దేశంలో పారదర్శకంగా జరిగే చివరి ఎన్నికలు ఇవే: పరకాల ప్రభాకర్
x

దేశంలో పారదర్శకంగా జరిగే చివరి ఎన్నికలు ఇవే: పరకాల ప్రభాకర్

ఓటర్లు సరైన విధంగా ఆలోచించి ఓటు వేయాలని, మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే, దేశంలో జరిగే చివరి ఎన్నికలు ఇవేనని రాజకీయ కార్యకర్త పరకాల ప్రభాకర్ అన్నారు


భారత దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే చివరి ఎన్నికలు ఇవేనని రాజకీయ కార్యకర్త, ఆర్ధికవేత్త పరకాల ప్రభాకర్ అన్నారు. దేశం ఆర్థికంగా కుంగిపోతుందని, అసమానతలు పెచ్చరిల్లుతున్నాయని చెప్పారు. మణిపూర్ లో జరిగిన హింసలు, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోను జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. బెంగుళూరులో జరిగిన టాక్-కమ్-ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రభాకర్ ప్రస్తుత బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే ఏం జరుగుతోందో వివరించే ప్రయత్నం చేశారు.

“ఈ ఎన్నికలలో ఓటర్లు జాగ్రత్తగా ఉండకపోతే, ఈ దేశంలో మరో స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు జరగవు. మణిపూర్‌లో జరుగుతున్నది భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. అది మీ తలుపు తట్టదని అనుకోకండి. ఆర్థికంగా విధ్వంసంతో పాటు, పెద్ద ఎత్తున సమానత్వ విధ్వంసం జరుగుతుంది” అని భయందోళనలు వ్యక్తం చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాల్లో మార్పులు వస్తాయని, హక్కుల కోసం రాష్ట్రాలు చేసే పోరాటాలు పెరుగుతున్నాయని అన్నారు. దేశానికి ఉన్న సెక్యూలర్ ముద్ర చెదిరిపోతుందని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించకుంటే ఇవన్నీ భవిష్యత్ లు భారత్ చూడబోతుందని అన్నారు.
ప్రభుత్వ డేటా..
భారత ఆర్థిక వ్యవస్థ గురించి పాలక యంత్రాంగం అంచనా వేస్తున్నదానికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతుందని అన్నారు. 'భారతదేశం ఆకలి, అసమానత, క్రోనీ క్యాపిటలిజం, చాలా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది' అని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ డేటాపై తనకు నమ్మకం లేదని, అదంతా మ్యానిపులేటేడ్ గణాంకాలు అన్నారు.
ఆర్థిక వ్యవస్థ బాగా ఉందో లేదో అని అర్థం చేసుకోవడానికి ఒక సాధారణ సూచనను ఉపయోగిస్తానని చెప్పారు. ఐదు నెలల క్రితం నుంచి పప్పులు, పంచదార వంటి ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయని అన్నారు. దేశంలో, గృహాల పొదుపు చారిత్రాత్మక కనిష్ట స్థాయి 5 శాతంగా, గృహ రుణాలు 40 శాతం చారిత్రాత్మకంగా గరిష్ట స్థాయిలో ఉన్నాయన్నారు. అయినప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదేనని చెబుతున్నారని, బీజేపీ ప్రచారంపై మండిపడ్డారు.
"మనం నిజంగా ఆర్థిక వ్యవస్థలో యూకేని దాటాం. అయితే 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాని మోదీ ఎందుకు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థలో బ్రిటన్ ని దాటగానే మనం కూడా అభివృద్ధి చెందిన దేశంగా మారాలి కదా" అని పరకాల ప్రశ్నించారు
దేశీయ పెట్టుబడులు అత్యల్పంగా..
ఇంకా, పాలక యంత్రాంగం అంచనా వేసినట్లుగా భారతదేశం ఆర్థికంగా శక్తివంతమైన స్థితిలో లేదని చూపించడానికి ప్రభాకర్ గణాంకాలను ఉదహరించే ప్రయత్నం చేశారు. "ప్రతి సంవత్సరం దాదాపు 1.5 లక్షల మంది ప్రజలు తమ పాస్‌పోర్ట్‌లను వదులుకుంటున్నారు. వీరంతా సంపన్నులు కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం" అని చెప్పారు. దేశంలో దేశీయ పెట్టుబడులు అత్యల్పంగా ఉన్నాయని, 30 శాతం నుంచి 19 శాతానికి పడిపోయాయని తెలిపారు.
పారిశ్రామికవేత్తలకు ఆర్థిక వ్యవస్థ, దేశ భవిష్యత్తుపై విశ్వాసం లేనందున పెట్టుబడులు పెట్టేందుకు ఇష్టపడడం లేదని ప్రభాకర్ అన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గించడం, ₹26 లక్షల కోట్ల కార్పొరేట్ అప్పుల మాఫీ, ఉత్పాదకత లింక్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వంటి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ, ఈ 'సంపద సృష్టికర్తలు' పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు సృష్టించడం లేదన్నారు.
రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ వాగ్దానం చేసినా, ఇరాన్, యెమెన్, సిరియా, లెబనాన్ వంటి దేశాలతో సమానంగా భారత్‌లో 24 శాతం యువత నిరుద్యోగులుగా ఉన్నారని, పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నిరుద్యోగిత 12 శాతంగా ఉంది. ILO నివేదిక ప్రకారం, భారతదేశంలోని మొత్తం నిరుద్యోగుల్లో 65 శాతం మంది విద్యావంతులని అన్నారు.
ఎలక్టోరల్ బాండ్లు
ఎలక్టోరల్ బాండ్లు దేశంలో అతిపెద్ద కుంభకోణమని అన్నారు. బీజేపీ వందకోట్ల ఫండ్లను పొందడం వల్ల దేశం వెయికోట్ల ఆదాయం కొల్పోయిందని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల వల్ల మనీలాండరింగ్ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్లను వ్యతిరేకించిన వ్యక్తులు 'పశ్చాత్తాపపడతారు' అని ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు PM మోడీ ఉద్దేశ్యం ఏమిటని ప్రభాకర్ ప్రశ్నించారు. తాము చేసిన పనికి సుప్రీంకోర్టు, న్యాయమూర్తులు పశ్చాత్తాప పడతారని ఆయన అనుకున్నారా?’’ అని ప్రశ్నించారు.
అసమానతలు..
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలు, నిరుద్యోగుల పట్ల ఎలాంటి సానుభూతి చూపడం లేదని ప్రభాకర్ దుయ్యబట్టారు, ప్రస్తుత ప్రభుత్వం దేశంలో అసమానతలను పూర్తిగా దూరం చేయలేదన్నారు. ప్రపంచ అసమానత నివేదికలోని గణాంకాలను ఉటంకిస్తూ, మన జనాభాలో 1 శాతం మంది ఉన్న ప్రజలు 22 శాతం ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని, వారి ఆస్తులు 40 శాతానికి పైగా ఉన్నాయని చెప్పారు.
దేశంలో పేదరికం పై బీజేపీ నాయకులు అపహస్యం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల సీజన్ మధ్యలో టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్ భారతదేశానికి రావడం మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు కాదా అని అడిగిన ప్రశ్నకు, ఎన్నికల కమిషనర్‌ను ఎంపిక చేసిన విధానం నిష్పాక్షికమైనది కానప్పుడు ఇవన్నీ పారదర్శకంగా ఎలా అవుతాయని ప్రశ్నించారు. విద్వేషపూరిత ప్రసంగాలపై ఎలాంటి చర్య తీసుకోలేనప్పుడు ఎలన్ మస్క్ విషయం చాలా చిన్నదన్నారు.
ఇదిలావుండగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల విశ్వసనీయతపై, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మాజీ హెడ్ సలీల్ శెట్టి, ఇది తారుమారు చేయబడుతుందనే అనుమానం ఉందని, అయితే ప్రస్తుతం తమ వద్ద ఎటువంటి రుజువు లేదని సంవిధానద హడియల్లి అనే ఫోరమ్ నిర్వహించిన చర్చలో అన్నారు.
ఎవరీ పరకాల ప్రభాకర్..
తెలంగాణ ఉద్యమం పై అవాకులుచవాకులు పేలి.. తెలంగాణ ఉద్యమం నూటొక్క అబద్దాలు అని పుస్తకం రాసిన వ్యక్తే పరకాల ప్రభాకర్. ఆ పుస్తకం రాసి తెలంగాణ సమాజం చేత ఛీత్కరించబడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వన్ సైడెడ్ గా పుస్తకం రాసారని తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More
Next Story