ఈ ద్వీపానికి వెలుగు ఎప్పుడు?
x

ఈ ద్వీపానికి వెలుగు ఎప్పుడు?

భవానీ ద్వీపం ఆరిపోయి నెలరోజులైంది. సరిగ్గా 30 రోజుల క్రితం ద్వీపం నీట మునిగింది. ఈ ద్వీపానికి వెలుగు ఎప్పుడు వస్తుందోనని సందర్శకులు ఎదురు చూస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ లో భవానీ ద్వీపం పేరు తెలియని వారు ఉండరు. కృష్ణా బ్యారేజ్ పైభాగాన నది మధ్యలో ఒక పెద్ద ఐల్యాండ్. నది బయట ఒడ్డున్న నిలబడి ఒక్కసారైనా భవానీ ఐల్యాండ్ చూసి రావాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. భక్తులు దుర్గమ్మను సందర్శించి ముక్కులు తీర్చుకునేందుకు వస్తారు. దుర్గమ్మ గుడికి కింది భాగంలో భారీగా ఎప్పుడూ పారుతూ కనిపించే కృష్ణానది స్నాన ఘట్టాల వద్ద భక్తులు స్నాన ఆచరించేటప్పుడు ఐల్యాండ్ కన్నుల పండువగా కనిపిస్తుంది. ఐల్యాండ్ అంతా చెట్లతో కప్పబడి ఉంటుంది. చుట్టూ నీరు మధ్యలో పచ్చని చెట్లు. హాయిని గొలిపే వాతావరణం.

టూరిజం శాఖ వారు భవానీ ఐల్యాండ్ ను బాగా అభివృద్ధి చేశారు. భవానీపురంలోని బరం పార్క్ నుంచి నదిలో విహరిస్తూ, పరిసరాలు చూసుకుంటూ, నదిలో ఎగిరి పడుతున్న చేపలను తదేకంగా చూస్తు టూరిజం వారు ఏర్పాటు చేసి బోట్లలో అక్కడికి యాత్రికులు చేరుకుంటారు. ఐల్యాండ్ లో ఉన్న హోటల్స్, ఆట స్థలాలు, ఎమ్యూజ్ మెంట్ పార్క్, చిన్న పిల్లలు ఆటాడుకునే ప్రత్యేక ప్రాంగణం, మధ్య మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో సేద తీరేందుకు ఏర్పాటు చేసిన బల్లలపై యాత్రికులు చూర్చుని సరదాగా గడుపుతారు. ఐస్క్రీమ్ లు తింటూ, స్నాక్స్ తినుకుంటూ పెద్దలు, పిల్లలు ఐలాండ్ ను ఒక చుట్టు చుట్టి వస్తారు. ఇంటికి వెళ్లిన తరువాత అక్కడి ప్రదేశాలు, నది, చుట్టూ ఉన్న ఇళ్లు, చెట్ల పొదలు, చుట్టూ కనిపించే కొండలు వంటి ప్రకృతి సౌందర్యం గురించి కథలు కథలుగా చెప్పుకుని ఆనందిస్తారు. ఇది 133 ఎకరాల విస్తీర్ణంతో భారతదేశంలోని అతిపెద్ద నదీ ద్వీపాలలో ఒకటిగా ఉందని పెద్దలు చెబుతుంటారు. ఇందులో రోబోటిక్ డైనోసార్ పార్క్, గార్డెన్ మేజ్, మిర్రర్ మేజ్, గోల్ఫ్, బ్యాడ్మింటన్ సిమ్యులేటర్, సైక్లింగ్ మొదలైనవి ఉన్నాయి.

ఇప్పుడు భవానీ ద్వీపం ఆరిపోయి నెల రోజులైంది. మళ్లీ వెలగాలంటే కనీసం మూడు నెలలు పట్టే అవకాశం ఉందని టూరిజం శాఖ అధికారులు చెబుతున్నారు. బెర్మ్ పార్క్ కూడా పూర్తిగా పాడైపోయింది. వరదల కారణంగా భవానీ ఐల్యాండ్ సుమారు 12 అడుగుల పైన వరద నీటిలో మునిగిపోయింది. నది 10 రోజుల పాటు ఉధృతంగా ప్రవహించింది. దీంతో ఇసుక మేటలు వేసి పేరుకుపోయింది. పెద్ద పెద్ద ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. ఐల్యాండ్ లో ఉన్న ఏ ఒక్కటి కూడా పనికి రాకుండా పోయింది. తిరిగి పునరుద్దరించాలి. మూడు నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నా ఆసమయం సరిపోయే అవకాశం కనిపించడం లేదు. హోటల్ నిర్మించేందుకే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ముందు ఇసుకను పూర్తి స్థాయిలో తొలగిలంచాల్సి ఉంది. ఇసుక తొలగించాలంటే ఏదైన చిన్న పాటి యంత్రం ఉపయోగించే అవకాశం కూడా లేకుండా పోయింది. ద్వీపంలో మొత్తం చెట్లు ఎక్కువగా ఉంటాయి. అడుగడుగునా చెట్లు ఉండటం వల్ల మనుషుల ద్వారానే ఇసుకను తొలగించాల్సి ఉంటుంది. అధికారులు ఇప్పటికే పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీపాన్ని అనుకుని ఉంచిన బోట్లు కూడా తిరగబడి ద్వీపంలోపలికి నెట్టుకుని పోయాయి. ద్వీపం చుట్టూ భూమి కోతకు గురైంది. బోట్ల ద్వారా బెర్మ్ పార్క్ నుంచి వెళ్లిన యాత్రికులు దీపం లోపలికి వెళ్లాలంటే బోట్లు దిగాలి. ఆ బోట్లు దిగే చోట బోటు గట్టకు పూర్తిగా ఆనుకోవాలంటే తగిన విధంగా గట్టును బాగు చేయాల్సి ఉంటుంది. దీనికే ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పునరుద్ధరణ పనులు భవానీ ఐల్యాండ్ టూరిజం కార్పొరేషన్ (బిఐటిసి) వేగంగా ముందుకు తీసుకుపోతోంది. వరద వేగానికి ద్వీపం ప్రవేశ మార్గం వద్ద ఉన్న జట్టీ కూడా ద్వీపం పైకి ఎక్కేసింది.

టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల ఐల్యాండ్ ను సందర్శించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసిన అధికారులు మంత్రికి వివరించారు. సుమారు రూ. 10 కోట్ల వరకు నష్టం జరిగిందని చెప్పారు. వరదకు ముందు బెర్మ్ పార్క్ లో కనిపించే పూల మొక్కలు, క్రోటోన్స్ ఇసుక దిబ్బల కింద కూరుకు పోయాయి. నది దరి దాదాపు మూడు మీటర్ల వరకు వెలుపలికి కోసుకొచ్చింది. దరి ప్రాంతాన్ని ఫెన్నింగ్ తో బాగు చేయాల్సి ఉంటుంది. దుర్గమ్మ కొండకు పడమటి వైపున కాలినడకన భక్తులు బెర్మ్ పార్క్ కు చేరుకుని అక్కడి అందాలను చూసి ఆనందిస్తారు. బోట్లలో విహరిస్తూ ఆనందాన్ని పంచుకుంటారు. పిల్లలతో కుటుంబమంతా అప్పుడప్పుడూ ఈ విహారానికి వెళుతుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులే కాకుండా విజయవాడ నగరంలోని స్థానికులు కూడా సాయంత్రం వేళ భవానీ ద్వీపం వెళ్లి ఆనందిస్తుంటారు. నామినల్ ఫీజుతో బోట్లలో టూరిజం శాఖ వారు భవానీ ద్వీపంలోకి టూరిస్టులను తీసుకెళతారు.


Read More
Next Story