
ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్ళు ధ్వంసం
తీవ్రవాద నిరోధక చర్యలలో భాగంగా షోపియన్, కుల్గాం, పుల్వామా జిల్లాల్లో లష్కరే తోయిబా (ఎల్ఈటీ) టెర్రరిస్టుల ఇళ్లను కూల్చేసిన భద్రతా దళాలు..
26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రమూకల(Terrorists) కోసం భారత భద్రతా దళాలు అన్వేషిస్తున్నాయి. వారి కోసం జమ్మూ కశ్మీర్ అంతటా జల్లెడ పడుతున్నారు. షోపియన్, కుల్గాం పుల్వామా జిల్లాల్లో ఐదుగురు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేశారు.
షోపియన్ జిల్లా చోటిపోరా గ్రామంలో ఎల్ఈడీ కమాండర్ షాహిద్ అహ్మద్ కుట్టే ఇల్లు కూల్చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఇతను దేశ వ్యతిరేక కార్యకలాపాలను సమన్వయం చేయడంలో కీలక భూమిక పోషించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కుల్గాంలోని మతలం ప్రాంతంలో ఉగ్రవాది జాహిద్ అహ్మద్ ఇంటిని కూడా కూల్చేశారు. పుల్వామా జిల్లాలో మరో మూడు ఇళ్లను ధ్వంసం చేశారు. ముర్రాన్లో ఉగ్రవాదులు అహ్సాన్ ఉల్ హక్, కాచిపోరాలో ఎహ్సాన్ అహ్మద్ షేక్, హరిస్ అహ్మద్ ఇళ్ళును నేలమట్టం చేశారు. ఈ ముగ్గురూ ఉగ్రవాద గ్రూపులలో చురుకైన సభ్యులుగా ఉన్నారు. 2018లో పాకిస్తాన్లో ఉగ్రవాద శిక్షణ పొందిన ఎహ్సాన్ ఇటీవలే లోయలోకి తిరిగి ప్రవేశించాడు. ఇళ్ళు కూల్చివేసిన ఉగ్రవాదులందరిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
పహల్గామ్(Pahalgam) దాడి వెనుక అనుమానితులైన ఎల్ఈటీ(LeT) ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ థోకర్, ఆసిఫ్ షేక్ ఇళ్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. వీరి ఇంట్లో కొన్ని పేలుడు పదార్థాలు ఉంచినట్లు సమాచారం. గురువారం (ఏప్రిల్ 24) పహల్గామ్ దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న థోకర్, మరో ఇద్దరు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇటు అనంతనాగ్ పోలీసులు మరో ఇద్దరు అనుమానితులైన హషీమ్ ముసా అలియాస్ సులేమాన్, అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్ కోసం గాలిస్తున్నారు. వారి గురించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.20 లక్షల బహుమతి కూడా ప్రకటించారు.
సింధు జలాల ఒప్పందం రద్దు..
పహల్గామ్లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా.. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ప్రతి ఉగ్రవాదిని, వారికి మద్దతు ఇచ్చిన వారిని ఒదిలిపెట్టేది లేదని బీహార్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ హెచ్చరించిన విషయం తెలిసిందే.