అమెరికాలో తెలుగమ్మాయి దుర్మరణం
x

అమెరికాలో తెలుగమ్మాయి దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకి చెందిన యువతి మరణించింది. ఈ ఘటన ఆదివారం రాత్రి అట్లాంటా నగరంలో చోటు చేసుకుంది.


అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకి చెందిన యువతి మరణించింది. ఈ ఘటన ఆదివారం రాత్రి అట్లాంటా నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లికి చెందిన సౌమ్య (24) ఆగస్టు, 2022 లో పైచదువులకు అమెరికా వెళ్ళింది. అట్లాంటా ఫ్లోరిడా యూనివర్సిటీ లో నాలుగు నెలల క్రితం ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ మరో ముగ్గురు భారత విద్యార్థినులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

సౌమ్య ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో కూరగాయలు తీసుకొచ్చేందుకు కాలినడకన బయటికెళ్లింది. తిరిగొస్తుండగా వెనుక నుంచి వస్తోన్న కారు ఆమెను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సౌమ్యను అక్కడి వారు ఆసుపత్రికి తరలించారు. సౌమ్య రూంమేట్స్ ఈ విషయాన్ని ఇండియాలో ఉంటోన్న తన తల్లిదండ్రులకు సోమవారం తెల్లవారుజామున ఫోన్ చేసి చెప్పారు.

అయితే, అప్పటికే సౌమ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచింది. సౌమ్య మరణించిన కాసేపటికి తన స్నేహితులు మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి ఆమె మరణవార్తని తెలిపారు. దీంతో సౌమ్య తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కష్టపడి చదివించుకున్న కూతురు ఉన్నత చదువుల కోసం అమెరికాకి వెళ్లిందని ఎంతో గర్వంగా ఉన్నారు. చదువు పూర్తి చేసుకుని జాబ్ ప్రయత్నాల్లో ఉన్న తమ కుమార్తె మంచి ఉద్యోగం సంపాదిస్తుందని, కూతురి జీవితం బావుంటుందని ఆశపడిన ఆ తల్లిదండ్రులు వినలేని వార్త విని గుండెలవిసేలా రోదిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు రోడ్డు ప్రమాదానికి బలయిందని తల్లడిల్లుతున్నారు.

కాగా, సౌమ్య తల్లిదండ్రులు గుడ్ల కోటేశ్వరరావు, బాలామణిలు యాదగిరిపల్లిలో కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇండియన్ ఎంబసీతో మాట్లాడి కూతురి మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Read More
Next Story