‘యు-టర్న్ తీసుకున్న యుపిఎస్‌సి’
x

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ 

‘యు-టర్న్ తీసుకున్న యుపిఎస్‌సి’

జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల లాటరల్ ఎంట్రీకి ఆగస్టు 17న జారీ చేసిన నోటిఫికేషన్ ను UPSC వెనక్కు తీసుకుంది.


ప్రతిపక్ష పార్టీలతో పాటు కొన్ని ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో బ్యూరోక్రసీలో లాటరల్ ఎంట్రీపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ యుపిఎస్‌సి చైర్‌పర్సన్ ప్రీతి సుడాన్‌కు లేఖ రాశారు. 45 మంది జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీల లాటరల్ ఎంట్రీకి UPSC ఆగస్టు 17న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.


లాటరల్ ఎంట్రీ విధానంలో వివిధ రంగాల్లో నిపుణులు, అనుభవం ఉన్న వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే.. యూపీఎస్‌సీ ద్వారా ఎంపికయిన ఐఏఎస్ అధికారులకు బదులుగా బయటి వ్యక్తులతో పోస్టులను భర్తీ చేయడం. ఈ విధానం వల్ల కేంద్ర ప్రభుత్వంలోని విభాగాల్లో తమకు నచ్చిన వ్యక్తులను నియమించుకునే అవకాశం ఉంటుందని ప్రతిపక్షాల వాదన.

తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు ..

లాటరల్ ఎంట్రీ విధానాన్ని ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్సీలు, ఎస్టీలు, OBCల రిజర్వేషన్లను బహిరంగంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. యుపిఎస్‌సికి సిద్ధమవుతున్న ప్రతిభావంతులైన యువత హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. రాహుల్ గాంధీకి తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ కూడా బాసటగా నిలిచారు. ఆయనకు మద్దతునిచ్చారు. మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్‌జేపీ (రామ్‌విలాస్‌) కూడా ఈ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. BJP కీలక మిత్రుడు చిరాగ్ పాశ్వాన్ కూడా ఈ విధానం సమజసం కాదని పేర్కొనడం విశేషం. రిజర్వేషన్‌లను దాటవేసి, నియామకాలు చేయాలనే కేంద్రం నిర్ణయానికి తమ పార్టీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. ప్రస్తుతం చిరాగ్ మోదీ క్యాబినెట్‌లో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. బీజేపీకి చెందిన మరో ప్రధాన మిత్రపక్షం జేడీయూ కూడా లాటరల్ ఎంట్రీని తప్పుబట్టింది. యూపీఎస్‌సీ ప్రకటన ఆందోళన కలిగిస్తోందని జేడీయూ జాతీయ అధికార ప్రతినిధి కేసీ త్యాగి మీడియాతో అన్నారు.

Read More
Next Story