Tirumala || తిరుమల కొండపై కొత్త తరహా మోసం
x

Tirumala || తిరుమల కొండపై కొత్త తరహా మోసం

మాంగళ్య పూజ పేరుతో భక్తులను బురిడీ కొట్టించిన మాయగాడి లీలలు బయటకొచ్చాయి.


తిరుమల :- తమిళనాడులోని మధురైకి చెందిన మురుగన్ నాగరాజ్ అలియాస్ శంకర్రావు గత కొద్ది రోజులుగా తిరుమల కొండపై మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. మురుగన్‌ను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు. తమిళనాడు నుంచి తిరుమలకు వచ్చే భక్తులను టార్గెట్ చేసేవాడు. వారిని మాంగల్య పూజ పేరుతో మోసం చేసేవాడు.


ఈ ఏడాది మార్చిలో తిరువన్నామలైకి చెందిన ఉచిమహాలీ అనే మహిళను అతను మోసం చేశాడు. మురుగన్ నాగరాజు తనను టీటీడీ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. మాంగల్య పూజ చేస్తే భర్తకు, కుటుంబానికి మంచి జరుగుతుందని నమ్మించాడు. శ్రీబేడి ఆంజనేయస్వామి దగ్గర ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌కు ఆమెను తీసుకెళ్లాడు.


అక్కడ ఆమెకు రెండు డజన్ల మట్టి గాజులు ఇచ్చాడు. ఆమె దగ్గర ఉన్న 40 గ్రాముల బంగారు మాంగల్య సూత్రం, లక్ష్మీ డాలర్ ఉన్న సరం, రెండు ఫోన్లు తీసుకున్నాడు.తరువాత పుష్కరిణికి వెళ్లి స్నానం చేసి గుడి ముందు మాంగల్య పూజకు రమ్మని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. అప్పుడు కానీ ఆమెకు మోసపోయానని అర్థం కాలేదు.అదే నెలలో కోయంబత్తూరు, తిరువళ్లూరుకు చెందిన మరో ఇద్దరు మహిళలను కూడా అతను మోసం చేశాడు. వారి దగ్గర నుంచి 92 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకున్నాడు.


బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. చెన్నై, మదురై, పుదుచ్చేరిలో ఈ తరహా మోసాలపై విచారణ చేశారు. అప్పుడు నాగరాజు మోసాలు బయటపడ్డాయి. అతడిపై పోలీసులు నిఘా ఉంచి తిరుమలలో అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి రూ.13 లక్షల విలువైన 132 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.


నాగరాజుపై ఆంధ్ర, తెలంగాణలో 20 పైగా కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అతడిని తిరుపతి కోర్టులో హాజరు పరచగా రిమాండు విధించారు.



Read More
Next Story