అంతరిక్షంలోకి శుభాన్షు శుక్లా..

40 ఏళ్ల అనంతరం నింగిలోకి భారత్‌కు చెందిన మరో వ్యోమగామి..;

Update: 2025-06-25 07:45 GMT

భారత్ మరో రికార్డు సాధించింది. నాలుగు దశాబ్దాల తర్వాత అంతరిక్షంలోకి భారత్‌కు చెందిన మరో వ్యోమగామి శుభాన్షు శుక్లా(Indian astronaut).. ముగ్గురితో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) బయలుదేరారు. 1984లో సోవియట్‌ యూనియన్‌కు చెందిన ఇంటర్‌కాస్మోస్‌ కార్యక్రమం కింద సోయుజ్‌ టి-11 వ్యోమనౌకలో రాకేశ్‌శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.

ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చేపట్టిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. కొద్ది క్షణాల తర్వాత రాకెట్‌ నుంచి వీరి క్యాప్సుల్‌ విడిపోయి ఐఎస్‌ఎస్‌ దిశగా ప్రయాణం కొనసాగించింది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదాపడుతూ వస్తోంది. నేడు కూడా ఈ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా.. శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయడంతో అంతా సవ్యంగా జరిగింది. వీరు 28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) చేరుకుంటారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) వీరి వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం అవుతుంది. ఐఎస్‌ఎస్‌లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. నాసా సహకారంతో శుక్లా ఐఎస్‌ఎస్‌లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. పైలట్‌గా ఈ యాత్రలో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నానని శుక్లా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News