిపణులు ప్రయోగించింది. ఇది దావానంలా వ్యాపిస్తుందని అంతా భయపడుతున్న వేళ ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ ప్రకటన చేశారు. దీనికి ఇరు దేశాలు అంగీకరించాయని చెప్పారు.
ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కూడా అంగీకరించారు. ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక ప్రకారం.. ఇరాన్ పై ఇజ్రాయెల్ తన లక్ష్యాలను సాధించిందని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘అణు, బాలిస్టిక్ క్షిపణి క్షేత్రాల ముప్పును ఇజ్రాయెల్ తొలగించింది’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. ఐడీఎఫ్ టెహ్రన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించింది. సైనిక నాయకత్వానికి తీవ్ర నష్టం కలిగించింది. డజన్ల కొద్ది ఇరాన్ కీలక ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిందని నెతన్యాహూ ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.