‘పాక్‌పై ప్రధాని మోదీ ఉగ్రరూపం ’
x

‘పాక్‌పై ప్రధాని మోదీ ఉగ్రరూపం ’

‘‘పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలుండవు. ఒకవేళ జరిగితే అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)‌పై మాత్రమే’’- ప్రధాని మోదీ


ప్రధాని మోదీ (PM Modi) పాక్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'సింధూర్' గన్‌పౌడర్‌గా మారితే ఏం జరుగుతుందో శత్రుదేశానికి తెలిసేలా చేశామన్నారు. గురువారం ఆయన రాజస్థాన్‌లో పర్యటించారు. అక్కడ దేశవ్యాప్తంగా 103 అమృత్ స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో అమృత్ భారత్ యోజన కింద కొత్తగా అభివృద్ధి చేయబడిన దేశ్నోక్ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ కార్యక్రమం అనంతరం బికనీర్ సమీపంలోని పలానా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) తర్వాత ఆయన పాల్గొన్న తొలి బహిరంగ సభ ఇదే.

‘‘ఆపరేషన్ సింధూర్‌ (Operation Sindoor) కేవలం ప్రతీకార చర్య కాదు. భారతావని ఉగ్ర రూపం. తమ జోలికొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూయించాం. 22 నిమిషాల్లో తొమ్మిది ఉగ్ర స్థావరాలను నాశనం చేసాం. తమ ఆయుధాలను చూసి గర్వపడేవారు శిథిలాల కింద శాశ్వతంగా నిద్రపోయారు. ఏం చేసినా భారత్ మౌనంగా ఉంటుందనుకుని భావించిన వ్యక్తులు ఇప్పుడు తమ ఇళ్లలో దాక్కున్నారు. భారత్‌పై పాక్ ఎప్పటికీ గెలవలేదు. ప్రత్యక్ష పోరు జరిగినప్పుడల్లా.. ఓటమి చవిచూడాల్సిందే. అందుకే ఉగ్రవాదాన్ని పాక్ ఆయుధంగా వాడుకుంటుంది. ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి వాణిజ్యపర చర్చలు ఉండవు. చర్చలంటూ జరిగితే అది కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)‌పైనే జరుగుతాయి. పాకిస్తాన్‌(Pakistan)కు ఒక్క చుక్క నీటిని కూడా వదలం. భారతీయులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలిసేలా చేశాం.’’ అని అన్నారు. చివరగా పాక్ తోకముడిపించిన భారత భద్రల బలగాలను అభినందించారు.

ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌కు దగ్గరలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్‌ లోయలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. 26 మంది పర్యాటకులను కాల్చి చంపిన ఘటనకు ప్రతిచర్యగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ ప్రారంభించింది. పాక్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను దాడులు నిర్వహించి సుమారు వంద మంది ఉగ్రవాదులకు మట్టుబెట్టింది.

Read More
Next Story