
అధికారంతో క్లీన్ చిట్లు? సీఎంల ‘స్వీయ నిర్దోషిత్వం’పై దేశవ్యాప్తంగా చర్చ
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ముఖ్యనేతలు.. అధికారంలోకి రాగానే అదే దర్యాప్తు సంస్థల నుంచి క్లీన్ చిట్ పొందుతున్నారు.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ముఖ్యనేతలు.. తిరిగి అధికారంలోకి రాగానే కేసుల నుంచి విముక్తి పొందుతున్నారు. సాక్ష్యాధారాలు లేవని దర్యాప్తు సంస్థలు నివేదికలు సమర్పిస్తుండడంతో కోర్టులు వారి మీద నమోదయిన కేసులను కొట్టివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థల స్వతంత్రతపై తీవ్ర సందేహాలు తలెత్తుతున్నాయి.
ఇటీవల ఆంధ్రప్రదేశ్(AP), కర్ణాటక(Karnataka) రాష్ట్రాల్లో చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే ..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) పై గతంలో నమోదయిన మూడు కేసులు క్లోజ్ అయ్యాయి.
1. నైపుణ్యాభివృద్ధి కేసు: 2023 సెప్టెంబర్లో రూ.371 కోట్ల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలతో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసింది. 53 రోజుల పాటు జైలులో ఉన్న ఆయనకు అనంతరం బెయిల్ దొరికింది. 2026 జనవరిలో అధికారంలోకి వచ్చాక అదే సీఐడీ “ ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవు” అని రిపోర్టు ఇవ్వడంతో కోర్టు దాన్ని ఆమోదించింది.
2. మద్యం కేసు: రూ.1,300 కోట్ల నష్టం జరిగిందని ఆరోపిస్తూ దాఖలైన మద్యం కుంభకోణం కేసును విజయవాడ ఏసీబీ కోర్టు ముగించింది. అయితే చంద్రబాబు పాలనలో సీఐడీ ఆయనకు అనుకూలంగా నివేదిక ఇచ్చింది.
3. ఫైబర్ నెట్ కేసు: రూ.114 కోట్ల ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ నమోదయిన కేసును కూడా 2025 డిసెంబర్లో కొట్టేశారు. ఈ కేసుల కొట్టివేతపై వైసీపీ తీవ్ర నిరసనలు చేపడుతుండగా.. టీడీపీ ఇవన్నీ రాజకీయ కక్షతో పెట్టిన నకిలీ కేసులేనని వాదిస్తోంది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య - ముడా కేసు:
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Sidda Ramaiah) భార్యకు 14 విలువైన స్థలాలు కేటాయించారన్న ఆరోపణలు 2024లో వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి నియమించిన జస్టిస్ పీఎన్ దేశాయ్ జ్యుడీషియల్ కమిషన్.. స్థల కేటాయింపులో ఎటువంటి అక్రమం జరగలేదని నివేదిక ఇచ్చింది. కర్ణాటక మంత్రివర్గం ఈ నివేదికను ఆమోదించడంతో కేసు రాజకీయంగా ముగిసినట్లయింది. ఈడీ జారీ చేసిన సమన్లను హైకోర్టు రద్దు చేయడంతో సిద్ధరామయ్య విజయం సాధించారు. ఆ తర్వాత జూలై 2025లో సుప్రీంకోర్టు EDని "రాజకీయ పోరాటాలకు ఉపయోగించుకుంటున్నారని" విమర్శించింది. తాజాగా లోకాయుక్త పోలీసులు కూడా క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. జనవరి 22న తీర్పు వెలువడే అవకాశం ఉంది.
యూపీ సీఎం యోగి - ‘వాషింగ్ మెషిన్’ ఆరోపణలు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన వెంటనే తనపై ఉన్న పాత కేసుల్లో ప్రాసిక్యూషన్ అనుమతి ఉపసంహరించుకోవడం అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రతిపక్షం నుంచి బీజేపీలోకి చేరిన పలువురు నేతలపై ఈడీ, సీబీఐ కేసులు ఎత్తివేయడంపై కూడా ఆరోపణలు వెలువెత్తాయి. వీటిని ప్రతిపక్షాలు ‘వాషింగ్ మెషిన్ రాజకీయాలు’గా అభివర్ణించాయి.
కోర్టు ఉత్తర్వులతో కేసులు ముగియవచ్చు. కానీ అధికారంతో కేసులు ముగుస్తున్నాయన్న భావన బలపడితే, ప్రజాస్వామ్యానికి అది కేవలం హెచ్చరిక కాదు. ఒక ప్రమాద సంకేతం.

