ఎస్సీలను మూడు గ్రూప్లుగా విభజించాలి.. ఆమోదం తెలిపిన అసెంబ్లీ
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి.. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగానే ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్ సిఫారసు చేసినట్లు తెలిపారు. నివేదిక ప్రకారం.. ఎస్సీలలో 59ఉపకులాలు ఉన్నాయి. ఎస్సీలను గ్రూప్-1, 2, 3గా వర్గీకరించాలని సిఫార్సు చేసింది. వీటితో గ్రూప్-1లో 15 ఉపకులాలకు ఒకశాతం రిజర్వేషన్ (15ఉపకులాల జనాభా 3.288శాతం), గ్రూప్-2లో 18 ఉపకులాలకు 9శాతం రిజర్వేషన్(18 ఉపకులాల జనాభా 62.748శాతం), గ్రూప్-3లో 26 ఉపకులాలకు 5శాతం రిజర్వేషన్ (26 ఉపకులాల జనాభా 33.963శాతం) కల్పించాలని పేర్కొంది. దీనిపై అసెంబ్లీ చర్చ జరగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.
‘‘ఎస్సీ కులాల గ్రూప్లకు రోస్టర్ పాయింట్లు, క్రిమీలేయర్ విధానాన్ని కూడా అమలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఎస్సీ వర్గీకరణ, కుల గణన.. నా రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన అంవాలు. ఫిబ్రవరి 4, 2025ను నా రాజకీయ జీవితంలో చాలా ప్రత్యేకం. ఎందరో ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు దక్కింది. చాలా రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణలో ఓటు బ్యాంకు చూశాయి తప్ప.. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం మాత్రం చేయలేదు. అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం ద్వారా తరతరాలుగా నిర్లక్ష్యానికి, దోపిడీకి గురైన వారికి న్యాయం చేయాలని మేము సంకల్పించాం. ఇందులకు అన్ని పార్టీలు సహకరించాలి’’ అని రేవంత్ కోరారు.
‘‘మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణకు పోరాటం చేస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు వర్గీకరణకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దళితులకు అన్ని రంగాల్లో అపార అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. నేను 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా…నా రాజకీయ జీవితంలో నాకు ఆత్మసంతృప్తిని కలిగించిన రోజు ఇది. ఇలాంటి అవకాశం నాకు రావడం సంతోషం… చరిత్రపుటల్లో ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది. వర్గీకరణకు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలుకు చర్యలు చేపట్టింది. అతి తక్కువ సమయంలో సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు. ఆనాడు ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అడ్జర్న్ మోషన్ అందిస్తే నన్ను సభ నుంచి బయటకు పంపించారు. కానీ ఈనాడు సభా నాయకుడిగా వర్గీకరణ అమలుకుకు సభలో నిర్ణయం తీసుకుంటున్నాం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైంది. రంగుల గోడలు.. అద్దాల మేడలు కాదు… చివరి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించాలన్న అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందుకు సభ్యులందరి సహకారం ఉండాలని కోరుతున్నా’’ అని పేర్కొన్నారు.