అధికారంలో ఉంటే ఆస్తులు పెరుగుతాయా?
x

అధికారంలో ఉంటే ఆస్తులు పెరుగుతాయా?

అధికారంలో ఉంటే ఆస్తులు పెరుగుతాయి, పరపతి పెరుగుతుంది, అందరూ గౌరవిస్తారు. అందుకే పవర్‌ కోసం పాకులాడుతుంటారు నేతలు.


పరపతి, ఆస్తుల విలువలు పెరగాలంటే అధికారం ఉండాల్సిందే. ఆ విషయాలు ప్రస్తుతం ఎన్నికల అఫిడవిట్లను పరిశీస్తే అర్థమవుతుంది. మంత్రి పెద్దిరెడ్డి, మంత్రి రోజా, మంత్రి ఉష శ్రీచరణ్‌ ఆస్తులు పెరిగాయే తప్ప తరగ లేదు. గత ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఈ ఎన్నికల అఫిడవిట్లను పరిశీలిస్తే ఆస్తులు రెట్టింపయ్యాయని వాస్తవం. ఈ కింది అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.

సొంత కారు లేని మంత్రి పెద్దిరెడ్డి
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుగులేని నాయకుడు. సీఎం జగన్‌ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన నేత. రెండో సీఎంగా చలామణి అవుతున్నారని ఆ పార్టీలోనే కాదు బయట కూడా ప్రచారంలో ఉన్న మాట. అయినా ఆయనకు నేటికీ సొంత కారు లేదు. అదే మరి వెరైటీ అంటే. ఇదిలా ఉంటే వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ వ్యాపారం అంతా ఆయన కనుసన్నుల్లోనే సాగుతోందనే విమర్శలు కూడా ఉన్నాయి. పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు సిట్టింగ్‌ ఎంపీ మిధున్‌రెడ్డిలకు సంబంధించిన డిస్టల్లరీస్‌ నుంచే లిక్కర్‌ సరఫరా చేస్తున్నారని కూడా ఆ పార్టీలో నేతలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భూముల కొనుగోలు చేపట్టారని కూడా చర్చ సాగుతోంది. ఇసుక, మట్టి, మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
పెద్దిరెడ్డి, ఆయన భార్య స్వర్ణలత ఆస్తులు భారీగా పెరిగాయి. గత ఐదేళ్ల క్రితం ఉన్న ఆస్తులకు తాజాగా ప్రకటించిన ప్రోపర్టీస్‌ లెక్కలే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అధికారంలోకి రాక ముందు 2019లో పెద్దిరెడ్డి చరాస్తులు రూ. 11.27 కోట్లు. 2024 నాటికి 10.59 కోట్లుగా ప్రకటించారు. 2019లో రూ. 10.59 కోట్లుగా ఉన్న స్థిరాస్థులు రూ. 114.25కోట్లకు పెరిగాయి. ఆయన భార్య స్వర్ణలతకు 2019లో రూ. 66.79 కోట్లకు స్థిరాస్తులు పెరిగాయి. 2019లో రూ. 10.01 కోట్లుగా ఉన్న చరాస్తులు 2024 నాటికి రూ. 29.2 కోట్లకు పెరిగింది. 2019 ఎన్నికల నాటికి పెద్దిరెడ్డి రూ. 91.74 కోట్లు ఆస్తులు ఉండగా 2024 నాటికి రూ. 124.84 కోట్లకు పెరిగింది. స్వర్ణలత ఆస్తులు 2019 నాటికి 39.22 కోట్లు వరకు ఉండగా నేడది రూ. 110.55 కోట్లకు చేరింది.
పెరిగిన దారిలోనే రఘురామకృష్ణమరాజు ఆస్తులు
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున కనుమూరి రఘురామకృష్ణమరాజు భార్య నామినేషన్‌ దాఖలు చేశారు. దంపతుల పేరిటి రూ. 32.06 కోట్లు చరాస్తులు, రూ. 187.3 కోట్ల స్థిరాస్తులు కలిపి మొత్తం రూ. 219 కోట్ల ఆస్తులున్నాయి. బ్యాంకు డిపాజిట్లు, పిఎఫ్‌లు, షేర్లు, ఈక్విటీలు, నగదు కలిపి రఘురామకృష్ణమరాజుపేరుతో రూ. 13.89 కోట్లు, రమాదేవిపేరుతో రూ. 17.79 కోట్లు పెట్టుబడులు ఉన్నాయి. తమిళనాడు, హైదరబాదు రంగారెడ్డి నల్లగొండ, విశాఖపట్నం, భీమవరం, చినఅమిరం, పెద్దఅమిరం తదితర ప్రాంతాల్లో వ్యవసాయేతర భూములున్నాయి. రఘురామకు రూ. 8.15 కోట్లు, భార్యకు రూ. 4.45 కోట్లు అప్పులున్నాయి. ఐదేళ్లుగా సీఎం జగన్‌పై తిరుగుబాటు బావుటా ఎగువర వేసిన నరసాపురం ఎంపీ ఈయన.
భారీగానే మంత్రి ఉష శ్రీచరణ్‌ ఆస్తులు
కళ్యాణదుర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి ఉష శ్రీచరణ్‌ ఆస్తులు గత ఎన్నికల్లో చూపించిన దానికి తాజాగా ప్రకటించిన దానికి భారీగా పెరుగుదల కనిపించింది. రూ. 16 కోట్ల చరాస్తులు, రూ. 1.45 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. రూ. బంగారం, వెండి కలిపి 1.25 కోట్ల విలువైన ఆభరణాలున్నాయి. ఆమె భర్త శ్రీచరణ్‌ చిరాస్తులు రూ. 7.02 కోట్లు. స్థిరాస్తులు రూ. 37.91 కోట్లున్నాయి. రూ. 1.607కేజీల బంగారం, 48కేజీల వెండి, ఒక బస్సు, ఇతర వాహనాలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు.
పిన్నెల్లికి హైదరాబాద్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు
పల్నాడు జిల్లా మాచర్ల వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆస్తుల విలువ రూ. 44.28కోట్లు. ఇందులో చరాస్తులు రూ. 12.33 కోట్లు. స్థిరాస్తులు రూ. 31.95 కోట్లు. అప్పులు రూ. 20.32 కోట్లు. భార్యాభర్తలపేరుతో హైదరాబాద్‌లోని గడ్డియన్నారంలో నాలుగు ప్లాట్లు, కుద్బుల్లాపూర్‌లో భూములు, మలక్‌పేటలో ఒక షాపింగ్‌ కాంప్లెక్స్‌లో వాటాలున్నాయి. గచ్చబౌలీలో ఒక కమర్షియల్‌ కాంప్లెక్స్, మాచర్లలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నాయి. ఈయన వరుసగా నాలుగుసార్లు గెలిచిన ఎమ్మెల్యే.
పెరిగిన నందిగం సురేష్‌ ఆస్తులు
బాపట్ల లోక్‌సభ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ ప్రస్తుత అదే పార్టీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్‌ ఆయన భార్య బేబీలతల ఉమ్మడి ఆస్తి రూ. 2.74కోట్లుగా చూపారు. 2019లో వీరి ఆస్తి విలువ రూ. 41.58లక్షలు మాత్రమే. ఐదేళ్లల్లో ఎంపీ ఆస్తులు భారీగానే పెరిగాయని చెప్పొచ్చు. సురేష్‌కు రూ. 7.05లక్షలు, ఆయన భార్యకు రూ. 9.20లక్షలు బ్యాంకు అప్పులున్నాయి.
మంత్రి రోజాకి తొమ్మిది కార్లు
నగరి ఎమ్మెల్యే, మంత్రి ఆర్కే రోజా చరాస్తులు రూ. 4.58కోట్లు. స్థిరాస్తులు రూ. 6.05 కోట్లు. ఐదేళ్లల్లో భారీగానే ఆస్తులు పెరిగినట్లు గత అఫిడవిట్లను పరిశీలిస్తే తెలుస్తుంది. తొమ్మిది కార్లుండగా వాటి విలువ రూ. 1.59 కోట్లు. 2019 నాటి అఫిడవిట్లలో పేర్కొన్న కార్ల విలువ కంటే ఇప్పుడు బాగా తగ్గింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రూ. 39.21లోల విలువైన చిట్‌ ఉన్నట్లు తెలిపారు. మరో ప్రైవేటు చిట్‌ఫండ్‌లోను రూ. 32,90,450 చిట్‌ ఉన్నట్లు తెలిపారు.
అవినాష్‌రెడ్డి ఆస్తులు 25 కోట్లు
రూ. 25.51కోట్లు ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. రూ. 32.75లక్షల విలువైన ఇన్నోవా కారు, భార్య సమతా పేరుతో రూ. 25,51,19,305 విలువై ఆస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. పులివెందుల మండలంలో 27.40 ఎకరాలు, భార్య పేరుతో పలు ప్రాంతాల్లో 33.90 ఎకరాలు భూములున్నట్లు పేర్కొన్నారు.
బాలకృష్ణకి 9 కోట్ల అప్పులు
హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ రూ. 184.83 కోట్లు ఆస్తులున్నట్లు అఫిడవిట్లు పేర్కొన్నారు. రూ. 1.52 కోట్ల విలువైన మూడు కార్లు, 800 గ్రాముల బంగారం, 5కిలోల వెండి, రూ. 68.85 లక్షల విలువైన డైమండ్సు, రూ. 9.09 కోట్ల అప్పులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వివరించారు.
బొత్స ఆస్తులు రెండున్నర రెట్లు
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి గత ఐదేళ్లల్లో ఇది వరకున్న ఆస్తి కంటే రెండున్నర రెట్లు పెరిగినట్లు చూపించారు. మంత్రి పేరుతో చరాస్తులు రూ. 3.78 కోట్లు, భార్య ఝాన్సీ లక్ష్మి పేరిట రూ. 4.75 కోట్లు, ఉమ్మడి ఆస్తి రూ. 35.04లక్షలు ఉంది. స్థిరాస్తుల పరంగా బొత్స పేరుతో రూ. 6.75 కోట్లు, ఝాన్సీ పేరుతో రూ. 4.46 కోట్లు, కుటుంబ సభ్యుల పేరుతో రూ. 1.08 కోట్లు ఆస్తులు ఉన్నాయి. మొత్తం ఆస్తుల విలువ రూ. 21.19 కోట్లు ఉంది. 2019లో రూ. 8.23 కోట్లు వరకే ఆస్తులున్నాయి. మంత్రికి రూ. 15.95లక్షల కారు ఉంది. ఝాన్సీకి రూ. 73.33లక్షలు , రూ. 8లక్షలు విలువైన రెండు కార్లు ఉన్నాయి. బొత్స వద్ద రూ. 20.15లక్షల విలువైన 35తులాల బంగారం, ఝాన్సీ వద్ద రూ. 2.11 కోట్ల విలువైన 325తులాల బంగారం ఉంది. అప్పులు రూ. 4.24 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
Read More
Next Story