ఎప్పుడూ కుడివైపు నిలబడే వామపక్షవాది ఏచూరి
x

ఎప్పుడూ కుడివైపు నిలబడే వామపక్షవాది ఏచూరి

2004 నుంచి ఏచూరి భారత రాజకీయాల్లో ముఖ్యమైన వ్యక్తిగా మిగిలిపోయారు. తరువాతి ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీలు వెనుకబడినా.. ఏచూరి ప్రభావం మాత్రం అలాగే కొనసాగింది.


2004 సంవత్సరం భారత రాజకీయాలను ఒక మలుపు తిప్పింది. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని బీజేపీ "ఇండియా షైనింగ్" నినాదంతో రెండోసారి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచింది. అయితే భారతీయ ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. భారత జాతీయ కాంగ్రెస్ 145 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 272 సీట్లు అవసరం.

వామపక్షాల యుగం..

కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జీత్‌ నేతృత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) లేదా సీపీఐ(ఎం) 43 సీట్లతో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) 10 సీట్లు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పీ), ఫార్వర్డ్ బ్లాక్ ఒక్కొక్కటి మూడు స్థానాల్లో విజయం సాధించాయి. వామపక్ష కూటమికి మొత్తం 59 స్థానాలు దక్కాయి. అప్పటి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సుర్జీత్.. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి చెందిన ములాయం సింగ్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)కి చెందిన లాలూ ప్రసాద్ యాదవ్, ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)కి చెందిన ఎం కరుణానిధితో చర్చలు ప్రారంభించారు. వామపక్షాల మద్దతును కూడగట్టుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

వామపక్షాల ప్రజాకర్షక ప్రతినిధి ఏచూరి..

అప్పట్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో సుర్జీత్‌కు కుడి భుజంగా సీతారాం ఏచూరి వ్యవహరించారు. తన భాషా నైపుణ్యం, చతురతతో 1996లో పి చిదంబరంతో కలిసి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించారు. మొదటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో యుపిఎ-లెఫ్ట్ కూటమికి ఏచూరి సహకారం, వ్యూహాలు చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవాలి.

బహుముఖ సంభాషణకర్తగా..

ఆర్థిక శాస్త్రం, ఆర్థిక విషయాలపై ఏచూరికి ఉన్న లోతైన పరిజ్ఞానం.. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఆకట్టుకుంది. హిందీ, ఉర్దూ భాషలలో ఏచూరి వాగ్ధాటి.. బెంగాలీలో ఏచూరి ప్రావీణ్యం, మలయాళం, తమిళంపై అవగాహన అతన్ని బహుముఖ సంభాషణకర్తగా మార్చాయి. ఢిల్లీ సర్కిల్స్‌లో మార్క్సిస్టుల్లో ఏచూరి ఒక ప్రజాకర్షక ప్రతినిధిగా గుర్తింపు పొందారు.

యూత్ ఐకాన్..

2004 నుంచి ఏచూరి భారత రాజకీయాల్లో ముఖ్యమైన వ్యక్తిగా మిగిలిపోయారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీలు వెనుకబడినా.. ఏచూరి ప్రభావం మాత్రం అలాగే కొనసాగింది.

విద్యార్థి దశ నుంచే ఏచూరిలో నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అరెస్టు కావడానికి ముందు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రతిఘటించారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) ఛాన్సలర్‌ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాగాంధీపై గట్టిగా పోరాడారు. 1984లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు మొదటి కేరళీయేతర, బెంగాలీయేతర అధ్యక్షుడయ్యాడు. అదే సంవత్సరం అతను CPI(M) కేంద్ర కమిటీలో చేరారు. మరుసటి సంవత్సరం తన సీనియర్ ప్రకాష్ కారత్‌తో కలిసి కొత్తగా ఏర్పడిన సెంట్రల్ సెక్రటేరియట్‌లో చేరారు.

ఏచూరి ప్రసంగాల కోసమే వచ్చేవారు..

2005లో ఏచూరి పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికై కొత్త శకానికి నాంది పలికారు. రాజ్యసభలో ఆయన అనర్గళం ప్రసంగాలు విశేషంగా ఆకట్టుకునేవి. పలు సందర్భాల్లో తన పార్టీ వైఖరిని స్పష్టంగా చెప్పారు. ఇతర పార్టీలను సూటిగా విమర్శించారు. మంత్రులు, ప్రతిపక్ష నేతలు తరచూ రాజ్యసభలో ఏచూరి ప్రసంగాలకు హాజరుకావడమే పనిగా పెట్టుకున్నారు. అతని ప్రసంగాలు వారి పార్టీలను లేదా రాజకీయాలను విమర్శించినా.. ఆయన మాటల వెనక అంతరార్థం బోధపడేది. వివాదాస్పద చర్చల్లో ఏచూరి అసాధారణమైన హాస్యం అతనికి దోహదపడింది. వాడీవేడి చర్చల సమయంలో “నాకు హిందూ మతాన్ని బోధించకండి. మీలో చాలామంది కంటే నాకు హిందూ మతం గురించి ఎక్కువ తెలుసు. రామాయణం, మహాభారతం, గీతలు వివిధ భాషల్లో చదివాను. నా పేరులో కూడా సీత, రాముడు ఉన్నారు.’’ అని చమత్కరించారు.

గొప్ప మీడియా హ్యాండ్లర్..

ఏచూరి మీడియాను హ్యాండిల్ చేయడంలో నేర్పరి. మీడియాకు దూరంగా ఉంటూనే పార్టీ వార్తలకు తగిన కవరేజీ దక్కేలా చేశారు. మీడియాకు పార్టీ పదవులను వివరించి, స్పష్టత, అవగాహన కల్పించారు. ఇండో-అమెరికా అణు ఒప్పందం, యుపిఎ-వామపక్ష సమావేశాలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కీలకమైనవి. సీపీఐ(ఎం) భావజాలాన్ని ప్రచారం చేసేందుకు ఏచూరి ఈ అవకాశాలను ఉపయోగించుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ మీడియా ముందు ఇబ్బంది పడితే, పాత్రికేయుల ప్రశ్నలకు స్పష్టంగా విడమరిచి చెప్పేవారు. ప్రతి అవకాశాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకున్నారు.

ఏకాభిప్రాయ బిల్డర్..

ఏచూరి హాస్యం, తేలికైన వైఖరి. హరికిషన్ సింగ్ సుర్జీత్‌తో సుదీర్ఘ అనుబంధం ఆయనకు బూర్జువా పార్టీలతో సంకీర్ణాలుచ పొత్తుల ప్రాముఖ్యతను నేర్పింది.

ప్రత్యర్థులను పరుషంగా విమర్శించిన తర్వాత కూడా నవ్వుతూ, మొహమాటం లేకుండా కౌగిలించుకునేవారు. అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, ములాయం సింగ్, మాయావతి, డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ వంటి నాయకులతో స్నేహ సంబంధాలను కొనసాగించారు.

మేం మిమ్మల్ని మిస్ అవుతున్నాం..

రెండో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మొదటి బడ్జెట్ సెషన్ సందర్భంగా కేరళకు చెందిన లెఫ్ట్ ఎంపీలు మెమోరాండంతో సోనియాను కలవాలనుకున్నారు. వారు అధికారికంగా పాత పార్లమెంట్ భవనంలోని ఆమె గదిలోకి ప్రవేశించడానికి ముందు..సోనియా తనను కలవడానికి సిద్ధంగా ఉన్నారని ఒక గార్డు ఏచూరికి తెలిపాడు. కొందరు జర్నలిస్టులు ఏచూరితో మాట్లాడుతుండగా.. వారు కూడా ఆలోచించకుండా లోపలికి ప్రవేశించారు. ఏచూరిని చూడగానే సోనియా మొదటి రియాక్షన్.. “ఓ సీతారాం, మేం మిమ్మల్ని మిస్ అవుతున్నా్ం” అని మొదటి UPA ప్రభుత్వ హయాంలో కామ్రేడ్ల సహకారం గురించి ప్రస్తావిస్తూ అన్నారు. వామపక్ష కూటమికి ఏచూరి సమస్య పరిష్కార కర్తగా వ్యవహరించడంతో ఆయనకు కాంగ్రెస్ పెద్దలతో సత్సంబంధాలున్నాయి.

నాన్ వెజ్ ఫుడ్ లవర్..

ప్రజా సమస్యల పట్ల లోతైన అవగాహన ఉన్న వ్యక్తి ఏచూరి. కూటముల ద్వారా మతతత్వం, క్రోనీ క్యాపిటలిజాన్ని ఎదుర్కోవడానికి తన సొంత పార్టీలోని హార్డ్ కోర్ సిద్ధాంతకర్తలకు వ్యతిరేకంగా, అవిశ్రాంతంగా పోరాడాడు. చార్మినార్ సిగరెట్లను కాల్చే అలవాటు, మాంసాహారాన్ని ఇష్టపడే ఏచూరి తన మానవీయ విలువలను ఎప్పుడూ కప్పిపుచ్చుకోలేదు. నిజమైన కామ్రేడ్‌గా ఎప్పటికీ గుర్తుండిపోతారు.

Read More
Next Story