విస్తృత యుద్ధాన్ని అమెరికా ప్రారంభించింది: టెహ్రన్
దౌత్యం పేరుతో ద్రోహం చేశారని విమర్శలు;
By : Praveen Chepyala
Update: 2025-06-22 11:24 GMT
ఇరాన్ పై అమెరికా దాడి పశ్చిమాసియాలో విస్తృత స్థాయి సైనిక సంఘర్షణగా మారుతుందనే భయాలను రేకెత్తిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆదివారం ఈ దాడిపై స్పందించింది. ‘‘అమెరికా స్వయంగా ఇరాన్ పై ప్రమాదకరమైన యుద్ధాన్ని ప్రారంభించింది’’ అని పేర్కొంది.
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ లతో సహ మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసిందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సోషల్ మీడియాలో తెలిపారు.
ద్రోహం చేశారు..
అమెరికా చేసిన దాడిపై ఇరాన్ విదేశాంగ శాఖ ఆదివారం ఉదయం సుదీర్ఘంగా ఎక్స్ లో పోస్ట్ చేసింది. ‘‘ఇజ్రాయెల్ లో జాతి విధ్వంసక, చట్ట విరుద్దమైన పాలన దూకుడు చర్యలకు మద్దతు ఇవ్వడం ద్వారా దౌత్యానికి ద్రోహం చేసింది అమెరికాయే. దౌత్య ప్రక్రియ కొనసాగిస్తూ సమయం అని ప్రపంచం మర్చిపోకూడదు’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.
‘‘ఇప్పుడు జియోనిస్ట్ పాలన చేసిన ఉల్లంఘనలు, నేరాలకు సపోర్టు ఇవ్వడం ద్వారా ఇరాన్ పై ప్రమాదకరమైన యుద్ధాన్ని అమెరికా ప్రారంభించింది’’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కు, అమెరికా సైనిక దురాక్రమణను ప్రతిఘటించే హక్కు ఉంది. ఇరాన్ జాతీయ ప్రయోజనాలను కాపాడుతుంది’’ అతని తన పోస్ట్ లో రాసుకొచ్చింది.
దౌర్జన్యం..
ఈ ఉదయం జరిగిన సంఘటనలు దారుణమైనవి. వీటికి శాశ్వత పరిణామాలు ఉంటాయని అబ్బాస్ అరాగ్చి అన్నారు. ‘‘ఆత్మరక్షణలో చట్టబద్దమైన ప్రతిస్పందనను అనుమతించే ఐక్యరాజ్య సమితి చార్టర్, దాని నిబంధనలకు అనుగుణంగా ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని ప్రయోజనాలను, ప్రజలను రక్షించుకోవడానికి అన్ని హక్కులు ఉంటాయి’’ అని ఆయన అన్నారు.