‘‘అమెరికా, భారత గగన తలాన్ని వాడలేదు’’
సోషల్ మీడియాలోని పోస్టులను తోసిపుచ్చిన భారత్.. తప్పుడు సమాచారం అన్న పీఐబీ;
By : Praveen Chepyala
Update: 2025-06-23 07:40 GMT
ఇరాన్ పై దాడి చేయడానికి భారత గగనతలాన్ని యూఎస్ఏ బాంబర్లు వాడినట్లు వస్తున్న ప్రచారానాన్ని భారత్ తోసిపుచ్చింది. ఇదంతా పచ్చి అబద్దమని ఖండించింది.
ఈ రోజు ఉదయం కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లు ప్రచారం ప్రారంభించాయి. దీనితో అప్రమత్తమైన భారత యంత్రాంగం వీటిని నకిలీ వార్తలని కొట్టిపారేసింది.
ఆదివారం తెల్లవారుజామున ఇరాన్ లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా బీ2 బాంబర్లు బాంబులు జారవిడిచాయి. కొండ లోపల సొరంగంలో ఉన్న ఈ అణు కేంద్రాలను ధ్వంసం చేయడానికి బంకర్ బస్టర్ బాంబులను వాడినట్లు యూఎస్ఏ ప్రకటించింది.
మొత్తం 14 బాంబులు జారవిడిచి వాటిని ధ్వంసం చేసినట్లు పెంటగాన్ వెల్లడించింది. ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే మరిన్ని దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
ఫ్యాక్ట్ చెక్..
అమెరికా, ఇరాన్ లోని అణుకేంద్రాలపై దాడి చేయడానికి ‘‘ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్(MidnightHammer)’’ను ప్రారంభించింది. దీని కోసం భారత వైమానిక స్థావరాన్ని ఉపయోగించుకుందని అనేక సోషల్ మీడియా ఖాతాలు పేర్కొన్నాయి.
అయితే పోస్టులు అబద్దం అని పీఐబీ ప్యాక్ట్ చెక్ ఆదివారం ఒక ఎక్స్ ఖాతాలో తెలిపింది. ‘‘ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్’’ సమయంలో అమెరికా, భారత వైమానిక ప్రాంతాన్ని ఉపయోగించలేదు’’ అని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ప్రెస్ ఇన్పర్మేషన్ బ్యూరో కు చెందిన తనిఖీ విభాగం తెలిపింది.
జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ చైర్ జనరల్ డాన్ కెయిన్ ఒక ప్రెస్ మీటింగ్ సందర్భంగా యూఎస్ విమానాలు ఉపయోగించే మార్గాన్ని వివరించారని అది తెలిపింది.