ఆ ప్రాంతాన్ని న్యూయార్క్ చేస్తామంటోన్న సీఎం
x

ఆ ప్రాంతాన్ని న్యూయార్క్ చేస్తామంటోన్న సీఎం

రాష్ట్ర ప్రభుత్వం కొత్త నగరాన్ని అభివృద్ధి చేస్తుందని, ఇది న్యూయార్క్ నగరానికి పోటీగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.


రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నగరాన్ని అభివృద్ధి చేస్తుందని, ఇది న్యూయార్క్ నగరానికి పోటీగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. మహేశ్వరం, పరిసర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు పూల్ చేసిన 25 వేల ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ, మెడికల్ అండ్ హెల్త్ హబ్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లు, ఇతర అవసరాలకు వినియోగిస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడలో సీఎం రేవంత్ రెడ్డి గీతకార్మికుల సంక్షేమం, భద్రత కోసం కాటమయ్య రక్షకిట్ల పంపణీ పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రంగారెడ్డి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించే బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోనే ఉందని గుర్తు చేసిన సీఎం, ఈ ప్రాంతంలో మరో ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. రాచకొండ పరిధిలోని మునుగోడు, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు సుందరమైన లొకేషన్‌లను కలిగి ఉన్నాయని, హిందీ చిత్ర పరిశ్రమను ముంబై నుంచి ఇక్కడికి తీసుకురావాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.

ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి హైదరాబాద్‌కు అనేక ఐటీ, ఫార్మా కంపెనీలను తీసుకొచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని తలదన్నేలా రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రాచకొండ ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Read More
Next Story