
‘వందేమాతరం బ్రిటీష్ వాళ్లపై పోరాడటానికి ప్రేరణ మాత్రమే కాదు’
ముస్లిం లీగ్ ఒత్తిడితో జాతీయగీతంలోని కొన్ని చరణాలను తొలగించారన్న ప్రధాని మోదీ..
భారత జాతీయ గీతం ‘‘వందేమాతరం’’ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం లోక్సభలో సుదీర్ఘ చర్చ ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఇక మంగళవారం హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో రాజ్యసభలో ఒకరోజు ప్రత్యేక సమావేశం జరగనుంది.
‘యుద్ధ నినాదం కూడా..’
వందేమాతర(Vande Mataram) గీతం కేవలం ఆంగ్లేయులపై పోరాడటానికి ప్రేరణ మాత్రమే కాదన్నారు మోదీ. భారతమాతను విముక్తి చేయడానికి ఒక యుద్ధ నినాదం అని పేర్కొన్నారు.
జాతీయ గీతంపై కాంగ్రెస్, అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రాజీ పడ్డారని ప్రధాని మోదీ(PM Modi) ఆరోపించారు. 1937లో ముస్లిం లీగ్(Muslim League) వందేమాతర గీతానికి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించిందని, అది తన సింహాసనానికే ముప్పు తెచ్చిపెట్టేలా ఉందని అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు నెహ్రూ గీతంలోని కొన్ని కీలక చరణాలను తొలగించారని, గీతంలోని ఆ విభజనే 1947లో దేశ విభజనకు బీజం వేసిందని పేర్కొన్నారు.
"జాతీయ గీతంగా గాంధీ భావించిన వందేమాతరం అంత గొప్పదైతే.. గత శతాబ్దంలో దానికి ఎందుకు అన్యాయం జరిగింది? ఆ పాటపై గాంధీ అభిప్రాయాలను కప్పివేసిన శక్తి ఏమిటి?" అని మోదీ ప్రశ్నించారు.
"లక్షలాది మందిని ప్రేరేపించిన వందేమాతరం లాంటి పాట ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది మన స్వాతంత్ర్యం, మన త్యాగం, మన సంకల్ప మంత్రం. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా వందేమాతరం గురించి గొప్పగా చెప్పారు. లండన్లోని వీర్ సావర్కర్ ఇండియా హౌస్లో కూడా ఈ పాట ఎప్పుడూ వినిపించేది.’’ అని మోదీ గుర్తుచేశారు.

