సూరత్ గెలుపుపై బీజేపీపై దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు.. ఎందుకు?
x

సూరత్ గెలుపుపై బీజేపీపై దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు.. ఎందుకు?

సూరత్ లోక్ సభ సీటును బీజేపీ ఎటువంటి పోటీ లేకుండా గెలుచుకుంది. కానీ విపక్షాలు మాత్రం ఇది కుట్ర అంటూ అక్కడ జరిగిన తతంగాలను కథకథలుగా చెబుతున్నాయి.. అసలేంటవీ..


సూరత్ లోక్ సభ సీటు ముఖేష్ దలాల్ గెలుచుకున్నారు. ఈ స్థానానికి దలాల్ కాకుండా ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో బీజేపీ తరఫున బరిలో ఉన్న ఆయన గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించి, సర్టిఫికెట్ సైతం జారీ చేసింది. అయితే ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ జరిగిన ఏకపక్ష విజయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాయి. ఇది బాలీవుడ్ సినిమాలో ఉన్న ట్విస్టులకు ఏమాత్రం తీసిపోవని వారి అభిప్రాయం. విజయం వెనక బెదిరింపులు, కిడ్నాప్‌లు, అదృశ్య హస్తాలు ఉన్నాయట. అయితే, సూరత్‌కి ఇలాంటి రాజకీయ భయానక కథనాలు కొత్త కాదు.

రహస్యంగా నామినేషన్ల ఉపసంహరణ
ప్రస్తుత ఎన్నికలపై దృష్టి సారిస్తే బీజేపీ ఇక్కడ విజయం సాధించింది. కాని ఎనిమిది మంది ప్రతిపక్ష అభ్యర్థులు రహస్యంగా నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. వారిలో నలుగురు - భరత్ ప్రజాపతి, అజిత్ ఉమత్, కిషోర్ దయాని, బరయ్య రమేష్ స్వతంత్ర అభ్యర్థులు. మిగిలిన నలుగురు అభ్యర్థుల్లో లాగ్ పార్టీకి చెందిన షోబ్ షేక్, సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్టీకి చెందిన అబ్దుల్ హమీద్ ఖాన్, గ్లోబల్ రిపబ్లికన్ పార్టీకి చెందిన జయేష్ మేవాడా, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)కి చెందిన ప్యారేలాల్ భారతి. వీరంతా ఎన్నికల్లో పోటీ చేయడం తమకు ఇష్టం లేదని ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. ఆ తర్వాత, జిల్లా కలెక్టర్, సూరత్ జిల్లా ఎన్నికల అధికారి (DEO) సౌరభ్ పర్ఘీ, దలాల్‌ను విజేతగా ప్రకటించారు.


BSP జాగ్రత్త ఫలించలేదు
ఎనిమిది మంది ప్రతిపక్ష అభ్యర్థులలో, BSP కి చెందిన భారతి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్న చివరి వ్యక్తి, అతను ఏప్రిల్ 22న గుజరాత్ ఎన్నికలకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీన.. లిఖితపూర్వకంగా తన నామినేషన్ ఉపసంహరించుకున్నాడు.
భారతి తన చేతితో రాసిన లేఖను DEOకి సమర్పించిన తర్వాతే పార్టీకి ఉపసంహరణ గురించి తెలిసిందని BSP సూరత్ నగర అధ్యక్షుడు సతీష్ సోనావ్నే ఫెడరల్‌తో చెప్పారు.
"కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆమ్ ఆద్మీ పార్టీ లేదు. వారంతా బీఎస్పీకి మద్ధతు ఇవ్వడానికి అంగీకరించారు.. కానీ మాకు అప్పుడే అనుమానం మొదలైంది. ఇలాంటిదేదో జరుగుతుందని" సోనావ్నే చెప్పారు. ఎన్నికల్లో ఎలాగైన పోటీ చేయాలని అనుకుని బీఎస్పీ భారతిని, అతని కుటుంబాన్ని వడోదరకు తరలించిందని, వారు ఏప్రిల్ 22 వరకు అక్కడే ఉన్నారని సోవాన్నే చెప్పారు. “ ఫోన్ ట్రాక్ చేయకుండా ఉండడానికి తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. దానిని సూరత్ లో ఉంచారు. కొత్త నెంబర్ తో మాతో టచ్ లో ఉన్నాడు. కానీ వారు కనిపెట్టినట్లు ఉన్నారు. బహూశా మా ఫోన్లను ట్యాప్ చేసి ఉండవచ్చు” అని సోనావ్నే అనుమానం వ్యక్తం చేశాడు.
క్రైమ్ బ్రాంచ్ ద్వారా .. BSP
ఏప్రిల్ 22న భారతితో తమకు సంబంధాలు తెగిపోయాయని ఆయన అన్నారు. “నేను చివరిసారిగా సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు భారతితో మాట్లాడానని, వడోదరలోని తన రూమ్ ను చాలా మంది ప్రజలు చుట్టుముట్టారని ఆయన నాకు చెప్పారు. అతనితో కాంటాక్ట్ కోల్పోయిన తర్వాత, మేము అతని కోసం ప్రతిచోటా వెతికాము. తరువాత సూరత్ ఎన్నికల అధికారి తనకు పోటీ చేయడం ఇష్టంలేదని లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసినట్లు తెలిసింది.
మధ్యాహ్నం తర్వాత అతను DEO కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మేము అతనిని కలవగలిగాము, ”అని సోనావ్నే చెప్పారు.
BSP నాయకుడి ప్రకారం, భారతి, అతని కుటుంబాన్ని వడోదర నుంచి క్రైమ్ బ్రాంచ్, సూరత్ పికప్ చేసింది. అతని కుటుంబం హోటల్‌లో ఉంచి, అతన్ని డిఇఓ కార్యాలయానికి తీసుకొచ్చి నామినేషన్ ఉపసంహరించుకునేలా ప్రణాళిక వేశారు "నామివేషన్ ఉపసంహరణ తరువాతే తన కుటుంబాన్ని బయటకు పంపిస్తామనే షరతు పెట్టి ఉంటారు" అని సోనావ్నే అనుమానం వ్యక్తం చేశారు.
మిస్టీరియస్ యు-టర్న్
అయితే అంతకుముందే నామినేషన్ సంతకాలలో "వ్యత్యాసాలు" ఉన్నాయనే ఆరోపణలతో ఒకరిద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడటంతో, కాంగ్రెస్ ఇదే విధమైన దుస్థితిని ఎదుర్కొంది. ముందుగా కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని వేసిన నామినేషన్‌ను డీఈవో తిరస్కరించారు. ఆ తర్వాత, పార్టీ ప్రత్యామ్నాయ అభ్యర్థి సురేష్ పడసాల నామినేషన్ కూడా ఇదే కారణాలతో రద్దు చేశారు.
"జాడలేని" ప్రతిపాదకులు
DEO పర్ఘీ తన నామినేషన్ ఫారమ్‌పై సంతకం చేయలేదని కుంభాని తెలిపారు. తనను ప్రతిపాదించి సంతకం చేసిన ముగ్గురు ఓటర్లను తనముందు హజరుపరచాలని ఎలక్షన్ అధికారులు కోరారని అన్నారు. తరువాత వారి కోసం వెతికితే ఎవరు కనిపించలేరని చెప్పారు. బహూశా ఎవరైన కిడ్నాప్ చేసిఉండాలి లేదా బెదిరింపులకు తాళలేక అండర్ గ్రౌండ్ కి అయినా వెళ్లి ఉండాలని కుంభాని అన్నారు.
ముఖ్యంగా ఏప్రిల్ 18న కుంభానీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు ఏప్రిల్ 21న, బీజేపీ అభ్యర్థి ఎన్నికల ఏజెంట్ దినేష్ జోధాని రిటర్నింగ్ అధికారి ముందు అభ్యంతరం లేవనెత్తారు. కుంభాని నామినేషన్‌ను ప్రతిపాదించిన ముగ్గురిలో కాంగ్రెస్ స్పేర్ అభ్యర్థి పదసాల నామినేషన్ పత్రంపై సంతకం కూడా నకిలీదే అని వాదించారు.
సంతకాలు నకిలీవా..
ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు, డీఈవో పర్ఘీ తన కార్యాలయంలో భారీ పోలీసు భద్రతతో ప్రత్యేక విచారణ జరిపారు, అక్కడ కుంభాని తన న్యాయవాదులు జమీర్ షేక్, బిఎమ్ మంగూకియాతో కలిసి హాజరయ్యారు.
సేల్స్ డీడ్ ఆధారంగా కుంభాని వ్యాపార భాగస్వామి అయిన పోల్రా, డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా కుంభాని బావ సవలియా, అతని మేనల్లుడు ధమేలియా, అతని పాన్ కార్డ్ ఆధారంగా సంతకాలను డీఈవో పరిశీలించి అవి నకిలీవని నిర్ధారించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 36(2) ప్రకారం కుంభాని అభ్యర్థిత్వం తిరస్కరిస్తున్నాం అని ప్రకటించారు.
గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ శక్తిసిన్హ్ గోహిల్ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇందులో బీజేపీ హస్తం ఉంది. ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరగకుండా గుజరాత్ హైకోర్టును ఆశ్రయిస్తున్నామని ప్రకటించారు.
సూరత్‌లో ఇదే మొదటిసారి కాదు..
ఈ ఘటన తమకు డేజావూ లాంటిదని గుజరాత్ ఆప్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా అన్నారు. 2022లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, సూరత్‌లో ఆప్, బీజేపీ మధ్య ఇదే విధమైన రాజకీయ పోట్‌బాయిలర్ జరిగిందని గుర్తు చేసుకున్నారు. నవంబర్ 2022, డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి కంచన్ జరీవాలా ఇలాగే మిస్ అయ్యారని, తరువాత ఎన్నికల అధికారి ముందు తన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారని అన్నారు. కంచన్.. గుజరాత్ ఈస్ట్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
18 గంటల పాటు అదృశ్యం..
జరీవాలా "అదృశ్యం" జరిగిన పద్దెనిమిది గంటల తర్వాత, ఆయన ఎన్నికల కార్యాలయం ముందు కనిపించారు. పోలీసులు, బీజేపీ కార్యకర్తలు ఆయనను లోపల నెట్టడాన్ని కొన్ని మీడియా సంస్థలు వీడియో తీశాయి. తరువాత ఇవి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
“జరివాలా నామినేషన్‌ను సమర్పించే చివరి తేదీన చెల్లుబాటు కాకుండా చేయాలని బిజెపి మొదట కోరుకుంది. అయితే ఆయన నామినేషన్లు స్వీకరించినప్పుడు, బీజేపీ గూండాలు ఆయనను ఎక్కడో తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం వరకు మేము అతనిని ఎక్కడా కనుగొనలేకపోయాము, ”అని ఇటాలియా చెప్పారు.
ముఖేష్ దలాల్ ఎవరు?
ముఖేష్ దలాల్ (62) కి 1981 నుంచి BJPతో అనుబంధం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం, అతను సూరత్ నుంచి మూడుసార్లు MP, మంత్రి అయిన దర్శనా జర్దోష్ స్థానంలో టికెట్ సాధించారు. OBC మోద్ వానిక్ (మోదీ) వర్గానికి చెందిన దలాల్, BJP సూరత్ నగర విభాగానికి ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర పార్టీ చీఫ్ CR పాటిల్‌కు సన్నిహితుడిగా పేరుంది. దలాల్ సూరత్ మున్సిపల్ కార్పొరేషన్‌లో సుదీర్ఘ రాజకీయాలు చేశారు. మూడు పర్యాయాలు కౌన్సిలర్‌గా, ఐదు పర్యాయాలు స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.


Read More
Next Story